Ajith Kumar - Adhik Ravichandran: కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కుమార్.. సినిమాల విషయంలో ఎప్పుడూ పెద్దగా తొందరపడలేదు. ఎప్పుడూ నిదానంగానే ఒక సినిమా అయిపోయిన తర్వాతే మరొకదాని గురించి ఆలోచిస్తారు. ప్రస్తుతం తను ‘విడా ముయర్చి’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తవ్వక ముందే తన అప్‌కమింగ్ మూవీపై అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. దీంతో అజిత్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అజిత్.. తన కెరీర్‌లోని 63వ చిత్రం కోసం ఒక యంగ్ డైరెక్టర్‌తో చేతులు కలపనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో పాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.


డిఫరెంట్ టైటిల్..


అజిత్.. తన కెరీర్‌లోని 63వ చిత్రం కోసం యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్‌తో చేతులు కలపనున్నారు. అధిక్.. ఇప్పటికే విశాల్ హీరోగా ‘మార్క్ ఆంటోనీ’ అనే సినిమాను తెరకెక్కించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇక అజిత్, అధిక్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. దీనికి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్‌ను నిర్మాతలతో పాటు దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. 2024 జూన్‌లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి, 2025 సంక్రాంతికి దీనిని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.






ఎమోషనల్ మూమెంట్..


అధిక్ రవిచంద్రన్‌కు అజిత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ విషయాన్ని చాలాసార్లు తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు కూడా. అంతలా తనను అభిమానించే హీరోను డైరెక్ట్ చేసే అవకాశం దక్కినందుకు అధిక్ సంతోషానికి హద్దులు లేవు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ తన సంతోషాన్ని బయటపెట్టాడు ఈ యంగ్ డైరెక్టర్. ‘‘ప్రతీ ఒక్కరి జీవితంలో, కెరీర్‌లో మర్చిపోలేని సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ నా జీవితంలో మాత్రం ఇది నమ్మలేని విషయం. అజిత్ సార్‌తో పనిచేయడం అనేది నా కల. అలాంటిది ఆ కల నెరవేరుతుండడం నాకు చాలా ఎమోషనల్ మూమెంట్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు థ్యాంక్స్’’ అని అజిత్‌తో మరోసారి తన అభిమానాన్ని బయటపెట్టాడు అధిక్.


‘మార్క్ ఆంటోనీ’తో గుర్తింపు..


ఇక ఇప్పటికే ‘మార్క్ ఆంటోనీ’ చిత్రం వల్ల అధిక్ రవిచంద్రన్ టాలెంట్ ఏంటో ప్రేక్షకులకు తెలిసింది. టైమ్ ట్రావెల్ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం క్లీన్ హిట్‌ను అందుకుంది. ఇందులో విశాల్ హీరోగా నటించగా రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా కనిపించారు. ఎస్‌జే సూర్య విలన్ పాత్ర పోషించాడు. ‘మార్క్ ఆంటోనీ’ ప్రమోషన్స్ సమయంలో అధిక్ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు విశాల్. దీంతో కోలీవుడ్ మేకర్స్‌లో తనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. అందుకే మైత్రీ మూవీ మేకర్స్ సైతం తన సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చింది. ఇక అజిత్, అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నాడు.


Also Read: నేను పాత వార్త అయిపోకూడదు, ఆ భయాన్ని అధిగమించాలి - సమంత