మెగాస్టార్ చిరంజీవి కుమార్తె కొణిదెల సుష్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా ఇప్పటికే ‘షూట్ అవుట్ ఎట్ అలైర్’ అనే వెబ్ సీరిస్‌ను ‘జీ5’లో విడుదల చేశారు. తాజాగా మరో వెబ్‌సీరిస్‌ను కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని ఓ చిత్రం టైటిల్‌ను ప్రకటించనున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  


‘‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా మీకు మరో ఫన్ అందించబోతున్నామని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. డాడీ బర్త్‌డే నేపత్యంలో ఆగస్టు 21న అదెంటో వెల్లడిస్తాం’’ అని సుష్మిత పేర్కొన్నారు. ఆమె పోస్టు చేసిన వీడియో ప్రకారం.. అది ప్రేమ కథలా అనిపిస్తోంది. అయితే, అది వెబ్‌సీరిస్ లేదా సినిమానా అనేది ఇంకా తెలియరాలేదు. ఈ చిత్రానికి ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించనున్నారు.


గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి విడుదలైన ‘షూట్ అవుట్ ఎట్ అలైర్’ వెబ్‌సీరిస్‌లో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబరు 25 నుంచి జీ5‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌సీరిస్‌కు ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. ఈ సిరిస్‌లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. సంపత్ రాజ్, నందినీ రాయ్, శరణ్యలో ఇతర పాత్రల్లో కనిపిస్తారు. ఇందులో ప్రకాశ్ రాజ్ డీఎస్పీగా సూర్యనారాయణ పాత్రలో, శ్రీకాంత్ ఐజీ ప్రవీణ్ చాంద్‌గా నటించారు. ఓ టెర్రరిస్ట్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 



చిరంజీవి ఒకవైపు సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటూనే టాలీవుడ్ సమస్యలపై దృష్టిపెట్టారు. తాజాగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ పెద్దలతో ఆయన ఇంట్లో సమావేశమయ్యారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా, లాక్‌డౌన్ వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, టికెట్ ధరలు తదితర విషయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించుకున్నారు. చిరు పుట్టిన రోజు నేపథ్యంలో ‘ఆచార్య’ నుంచి మరో సర్‌ప్రైజ్ రావచ్చని అభిమానులు భావిస్తున్నారు. 


Also Read: జిమ్‌లో మెగాస్టార్‌‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్


Also Read: చిరు vs మోహన్ బాబు.. ‘మా’ ఎన్నికల్లో.. ఎవరి పంతం నెగ్గనుంది?


Also Read: చిరంజీవి ఇంట్లో సినీ పెద్దల భేటీ.. బాలయ్య, మోహన్ బాబు ఎక్కడ?