ప్రముఖ సంగీత దర్శకుడు బప్పి లహిరి(69) కన్నుమూశారు. బుధవారం ఉదయం అనారోగ్యంతో ఆయన చనిపోయారు. తెలుగులో 'సింహాసనం', 'గ్యాంగ్ లీడర్', 'స్టేట్ రౌడీ', 'రౌడీ అల్లుడు' వంటి సినిమాలకు బప్పి లహిరి సంగీతం అందించారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.


మెగాస్టార్ చిరంజీవి  బప్పి లహిరికి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ''లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బప్పి లహిరి మరణం నన్ను కలచి వేస్తుంది. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. నా సినిమాల కోసం చార్ట్‌బస్టర్‌లను అందించారు. ఆ పాటలు నా సినిమాల పాపులారిటీని మరింత పెంచాయి. అతడి యూనిక్ స్టైల్, మ్యూజిక్ పట్ల ఉత్సాహం ఎప్పటికీ మర్చిపోనివ్వదు'' అంటూ బప్పి లహిరితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. చిరు నటించిన ఎన్నో హిట్టు సినిమాలకు బప్పి మ్యూజిక్ అందించారు. 






చిరుతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి చాలా మంది ప్రముఖులు బప్పి లహిరికి నివాళులు అర్పించారు. మోహన్ బాబు సైతం ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. బప్పి లహిరి మరణవార్త ఎంతగానో బాధిస్తుందని.. అలాంటి లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ తో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఉందని అన్నారు. తను నటించిన మూడు హిట్టు సినిమాలకు బప్పి మ్యూజిక్ అందించారని.. ఆ సినిమాల్లో బప్పి పాటలు కీలకపాత్ర పోషించాయని చెప్పుకొచ్చారు. చాలా కాలంగా అతడితో మంచి అనుబంధం ఉందని అన్నారు. ఆయన ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకున్నారు.