బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ చిక్కుల్లో పడింది. లక్నోలో ఆమెపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆస్తి కొనుగోలు విషయంలో గౌరీతో పాటు పలువురు తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఇంతకీ గౌరీపై కేసు ఎందుకు నమోదయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం..


అసలేం జరిగిందంటే?


షారుఖ్ సతీమణి గౌరీ తులసియని కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఆమె ప్రచారం కారణంగా ఈ కంపెనీ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. తాజాగా ఆమె ప్రకటను చూసి ముంబైకి చెందిన జశ్వంత్ షా అనే వ్యక్తి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ ఫ్లాట్ కోసం ఆయన రూ. 86 లక్షలు చెల్లించారు. అయితే, డబ్బులు చెల్లించినా ఫ్లాట్ అప్పగించడంలో సదరు కంపెనీ ప్రతినిధులు జాప్యం చేశారు. ఎందుకు తనకు ఫ్లాట్ ఇవ్వడం లేదని ఆయన ఆరా తీశారు.  అసలు విషయం తెలిసింది. అప్పటికే ఆ ఫ్లాట్ ను వేరొకరికి అమ్మినట్లు వెల్లడైంది. వెంటనే జశ్వంత్ సదరు కంపెనీపై కేసు పెట్టారు.


చిక్కుల్లో షారుఖ్ సతీమణి


ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న గౌరీ ప్రచారంతోనే తాను ఈ ఫ్లాట్ కొనుగోలు చేశానని, ఈ మోసంలో ఆమె కూడా భాగస్వామిగా ఉందంటూ జశ్వంత్  ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గౌరీ ఖాన్ తో పాటు తులసియాని కన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్ సీఎండీ అనిల్ కుమార్ తులసియానీ, డైరెక్టర్ మహేశ్ తులసియానీలపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు అయ్యింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 409(క్రిమినల్ బ్రేచ్ ఆఫ్ ట్రస్ట్) కింద పోలీసులు కేసు  నమోదు చేశారు. గౌరీ ఖాన్ పై కేసు ఫైల్ కావడంతో ఆమె న్యాయపరమైన చిక్కుల్లో పడింది. గౌరీకి 'గౌరీ ఖాన్ డిజైన్స్' అనే తన స్వంత సంస్థ ఉంది. ఆమె చాలా మంది ప్రముఖుల ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసింది. బి-టౌన్‌లోని ఉత్తమ ఇంటీరియర్ డిజైనర్లలో గౌరీ ఒకరుగా కొనసాగుతోంది. చాలా సంవత్సరాలుగా ఆమె ఈ రంగంలో కొనసాగుతోంది.


ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఆయన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. దీపికా పదుకొనె, జాన్ అబ్రహాం కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 'పఠాన్' భారీ విజయం తర్వాత ప్రస్తుతం షారుఖ్ 'జవాన్' షూటింగ్ లో బిజీ అయ్యారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘పఠాన్’ సక్సెస్‌తో బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. 


Read Also: అందుకే ఆ నటుడి చెంప పగలగొట్టా, చాలా గట్టిగా కొట్టుకున్నాం: ‘బాహుబలి’ బ్యూటీ నోరా ఫతేహి