ముహూర్తం దాటిన తర్వాత పెళ్లి చేసుకోవడం మంచిది కాదని పంతులు అంటాడు. పెళ్లి ఇష్టం లేదని పారిపోయింది ఏమో అని అక్కడ ఉన్న అమ్మలక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడేసరికి రాజ్ వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. అప్పుడే కనకం కావ్యకి ముసుగు వేసి మండపానికి తీసుకొస్తుంది. పెళ్లి ఆగిపోతుందని చెప్పావ్ కదా ఇప్పుడు పెళ్లి కూతురు వచ్చాక పెళ్లి ఎలా ఆగిపోతుంది ఇంత చీట్ చేస్తావా అని అక్కడ ఉన్న మీడియా అమ్మాయి తిట్టుకుంటుంది. పెళ్ళికూతురికి ముసుగు వేసి తీసుకొస్తున్నారేంటని ధాన్యలక్ష్మి అడుగుతుంది. అది తమ ఆచారమని కనకం అంటుంది. అలా అయితే పెళ్లి కూతుర్ని చూడటానికి అందరూ ఉంటే ఏంటి ఇలా అని చిట్టి, ధాన్యలక్ష్మి అంటారు. ఇప్పటికే లేట్ అయ్యిందని పంతులు అనేసరికి కనకం కావ్యని పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది.


Also Read: ఏడిపించేసిన జ్ఞానంబ, తన కిడ్నీ ఇచ్చి భార్యను బతికించుకున్న గోవిందరాజులు


డబ్బు వాసన వస్తుంది, ఆత్మాభిమానం, అహంకారం పక్క పక్కన కూర్చున్నట్టు ఉంది. నీ వల్లే ఈ మనిషిని మోసం చేయాల్సి వచ్చిందని కావ్య మనసులో అనుకుంటుంది. ముసుగు వేయడం మన ఆచారం కాదు కదా ఎందుకు ఇలా చేశావని కనకాన్ని భర్త అడుగుతాడు. అటు అప్పు తన ఫ్రెండ్ తో కలిసి రోడ్డు మీద తిరుగుతూ స్వప్న కోసం వెతుకుతూ ఉంటుంది. స్వప్న పారిపోయిందా లేదంటే లేచిపోయిందా వస్తే పెళ్లికి ఒప్పుకుంటుందా అని కనకం ఆలోచిస్తూ ఉండగా పంతులు కన్యాదానం చేయడానికి రమ్మని పిలుస్తాడు. కనకం, కృష్ణమూర్తి రాజ్ కాళ్ళు కడుగుతారు. కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి చేతులు పట్టుకున్న కృష్ణమూర్తి అవి స్వప్న చేతులు కాదని కావ్య చేతులని గుర్తు పట్టేస్తాడు. ఏంటిది అని అడగ్గా తర్వాత చెప్తానని కనకం సైగ చేస్తుంది.


స్వప్న చేసిన పని వల్ల తన కల కోరుకున్న దాని కంటే గొప్పగా డిజైన్ చేసి వెళ్ళిందని రుద్రాణి మనసులో సంతోషపడుతుంది. కృష్ణమూర్తి కనకాన్ని పక్కకి తీసుకొచ్చి ఏం జరుగుతుందని నిలదీస్తాడు. కావ్యని అక్కడ ఎందుకు కూర్చోబెట్టావ్, నీ కూతురు ఏమైందని కోపంగా ప్రశ్నిస్తాడు. ప్రపంచంలో ఎవరి గురించి చెడుగా మాట్లాడని కావ్య ఎవరినైతే ద్వేషిస్తుందో అతని పక్కన ఎందుకు కూర్చుంది చెప్తావా లేదంటే పెళ్లి అపమంటావా అని బెదిరించేసరికి కనకం నిజం చెప్పేస్తుంది. స్వప్న కోటీశ్వరుల కూతురు తనతో వచ్చినందుకు మనసులో తెగ సంతోషాపడతాడు రాహుల్. కారులో వెళ్తుంటే గుడి కనిపించగానే స్వప్న అక్కడ కారు ఆపమని చెప్తుంది. పెళ్లి చేసుకుందాం రమ్మని అంటుంది. కానీ రాహుల్ మాత్రం ఏవేవో మాటలు చెప్పి తనని సైలెంట్ చేయిస్తాడు.


Also Read: పెళ్లివాళ్ళని వెళ్లిపొమ్మని చెప్పిన దివ్య - తులసి వల్లే ఇదంతా జరిగిందంటూ లాస్య గొడవ


అక్కడ రాజ్ పెళ్లికూతురు స్వప్న అనుకుని ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు తనని చూస్తానా అని వెయిట్ చేస్తున్నా అని చెప్తాడు. ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా, ఎందుకు ఇలా చేస్తున్నావని కృష్ణమూర్తి అరుస్తాడు. స్వప్న తల్లినే మర్చిపోయి వెళ్లిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందని అంటుంది. కృష్ణమూర్తి నిజం చెప్తానని వెళ్లబోతుంటే చచ్చిపోతానని కనకం బెదిరిస్తుంది. రాహుల్ స్వప్నని పెళ్లి చేసుకోనని అనేసరికి షాక్ అవుతుంది. రాజ్ లాగా టెస్ట్ లేనివాడిని కాదు పెళ్లిని సింపుల్ గా చేసుకోవడం ఇష్టం లేదని తన ప్లాన్స్ ఏంటో చెప్తాడు. ఆ మాటలన్నీ నిజమని స్వప్న సంబరపడిపోతుంది. పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి కూతురు లేచిపోయిందని తెలిసి పరువు పోయి తలదించుకుని ఉంటాడని అది చూస్తే బాగుండేదని రాహుల్ అనుకుంటాడు.


పంతులు రాజ్, కావ్య తల మీద జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు. కావ్య పెట్టకుండా ఉండటంతో రుద్రాణి వచ్చి బలవంతంగా తనతో పెట్టించేస్తుంది. సరిగా తాళి కట్టే టైమ్ కి కావ్య తన మేలి ముసుగు తీయడంతో అందరూ షాక్ అవుతారు.