ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ ప్రొడ్యూసర్స్ లలో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, హిందీ తమిళ భాషల్లోనూ సినిమాలను నిర్మిస్తున్నారు. దిల్ రాజు నిర్మాతగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా 20 ఏళ్ళు అయింది. ఆయన నిర్మించిన తొలి సినిమా 'దిల్' వచ్చి రెండు దశాబ్దాలు పూర్తైన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా పలు ఆసక్తిరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు. 


నిర్మాతగా 20 ఏళ్ళు పూర్తి చేసుకోవడంతో, దిల్ రాజు సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ట్విట్టర్ లో చిట్ చాట్ నిర్వహించి, నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ 'మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి?' అని ప్రశ్నించాడు. దీనికి నిర్మాత స్పందిస్తూ.. ''అత్యుత్తమ సాంకేతిక సిబ్బంది మరియు ఉత్తేజకరమైన స్టార్ కాస్ట్‌తో 'జటాయు' పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నాను'' అని రిప్లై ఇచ్చారు. దిల్ రాజు తన కలల ప్రాజెక్ట్ ఇదేనని చెప్పడంతో.. ఇప్పుడు 'జటాయు' అనేది నెట్టింట వైరల్ అవుతోంది.






నిజానికి 'జటాయు' అనే సినిమా చేయనున్నట్లు దిల్ రాజు ఇది వరకే వెల్లడించారు. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఈ మూవీ గురించి ఎలాంటి సమాచారం లేదు. మళ్ళీ ఇన్నాళ్లకు దిల్ రాజు స్వయంగా తన డ్రీం ప్రాజెక్ట్ ని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ జటాయు ఏంటి? ఇందులో హీరోగా ఎవరు నటిస్తారు? అనే చర్చ మొదలైంది.


రామాయణ ఇతిహాసం ప్రకారం... సీతను లంకకు తీసుకెళ్తున్నప్పుడు రావణుడి బారి నుండి రక్షించడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి జటాయుడు. రావణుడితో పరాక్రమంగా పోరాడగా.. అతని రెక్కలను విరిచి తీవ్రంగా గాయపరుస్తాడు. జీవితంతో పోరాడుతున్నప్పుడు కూడా, జటాయువు సీతాపహరణ సమాచారాన్ని రాముడికి తెలియజేస్తాడు. ఇక జటాయువు బ్రతకడని గ్రహించి, విష్ణువు అవతారమైన రాముడు, ఆయనకు మోక్షం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు చెప్తున్న 'జటాయు' సినిమాలో ఎలాంటి కథను చూపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 


Also Read బాలకృష్ణతో సినిమా నా కోరిక, చిరుతో పూనకాలు లోడింగ్ - స్టార్స్‌తో సినిమాలపై 'దిల్' రాజు క్రేజీ అప్డేట్స్


ఇక 'జటాయు' సినిమాలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ భాగమవుతాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఎస్వీసీ బ్యానర్ లో యష్ తో సినిమా ఉంటుందని దిల్ రాజు ట్వీట్ చేయడం ఈ వార్తలకు మరింత ఊతం ఇచ్చింది. ఈ నేపథ్యంలో Yash20 హ్యాష్ ట్యాగ్ తో అభిమానులు ట్వీట్లు పెడుతున్నారు. మరి త్వరలోనే మేకర్స్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. 


ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ బాబుతో తప్పకుండా సినిమా ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని దిల్ రాజు తెలిపారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కమిట్మెంట్స్ పూర్తైన తర్వాత తమ బ్యానర్ లో మూవీ చేస్తారని చెప్పారు. మాస్ మహారాజా రవితేజతో సినిమా ఉంటుందా? అని అడిగితే.. పూనకాలు లోడింగ్ అని సమాధానమిచ్చాడు. అలానే మెగాస్టార్ చిరంజీవితో ఒక మాస్ ఎంటర్టైనర్ చేయమని అడిగితే.. అతి త్వరలో పూనకాలు లోడింగ్ అని దిల్ రాజు బదులిచ్చారు. నందమూరి బాలకృష్ణతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పిన నిర్మాత.. పవన్ కళ్యాణ్ తో ఇంకో మూవీ ఉంటుందని వెల్లడించారు. ''మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా బాగుంది. మీ సపోర్ట్ తో నా 20 ఏళ్ళ సినీ ప్రయాణాన్ని మోస్ట్ మెమరబుల్ గా చేసినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో సంవత్సరాల కోసం ఎదురు చూస్తున్నాను'' అని దిల్ రాజు పేర్కొన్నారు.


Also Read : గ్యాంగ్‌స్టరా? స్మగ్లరా? టెర్రరిస్టా? యాక్షన్‌తో కుమ్మేసిన అరుణ్ విజయ్ & అమీ