అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో అద్భుతంగా నటించారు. దశాబ్దాల తరబడి అగ్ర నటిగా కొనసాగారు.  దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి సినిమాలు చేశారు. భారతీయ సినీ పరిశ్రమలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1990వ దశకంలో ఆమె నటనకు విరామం ప్రకటించారు.  2012లో ‘ఇంగ్లీష్ వింగీష్’ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.


శ్రీదేవి గురించి ఆదిల్ హుస్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఈ చిత్రంలో తనతో పాటు కలిసి నటించిన ఆదిల్ హుస్సేన్ తాజాగా శ్రీదేవి గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా సమయంలో ఆమెతో ఏర్పడిన అనుబంధం గురించి చెప్పారు.‘ఇంగ్లీష్ వింగీష్’ సెట్ లో దివంగత నటి శ్రీదేవిని తొలిసారి కలిసినట్లు ఆదిల్ హుస్సేన్ తెలిపారు. ఆ సమయంలో తన మాటలు విని ఆమె కంటతడి పెట్టుకుందని చెప్పారు.  ఇంతకీ ఆయన ఏం చెప్పారు? ఆమె ఎందుకు కంటతడి పెట్టుకుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ఆదిల్ మాటలు విని కంటతడి పెట్టిన శ్రీదేవి


శ్రీదేవితో కలిసి నటించే సమయంలో ఆమెతో కొన్ని విషయాలను చెప్పాను అన్నారు ఆదిల్. తన కెరీర్ లో మూడో సినిమానే ఆమెతో కలిసి నటించడం తన జీవితంలో మర్చిపోలేనన్నారు. ‘ఇంగ్లీష్ వింగీష్’ షూటింగ్ సందర్భంగా శ్రీదేవితో క్లాసిక్ మూవీ 'స‌ద్మా' గురించి మాట్లాడినట్లు చెప్పారు. ఈ సినిమాలో శ్రీ‌దేవి నటన తనపై ఎలాంటి ప్రభావం చూపిందో వివరించానన్నారు. ఈ మూవీ చూసి తాను ఓ రోజంతా అన్నం తినలేదని చెప్పారు. “గౌరీ-బాల్కీ  శ్రీదేవికి నన్ను పరిచయం చేశారు.  ఆమె విశాలమైన కళ్లతో నా వైపు చూసింది. ఆమెతో మాటలు కలిపాను. మాటల సందర్భంలో శ్రీ‌దేవి న‌టించిన 'సద్మా' గురించి ప్రస్తావించాను. ఈ సినిమాను చూసి రోజంతా తాను ఏమీ తినలేకపోయానని చెప్పాను. నా మాటలు విని ఆమె కళ్ల నుంచి జలజలా నీళ్లు రాలాయి. ఆమె కంటతడి చూసి నాకు చాలా బాధేసింది. ఆ తర్వాత మేము షూటింగ్ లోకి వెళ్లిపోయాం” అని ఆదిల్ వెల్లడించారు.


ఆమె కచ్చితంగా ఆస్కార్ తెచ్చేది- ఆదిల్


శ్రీదేవి నటన గురించి ఆదిల్ చాలా గొప్పగా చెప్పారు. ఆమె చాలా సున్నిత మనస్కురాలు అన్నారు. ఆమెను హాలీవుడ్ లెజెండ్ మెరిల్ స్ట్రీప్‌ తో ఆమెను కంపేర్ చేశారు. ఒకవేళ తను  హాలీవుడ్ సినిమాలు చేస్తే, కచ్చితంగా ఆమెకు ఆస్కార్ అవార్డు వచ్చేదని అభిప్రాయపడ్డారు. శ్రీదేవి లెగసీని కొనసాగించడం చాలా కష్టమైన పని అయినప్పటికీ, ఆమె కూతురు జాన్వీ కపూర్ ఫుల్ ఫిల్ చేసే అవకాశం ఉందని చెప్పారు. ఆమె కష్టపడి పని చేస్తే తప్పకుండా తల్లి మాదిరిగా తయారు అవుతుందన్నారు. ఇప్పటికే జాన్వీ అద్భుతంగా నటిస్తోందని ఆయన ఆదిల్ అభిప్రాయపడ్డారు.        


Read Also: కమెడియన్​తో జతకట్టనున్న ‘చంద్రముఖి 2‘ బ్యూటీ, త్వరలో అధికారిక ప్రకటన!









Join Us on Telegram: https://t.me/abpdesamofficial