స్టార్ హీరోయిన్ సమంత(Samantha), సింగర్ చిన్మయి శ్రీపాద(Chinamayi Sripada) మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ కలుసుకోవడం లేదని.. వారి మధ్య బంధం చెడిందని.. ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిన్మయి దీని గురించి మాట్లాడారు. తనకు సమంత మంచి ఫ్రెండ్ అని.. తామిద్దరం కలుసుకుంటున్నామో లేదో అనే విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. 

 

ప్లేబ్యాక్ సింగర్ గా ఉన్న చిన్మయి.. సమంతకు డబ్బింగ్ చెబుతూనే పాపులారిటీ సంపాదించుకుంది. సమంత కారణంగానే ఆమెకి క్రేజ్ వచ్చిందని చెప్పడంలో తప్పులేదు. ఇదే విషయాన్ని చిన్మయి కూడా పలు సందర్భాల్లో వెల్లడించింది. తాజాగా మరోసారి ఒప్పుకుంది. సమంత వలనే తనకు తెలుగులో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి కెరీర్ వచ్చిందని.. అయితే ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమెతో తన ప్రయాణం ముగిసిందనుకుంటున్నానని వెల్లడించింది. 

 

ఎందుకంటే ఇప్పుడు సమంత తన పాత్రలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటుందని.. ఇక ఆమెకి డబ్బింగ్ చెప్పే అవకాశం రాదేమోనని చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయా..? అని చిన్మయిని ప్రశ్నించగా.. 'మేమిద్దరం కలిసినప్పుడు ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టనంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు. నా పర్సనల్ లైఫ్ ని అందరితో షేర్ చేసుకోవడం నాకు నచ్చదు. అందుకే మేం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పం. మేమిద్దరం మీట్ అవ్వాలనుకుంటే ఇంట్లోనే కలుస్తుంటాం. నా భర్త రాహుల్, సామ్ మంచి ఫ్రెండ్స్' అంటూ చెప్పుకొచ్చింది. 

 

ఇక సమంత విషయానికొస్తే.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది . వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీ హీరోయిన్ గా మారింది. ఓ పక్క తెలుగులో సినిమాలు చేస్తూనే మరోపక్క ఇతర భాషల్లో ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతోంది. అలానే వెబ్ సిరీస్ లపై కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే 'శాకుంతలం' సినిమాను పూర్తి చేసింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలమవుతుంది. ప్రస్తుతం తెలుగులో 'ఖుషి', 'యశోద'.. హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తోంది సమంత.

 

రెమ్యునరేషన్ పెంచేసిన సామ్:

ఇదిలా ఉండగా.. ఇప్పుడు సమంత తన రెమ్యునరేషన్ పెంచేసిందట. 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి అమ్మడు రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అలానే 'యశోద', 'శాకుంతలం' సినిమాలకు రూ.2.5 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా రూ.3.5 కోట్లు డిమాండ్ చేస్తుందట ఈ బ్యూటీ. అంతకంటే తక్కువ ఆఫర్ చేస్తోన్న ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడం లేదట.

 

'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 2 తరువాత సమంత క్రేజ్ పెరిగింది. ఓటీటీ, శాటిలైట్ ఛానెల్స్ లో తన సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతోంది. అందుకే సమంత రెమ్యునరేషన్ విషయంలో అసలు వెనక్కి తగ్గడం లేదు. సౌత్ లో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ అంటే నయనతార అనే చెప్పాలి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి సమంత కూడా చేరబోతోంది.