తెలుగు సినిమా ప్రేక్షకులకు ఈ  వారం డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. టోటల్‌గా ఎనిమిది సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో డబ్బింగ్ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే... ప్రేక్షకులు ఏ సినిమాకు వెళతారన్నది ఆసక్తికరంగా ఉంది. దేనికదే డిఫరెంట్ జానర్ సినిమా కావడంతో హిట్ టాక్ వచ్చిన సినిమాలకు వీకెండ్ తర్వాత ఎడ్జ్ ఉంటుందని చెప్పవచ్చు. ఈ వారం ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి. 


ఏలియన్స్‌తో 'కెప్టెన్' ఆర్య యుద్ధం
థియేటర్లలోకి ఈ వారం ముందుగా వస్తున్న సినిమా 'కెప్టెన్' (Arya Captain Movie). తమిళ హీరో ఆర్య నటించిన చిత్రమిది. ఆయన ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు. ప్రచార చిత్రాలు చూస్తే... హాలీవుడ్ శైలి కథతో తీసినట్లు తెలుస్తోంది. ఏలియన్స్‌తో ఆర్య చేసే యుద్ధం ఉత్కంఠభరితంగా సాగుతుందని అర్థం అవుతోంది. గ్రహాంతర వాసులు, ఆర్మీ అధికారుల మధ్య పోరాట దృశ్యాలు ఆసక్తి కలిగించేలా ఉన్నాయి. ఈ సినిమాలో సిమ్రాన్, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. సెప్టెంబర్ 8న... అనగా గురువారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  



మళ్ళీ ప్రేక్షకుల ముందుకు ధనుష్, శ్రుతీల '3'  
ఇప్పుడు రీ రిలీజ్ సీజన్ నడుస్తోంది. మహేష్ బాబు 'పోకిరి', చిరంజీవి 'ఘరానా మొగుడు', పవన్ కళ్యాణ్ 'తమ్ముడు', 'ఖుషి' సినిమాలు ఈ మధ్య థియేటర్లలో సందడి చేశాయి. ఇప్పుడు మరో సినిమా వస్తోంది. ధనుష్, శ్రుతీ హాసన్ జంటగా రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'త్రీ' సినిమాను సెప్టెంబర్ 8న విడుదల చేస్తున్నారు నిర్మాత నట్టి కుమార్. 


అమ్మ ప్రేమ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో శర్వానంద్ 
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'ఒకే ఒక జీవితం' (Oke Oka Jeevitham Movie). తెలుగు, తమిళ భాషల్లో సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది. ఇందులో శర్వా తల్లిగా అమల అక్కినేని, కథానాయికగా రీతూ వర్మ నటించారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. నిన్నటి గురించి బాధ, రేపటి గురించి ఆశతో కంటే ఈ క్షణాన్ని గుర్తిస్తూ... జీవించాలని చెప్పే సందేశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మదర్ సెంటిమెంట్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ ఉన్నాయని శర్వానంద్ తెలిపారు.



రాజమౌళి సమర్పించు 'బ్రహ్మాస్త్రం'
థియేటర్లలో సందడి చేసే సినిమాల్లో ఈ వారం భారీ అంచనాలు ఉన్న సినిమా 'బ్రహ్మాస్త్ర' (Brahmastra Movie). ర‌ణ్‌బీర్‌ కపూర్ (Ranbir Kapoor), ఆలియా భట్ జంటగా నటించిన చిత్రమిది. తెలుగులో దర్శక ధీరుడు రాజమౌళి సమర్పణలో 'బ్రహ్మాస్త్రం' పేరుతో విడుదల అవుతోంది. ఇందులో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్ తదితరులు నటించారు. సకల అస్త్రాలకు అధిపతి 'బ్రహ్మాస్త్ర' అంటూ ఆసక్తి పెంచారు.


Also Read : ఎన్టీఆర్‌ను టార్గెట్ చేసిన కేసీఆర్? - దెబ్బకు రెండున్నర కోట్ల నష్టం


తెలుగులోనూ 'బ్రహ్మాస్త్ర'పై అంచనాలు నెలకొన్నాయంటే... థాంక్స్ టు రాజమౌళి అని చెప్పాలి. ఆయన సినిమా ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్నారు. యుంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రెస్‌మీట్‌కు ముఖ్య అతిథిగా రావడం, ఆలియా తెలుగులో పాట పాడటం, ర‌ణ్‌బీర్‌ తెలుగులో మాట్లాడటం వంటివి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. సినిమా విడుదలైన తర్వాత హిట్ టాక్ వస్తే... భారీ వసూళ్లు సాధించడం గ్యారెంటీ.  


తెలుగులో మరో నాలుగు చిన్న సినిమాలు... 'కొత్త కొత్తగా', 'అమృత', 'రహస్య', 'శ్రీ రంగాపురం' కూడా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఆ చిత్రాలకు స్పందన ఎలా ఉంటుందో చూడాలి. 





Also Read : ఫ్లాప్‌ల‌తో క‌ట్టిన స్టార్‌డ‌మ్ కోట - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ క్రేజ్ వేరే లెవల్