స్వప్నని డాక్టర్ చేసి నిజం తెలుసుకుంటుంది. మీరు అనుకునేది నిజం మా వాళ్ళు అనుకునేది అబద్ధమని స్వప్న అంటుంది. కడుపు రాకుండానే వచ్చిందని అబద్ధం చెప్పావా అని నిలదీస్తుంది. అవును డాక్టర్ తప్పలేదని చెప్తుంది. ఇంటి కోడలు కడుపుతో ఉందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. నువ్వు మోసం చేసినట్టు నేను చేయలేను ఇప్పుడే వాళ్ళకి నిజం చెప్పేస్తానని డాక్టర్ అంటుంది. రాహుల్ నన్ను ప్రేమించానని చెప్పి వాడుకుని వదిలేశాడు. చావు అయినా బతుకు అయినా అతనే అనుకుని నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి ఈ పెళ్లి చేసుకున్నాను. నన్ను మోసం చేయాలని అనుకున్నాడు. అందుకే ఇలా చేశానని చెప్తుంది. నువ్వు మీ అత్తకి ద్రోహం చేస్తున్నావ్ కానీ నేను వృత్తికి ద్రోహం చేయలేనని డాక్టర్ వెళ్లబోతుంటే స్వప్న గొంతు మీద కత్తి పెట్టుకుంటుంది. మీరు వెళ్ళి నిజం చెప్తే నేను ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తుంది. నిజం బయట పడిపోయి ఉంటుంది, నా భర్త నన్ను అసలు క్షమించడని కావ్య టెన్షన్ పడుతుంది.


Also Read: మాళవిక బుట్టలో పడిపోయిన కాంచన- పూజలో తల్లి స్థానంలో ఎవరు కూర్చుంటారు?


డాక్టర్ రూమ్ నుంచి బయటకి వచ్చి బిడ్డకి ఏమీ కాలేదని కడుపులో బిడ్డ సేఫ్ గా ఉందని అబద్ధం చెప్తుంది. కావ్య బిత్తరపోయి అసలు ఏం జరిగిందని కావ్య స్వప్నని అడుగుతుంది. నీకు తెలియాల్సిన అవసరం లేదని పొగరుగా సమాధానం చెప్తుంది. తన తెలివితేటలతో డాక్టర్ తో అబద్ధం చెప్పించానని గొప్పగా చెప్పుకుంటుంది. నమ్మిన వాళ్ళని మోసం చేయడం తన వల్ల కాదని ఇలాగే కొనసాగితే చూస్తూ ఊరుకోనని కావ్య అంటుంది. పెళ్లి అయి ఇన్నాళ్ళూ అయ్యింది ఏం సాధించావు? నీ భర్త దగ్గర ప్రేమ పొందలేకపోయావు, కనీసం నీ ఫోన్ కూడా నీదగ్గర పెట్టుకోలేకపోలేని దుస్థితిలో ఉన్నావని దెప్పిపొడుస్తుంది. ఏదో ఒక రోజు నిజం బయట పడుతుందని కావ్య అంటుంది కానీ స్వప్న మాత్రం దాన్ని త్వరలోనే నిజం చేసి తీరతానని శపథం చేస్తుంది. కళ్యాణ్ నడవలేక నడవలేక ఇబ్బంది పడుతూ ఇంటికి రావడం చూసి ధాన్యలక్ష్మి ఏమైందని కంగారుగా అడుగుతుంది.


ఫిట్ నెస్ కోసం కష్టపడేసరికి ఇలా అయ్యిందని చెప్పేసరికి తండ్రి షాక్ అవుతాడు. కొడుకులో వచ్చిన మార్పు చూసి ధాన్యలక్ష్మి మురిసిపోతుంది. అప్పుడే అప్పు ఫోన్ చేసి మంచి ప్రోటీన్ ఫుడ్ తినమని సలహా ఇస్తుంది. ఎగ్స్ తినమని చెప్పేసరికి వాటిని తీసుకురమ్మని తల్లికి చెప్తాడు. నువ్వు తినవు కదా అంటే తినకపోతే కోచ్ చంపేస్తుందని అంటాడు. అంటే నీ కోచ్ అమ్మాయా? అది సంగతి అమ్మాయి కోసం ఇలా చేస్తున్నాడని ప్రకాశం చెప్తాడు. తనకి ప్రేమ అలాంటివి ఏమిఈ ఉండవని తనొక మగరాయుడు అని చెప్పేసరికి అంటే కావ్య చెల్లెలు మాదిరిగానా అంటాడు. అలాంటిదేలే అని కవర్ చేస్తాడు. కనకం తాపీగా కూర్చుని ఉంటే అప్పు హడావుడిగా వచ్చి సేటుని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. వాడిని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద కేసులు మీద కేసులు పడతాయని భయపెడుతుంది. వాళ్ళ టెన్షన్ చూసి అప్పు వీళ్ళే కిడ్నాప్ చేసి ఉంటారని డౌట్ పడుతుంది.


Also Read: బసవయ్య చెయ్యి విరిచేసిన దివ్య- తులసిని తనకి తోడుగా ఉండమన్న నందు


మీనాక్షి పోలీసులకు భయపడి సేటుని విడిపించేస్తుంది. మీ అంతు చూస్తానని సేటు ఆవేశంగా బయటకి వచ్చేసరికి ఎదురుగా కృష్ణమూర్తి ఉంటాడు. ఇల్లు తాకట్టు పెట్టి మీ భార్య పది లక్షలు అప్పు తీసుకుందని సేటు చెప్పేసరికి మూర్తి షాక్ అవుతాడు. ఆఖరికి ఉండటానికి నిలువ నీడ కూడా లేకుండా చేద్దామని అనుకున్నావన్న మాట. ఇప్పుడు ఒక మనిషిని కిడ్నాప్ చేసేంతగా దిగజారిపోయావని కనకాన్ని తిడతాడు. ఈ విషయం ఇంతటితో వదిలేయమని మూర్తి అడిగినా కూడా సేటు ఒప్పుకోడు. పోలీస్ కేసు పెట్టి తీరతానని అంటాడు.