కోలీవుడ్ అగ్ర హీరో ధనుష్ భాషలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి హీరో ఓ సినిమా చేసి దాన్ని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తుంటే.. ధనుష్ మాత్రం ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో స్ట్రైట్ మూవీస్ చేస్తూ టాలెంటెడ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందే ప్రయత్నం చేస్తున్నాడు. కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, అనే తేడా లేకుండా.. కథ నచ్చితే ఆ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అలా సౌత్ నుంచి నార్త్ వరకు డిఫరెంట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ధనుష్ ఇప్పుడు బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా బాలీవుడ్లో తనకు సాలిడ్ డెబ్యూ హిట్ ఇచ్చిన ఆనంద్ ఎల్ రాయ్ తో సినిమా చేస్తుండడం విశేషం. ఆనంద్ ఎల్ రాయ్ - ధనుష్ కాంబినేషన్లో 'రాంజనా' సినిమా రిలీజ్ అయ్యి సుమారు పదేళ్లు అవుతుంది. ఈ సినిమాతోనే ధనుష్ బాలీవుడ్ కి హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఇక ఈ సినిమా బాలీవుడ్లో మంచి సక్సెస్ అందుకొని ధనుష్ కి సాలిడ్ డెబ్యూ హిట్ ఇచ్చింది.


ఇక ఆ తర్వాత 2021 లో వచ్చిన 'అత్రంగిరే' సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని కూడా ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేసారు. అలా 'రాంజనా', 'అతరంగిరే' సినిమాలతో రెండు హిట్స్ అందుకున్న ఈ కాంబినేషన్ ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా చేయడానికి రెడీ అయింది. తాజాగా మేకర్స్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకి 'తేరే ఇష్క్ మే'(Tere Ishk Mein) అనే టైటిల్ ని ఖరారు చేస్తూ ఓ వీడియోని రిలీజ్ చేయగా ఈ వీడియోలో ధనుష్ బాగా పెరిగిన జుట్టు గుబురు గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోని బట్టి చూస్తుంటే పదేళ్ల క్రితం వచ్చిన 'రాంజనా' సినిమాకి ఇది సీక్వెల్ గా ఉండబోతున్నట్లు స్పష్టమవుతుంది. టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో తోనే సినిమాపై ఒక్కసారిగా క్యూరియాసిటీ పెంచేశారు మేకర్స్. కలర్ ఎల్లో ప్రొడక్షన్స్ బ్యానర్ పై హిమాన్షు శర్మ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.


2024లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హీరో ధనుష్ తన ట్విట్టర్ వేదికగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్పెషల్ నోట్ ను అభిమానులతో పంచుకున్నారు. ఆ నోట్లో ధనుష్ పేర్కొంటూ.. 'రాంజనా' వచ్చి పది సంవత్సరాలు అయింది. కొన్ని సినిమాలు మన జీవితాల్ని మార్చేస్తాయి. అలాంటి సినిమాల్లో ఈ 'రాంజనా' సినిమా ఒకటి. ఈ సినిమా మన అందరి జీవితాలు మార్చేసింది. 'రాంజనా' లాంటి క్లాసిక్ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మళ్లీ దశాబ్ద కాలం తర్వాత అదే 'రాంజనా' ప్రపంచం నుంచి 'తేరే ఇష్క్ మే' అనే సినిమా వస్తుంది. నాకోసం ఎలాంటి జర్నీ ఎదురు చూస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా ఇది మాతో పాటూ మీ అందరికీ ఓ అడ్వెంచర్ లాగా ఉంటుంది" అంటూ ధనుష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ధనుష్ పోస్ట్ చేసిన ఈ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.