Aishwarya Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్ గా పరిచయమైన చిత్రం '3'. ఇందులో ఆమె మాజీ భర్త ధనుష్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. 2012లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా కోసం రాక్ స్టార్ అనిరుధ్ కంపోజ్ చేసిన 'వై దిస్ కొలవెరి' పాట ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులందరినీ ఓ ఊపు ఊపేసిన ఈ పాట.. యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టించింది. అయితే ఈ చార్ట్ బస్టర్ సాంగ్ సినిమా విజయానికి ఏమాత్రం దోహద పడలేదు. ఇదే విషయంపై తాజాగా ఐశ్వర్య మాట్లాడింది.


'లాల్ సలాం' ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో '3' సినిమా పరాజయంపై ఐశ్వర్యా రజనీకాంత్ స్పందించింది. 'వై దిస్ కొలవెరి' పాట అంత పెద్ద సక్సెస్ అవ్వడం సినిమా కంటెంట్‌ మీద ప్రభావం చూపించిందని అభిప్రాయ పడింది. కంటెంట్ చాలా సీరియస్‌గా ఉంటుంది.. కానీ ఈ పాట సినిమాపై భిన్నమైన అంచనాలను నెలకొల్పిందని, ఫలితంగా ప్రేక్షకులు నిరాశ చెందారని చెప్పింది. ఆ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కెరీర్‌కు సహాయపడినందుకు తాను సంతోషంగా ఉన్నానని తెలిపింది.


''వై దిస్ కొలవెరి సాంగ్ పెద్ద హిట్టైంది. సినిమా రిలీజ్ కు ముందే ఆ పాట జనాల్లోకి వెళ్లిపోయింది. సినిమాలో కంటంట్ ని మించిపోయేంతలా ఆ పాట సక్సెస్ అయ్యింది. దాంతో ఈ సినిమా సబ్జెక్ట్ చాలా సీరియస్ గా ఉంటుంది. పాటను విన్న వారంతా డిఫరెంట్ ఎక్సపెక్టేషన్స్ తో థియేటర్స్ కు వచ్చారు. దాంతో సినిమా వాళ్ళకి నచ్చలేదు" అని ఐశ్వర్య రజనీకాంత్ చెప్పింది. రీ-రిలీజ్ లో 3 చిత్రానికి మంచి ఆదరణ లభించడానికి కారణం అప్పటికి ఆ పాట మ్యాజిక్ తగ్గిపోవడమే అని అభిప్రాయపడింది.


“3 సినిమా రీరిలీజ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అలాగే టీవీల్లో టెలికాస్ట్ చేసినప్పుడు చాలా మందికి నచ్చింది. ఎందుకంటే అప్పటికి ఆ పాట మ్యాజిక్ తగ్గింది. అలా సినిమాకు పాటే అడ్డంగా నిలిచింది. అయితే నా సినిమాలో పాట అనిరుధ్ రవిచందర్ కెరీర్ ని నెంబర్ స్టేజీకు తీసుకెళ్లినందుకు నేను ఆనందపడతాను” అని ఐశ్వర్య రజనీకాంత్ చెప్పుకొచ్చింది.


కాగా, 3 తర్వాత 'వాయ్ రాజా వాయ్' అనే సినిమాకి తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు 'లాల్ సలాం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. రజనీకాంత్ స్పెషల్ రోల్ లో నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ ప్రత్యేక అతిధి పాత్రలో కనిపించారు. ఫిబ్రవరి 9న విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. తమిళ్ లో కాస్తో కూస్తో వసూళ్లు రాబడుతోంది కానీ, తెలుగులో మాత్రం రెండో రోజు నుంచే వైట్ వాష్ అయిపోయింది.


Also Read: 'హరి హర వీరమల్లు' వెనుక అసలేం జరుగుతోంది?