అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణం బాలీవుడ్ తో పాటు భారతీయ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె మరణం పట్ల అప్పట్లో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. ఆమె ఎలా చనిపోయిందనే విషయంపై ఎన్నో రకాల వార్తలు హల్ చల్ చేశాయి. ఎవరు ఎన్ని మాటలు మాట్లాడిన శ్రీదేవి కుటుంబ సభ్యులు మాత్రం ఏం మాట్లాడలేదు. సమయం కాదనుకుని ఎలాంటి విషయాలను బయటకు చెప్పలేదు.


శ్రీదేవి మరణంపై ఎట్టకేలకు నోరువిప్పిన బోనీ కపూర్!


శ్రీదేవి మరణం తర్వాత తొలిసారి తన భర్త బోనీకపూర్ నోరు విప్పారు. శ్రీదేవి మరణం, ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి కీలక విషయాలు వెల్లడించారు. శ్రీదేవి మరణం తర్వాత తను ఎప్పుడో మానేసిన సిగరెట్ మళ్లీ కాల్చాలి అనిపించినట్లు తెలిపారు.  జాన్వీ కపూర్ తాజాగా నటించిన ‘మిలి’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన, ఆయన కూతురు కపిల్ శర్మ  చాట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.


డిప్రెషన్ లో సిగరెట్ కాల్చాలి అనిపించేది!


2018లో తమ దుబాయ్ ట్రిప్‌లో శ్రీదేవి మరణించినప్పుడు.. తాను చాలా ఒత్తిడికి గురయ్యానని బోనీ కపూర్ వెల్లడించారు. ఆ సమయంలో బాధ, టెన్షన్‌, ఆందోళన కలిగాయని చెప్పారు.  అన్ని విషయాల్లో తాను ఒంటరిగానే ఉన్నట్లు తెలిపారు. ఆ సమయంలో తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లు వివరించారు. అంతేకాదు, గతంలో తాను మర్చిపోయిన సిగరెట్, మళ్లీ కాల్చాలి అనిపించినట్లు చెప్పారు. అయితే, శ్రీదేవితో ప్రేమలో పడిన సమయంలో తనకు గుర్తుగా సిగరెట్ ను వదిలేసినట్లు చెప్పారు. తను లేకపోయినా, ఆమెను నిజంగా ప్రేమిస్తున్నట్లైతే సిగరెట్ ముట్టుకోకూడదని భావించానన్నారు.  అందుకు, సిగరెట్ కాల్చాలి అనిపించినా, తన కోసం వదిలేసినట్లు చెప్పారు.


2018లో బాత్ టబ్ లో మునిగి శ్రీదేవి మృతి


2018లో బోనీ కపూర్, శ్రీదేవితో పాటు వారి కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్‌లు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు దుబాయ్ చేరుకున్నారు. తను బస చేస్తున్న హోటల్ బాత్ టబ్ లో మునిగి చనిపోయింది శ్రీదేవి. సుమారు రెండు రోజుల పాటు పోలీసుల విచారణ కొనసాగింది. అనంతరం శ్రీదేవి భౌతికకాయాన్ని భారత్ కు పంపించారు. ఈ నేపథ్యంలోనే పలు రకాల వార్తలు హల్ చల్ చేశాయి. అయితే, ఆయన కుటుంబ సభ్యులు మాత్రం శ్రీదేవి మరణంపై ఎలాంటి విషయాలు బయటకు వెల్లడించలేదు.  శ్రీదేవి చివరిసారిగా ‘మామ్’ అనే సినిమాలో కనిపించింది.  సజల్ అలీ, నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. 


అటు రణబీర్ కపూర్, శ్రద్ధా కపూర్‌ హీరోయిన్లుగా లవ్ రంజన్ తెరెక్కిస్తున్న  సినిమాలో బోనీ కపూర్ నటించబోతున్నారు. ఈ సినిమాలో డింపుల్ కపాడియా కూడా కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేసే అవకాశం ఉంది.


Read Also: అవకాశాలు కోల్పోయినా అందం కోసం సర్జీలు చేసుకోలే - రాధికా అప్టే సంచలన వ్యాఖ్యలు