సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గత కొంత కాలంగా మైయోసైటిస్ అనే ఆటో ఇమ్యునో వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ట్రీట్మెంట్ కోసం ఇటీవల అమెరికాకు వెళ్లిన సామ్.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అక్కడి విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆమె తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌ గా మారింది. 


సమంత హాస్పిటల్ లో బెడ్‌ మీద పడుకొని చేతికి సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటోని గురువారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పోస్ట్ చేసింది. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ సహాయం పొందుతున్నట్లు చెబుతూ.. దాని వల్ల తనకు కలిగే ప్రయోజనాల గురించిన వివరాలను పంచుకుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందని, ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ మెరుగవుతుందని, కండరాల శక్తివంతంగా అవుతాయని, ఎముకలు బలాన్ని పెంచుకోవచ్చని, గుండెకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పని చేస్తుందని, వైరస్ లతో పోరాడుతుందని సామ్ రాసుకొచ్చింది. 


ఇంట్రావీనస్ న్యూట్రిషన్ అనేది ప్రధానంగా పోషకాహార లోపాలను పరిష్కరించడానికి ఇవ్వబడుతుందని, కొన్ని వైద్య పరిస్థితులకు రోగ లక్షణ ఉపశమనాన్ని అందిస్తుందని సమంత పేర్కొంది. ఏదేమైనప్పటికీ, IV న్యూట్రిషనల్ థెరపీ మాత్రమే వ్యాధులకు నివారణ కాదని, ప్రత్యేక వైద్య పరిస్థితులలో కాంప్లిమెంటరీగా లేదా సపోర్టివ్ ట్రీట్మెంట్ గా ఉపయోగించవచ్చని తెలిపింది. ఇది రోగి యొక్క పరిస్థితిని బట్టి వారి కన్సల్టింగ్ ఫిజిషియన్ ద్వారా తీసుకోవాలని ఇంస్టాగ్రామ్ స్టోరీలో సామ్ తెలిపింది.


Also Read: ఓటీటీలోకి రాబోతున్న షారుఖ్ 'జవాన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


ఇటీవల 'ఖుషి' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన సమంత, తన ఆరోగ్య పరిస్థితి కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకుంది. తన ఆరోగ్యంపై దృష్టి సారించి మయోసైటిస్‌ చికిత్స కోసం యూఎస్ వెళ్ళింది. విరామ సమయంలో తన స్నేహితుతులతో కలిసి వివిధ ప్రదేశాల్లో విహరిస్తూ, ప్రకృతిని ఆస్వాదిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు హాస్పిటల్ లో వైద్య సహాయం పొందుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సామ్ వీలైనంత త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. 


సమంత గతేడాది ప్రాణాంతకమైన మైయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతున్నట్లు ప్రకటించింది. ఆసుపత్రిలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటోంది. మయోసైటిస్ చికిత్సలో భాగంగా అధిక మోతాదులో స్టెరాయిడ్స్ తీసుకోవాల్సి వస్తోందని.. స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకోవడంతో చర్మ సంబంధిత సమస్యలు వచ్చాయని ఈ మధ్య ఇన్‌స్టా చిట్ చాట్ లో తెలిపింది. పిగ్మెంటేషన్‌ తో చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పింది. 


ప్రస్తుతానికి ప్రాజెక్ట్స్ ఏమీ సైన్ చేయలేదని సమంత స్పష్టం చేసింది. ఆమె త్వరలోనే 'సిటాడెల్' అనే స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ తో రాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇది రూసో బ్రదర్స్ 'సిటాడెల్‌' అమెరికన్‌ టీవీ సిరీస్‌ కు ఇండియన్‌ వెర్షన్. రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో రూపొందుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు.


Also Read: ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో యాంగ్రీ మ్యాన్? సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న సీనియర్ హీరో?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial