Chiranjeevis luxury farm house in Bangalore: మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బంధుమిత్రులతో కలిసి మూడు రోజుల పాటు ఆడుతూ పాడుతూ సరదగా గడిపారు. అందంగా ముస్తాబు చేసిన ఫామ్ హౌస్ లో ఘుమఘుమలాడే వంటకాలు, పిండి వంటలను లొట్టలేసుకుంటూ తింటూ ఎంజాయ్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి పిల్లలు  ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ మాత్రం రాజకీయాలతో పాటు సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటంతో ఈ వేడుకల్లో పాల్గొనలేదు. పవన్ కల్యాణ్ కుమారుడు అకీరా నందన్, కుమార్తె ఆద్య ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. 


దేవనహళ్లిలో చిరంజీవి ఫామ్ హౌస్






మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు చిరంజీవి ఫామ్ హౌస్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. ఆ ఫామ్ హౌస్ ఎక్కడుంది? దానికి ఖరీదు ఎంత ఉంటుంది? ఎప్పుడు దాన్ని కొనుగోలు చేశారు? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి కొనుగోలు చేసిన ఈ విలాసవంతమైన ఫామ్ హౌస్ బెంగళూరుకు సుమారు 40 కిలో మీటర్ల దూరంలో దేవనహళ్లి ప్రాంతంలో ఉంది. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలో ఉంటుంది. దేవనహళ్లి టిప్పు సుల్తాన్ జన్మస్థలం కాగా, ఈ ప్రాంతాన్ని మైసూర్ టైగర్ అని పిలుస్తారు. ఈ ఫామ్ హౌస్ ఖరీదు సుమారు రూ. 30 కోట్లకు పైనే ఉంటుందని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీకి సంబంధించిన పండుగలు, వేడుకలను తరచుగా ఈ ఫామ్ హౌస్ లో జరుపుకుంటారు. బంధువులు, మిత్రులు అంతా అక్కడికి చేరుకుని ఆనందంగా గడుపుతారు. సంక్రాంతి సందర్భంగానూ కుటుంబ సభ్యులు, బంధువులు పాల్గొన్నారు. హ్యాపీగా, జాలీగా ఎంజాయ్ చేశారు.


'విశ్వంభర' సినిమా చేస్తున్న మెగాస్టార్


ఇక మెగాస్టార్ చిరంజీవి గతేడాది సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు. ఆగస్టులో 'భోళా శంకర్' విడుదలై దారుణ పరాజయం పాలైంది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించగా మెహర్ రమేష్ డైరెక్షన్‌ చేశారు. తమిళంలో అజిత్ ‘వేదాళం’ సినిమాను తెలుగులోకి రీమేక్‌ చేసి ఇక్కడి నేటివిటీకి తగినట్లుగా దర్శకుడు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. తమన్న హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది.  తాజాగా వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' అనే సినిమా చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేయడంతో పాటు వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  కీరవాణి సంగీతమందిస్తున్న ఈ చిత్రం, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది.


Read Also: తేజా, నేను ఎనిమిదేళ్ల నుంచి చాలా సినిమాలు చర్చించాం, కొన్ని చివరి నిమిషంలో ఆగిపోయాయి: ప్రశాంత్ వర్మ