హీరోయిన్ అదా శర్మ.. అనుకోకుండా ఆసుప్రతిపాలైంది. తన అప్‌కమింగ్ షో ‘కమాండో’ ప్రమోషన్స్ సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్రమైన ఫుడ్ ఎలర్జీ, డయేరియాకు గురైన ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రస్తుతం డాక్టర్లు అదా శర్మను అబ్జర్వేషన్‌లో పెట్టినట్టు సమాచారం. మంగళవారం అదా శర్మ ఆరోగ్యం దెబ్బతిన్నడంతో తనను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ తనకు డయేరియాతో పాటు ఫుడ్ ఎలర్జీ కూడా అయినట్టు తెలిపారు. అదా ఒక్కసారిగా చాలా ఒత్తిడికి లోనయ్యిందని, దాంతో పాటు డయేరియాతో బాధపడుతుండడంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేశామని, ప్రస్తుతం తను అబ్జర్వేషన్‌లో ఉందని సన్నిహితులు బయటపెట్టారు. ఇప్పటికీ అదా నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఫ్యాన్స్ అంతా అసలు తన ఆరోగ్యం ఎలా ఉందో అని మరింత ఆందోళన చెందుతున్నారు.


‘కమాండో’ వెబ్ సిరీస్ గురించి..


ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తాజాగా తన కొత్త వెబ్ సిరీస్ ‘కమాండో’ను విడుదల చేయడానికి సిద్ధపడుతోంది. ఇప్పటికే కమాండో అనే టైటిల్‌తో ఫిల్మ్ ఫ్రాంచైజీ ఉంది. ఆ ఫిల్మ్ ఫ్రాంచైజీకి చెందిన స్పిన్ ఆఫ్ కథతోనే కమాండో వెబ్ సిరీస్ కూడా తెరకెక్కింది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 3 ‘కమాండో’ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్‌లో యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ అలరించాడు. కానీ ఈ వెబ్ సిరీస్ కోసం మాత్రం ప్రేమ్ పరీజా అనే కొత్త నటుడిని హీరోగా ఎంపిక చేశారు. విపుల్ అమృత్‌లాల్ షా.. ఈ ‘కమాండో’ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశాడు. ‘కమాండో’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అదా శర్మనే మళ్లీ ఈ సిరీస్ కోసం కూడా హీరోయిన్‌గా ఎంపిక చేశారు. జులై 31న కమాండో వెబ్ సిరీస్ హాట్‌స్టార్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.


ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలయిన ‘కమాండో’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ట్రైలర్‌కు యాక్షన్ లవర్స్ ఫిదా అయిపోతున్నారు. పాకిస్థాన్.. ఇండియాపై ఒక భయంకరమైన బయో ఆయుధం తయారు చేస్తుంది అనే అంశంతో ట్రైలర్ మొదలయ్యింది. అయితే ఇండియన్ స్పై క్షితిజ్.. పాకిస్థాన్ ప్రయోగాన్ని తిప్పకొడతాడు. ఇక ఈ సిరీస్‌లో క్షితిజ్ పాత్రను వైభవ్ తత్వావాడి పోషించారు. తన ప్రయత్నాలకు ఫలితంగా క్షితిజ్‌ను అరెస్ట్ చేసి సాహివాల్ జైలులో ఖైదీగా బంధిస్తారు. అప్పుడే కమాండో విరాట్‌గా హీరో ప్రేమ్, భావనా రెడ్డిగా అదా శర్మ.. రంగంలోకి దిగుతారు. క్షితిజ్‌ను ఎలా కాపాడుతారు అనే అంశాన్ని సిరీస్‌లో చూసి తెలుసుకోండి అన్నట్టుగా మేకర్స్.. ఈ ట్రైలర్‌ను చాలా ఆసక్తికరంగా ముగించారు. 


వెబ్ సిరీస్‌పై అదా స్పందన..


2013లో కమాండో సినీ ఫ్రాంచైజ్ మొదలయ్యింది. కమాండ్ వన్ మ్యాన్ ఆర్మీ టైటిల్‌తో ఈ ఫ్రాంచైజ్‌లో మొదటి చిత్రం తెరకెక్కింది. ఇందులో విద్యుత్ జమ్వాల్, పూజా చోప్రా లీడ్ రోల్స్‌లో నటించారు. ఇక 2017లో కమాండో సీక్వెల్ విడుదలయ్యింది. దాని పేరే ది బ్లాక్ మనీ ట్రయల్. ఇందులో పూజా చోప్రా స్థానంలోకి అదా శర్మ వచ్చి చేరింది. 2019లో వచ్చిన కమాండో 3లో కూడా అదా శర్మనే హీరోయిన్‌గా నటించింది. ఇక కేరళ స్టోరీ లాంటి హిట్‌ను ఖాతాలో వేసుకున్న అదా శర్మ.. తను అస్వస్థతకు గురికాకముందు కమాండో వెబ్ సిరీస్‌లో నటించడంపై తన స్పందన బయటపెట్టింది. ‘కమాండో 2,3లో నేను భావన రెడ్డి పాత్రను పోషించారు. కమాండో ఎక్కడ ఉంటే భావన రెడ్డి అక్కడ ఉంటుంది. అది కాసేపు అయినా సరే ఉంటుంది. ఓటీటీలో విడుదల కానున్న కమాండోకు, సినిమాకు భావన ఒక కనెక్షన్‌లాగా ఉంటుంది’ అని తెలిపింది అదా.


Also Read: తమిళనాట అన్ని థియేటర్లలోనూ 'జైలర్' - రజనీకి ఎగ్జిబిటర్స్ రిక్వెస్ట్