'వీర సింహారెడ్డి' వంటి సూపర్ హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ ఈ దసరాకి 'భగవంత్ కేసరి' అనే మాస్ యాక్షన్ ఎంటర్టైన్డ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే బాల్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ భారీ రెస్పాన్స్ ని అందుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. 'ఐ డోంట్ కేర్' అనేది ఈ సినిమాకి ట్యాగ్ లైన్. ఈ సినిమాలో మరోసారి బాలయ్య తనదైన మాస్ పర్ఫామెన్స్ ని చూపిస్తాడని ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. ఈసారి బాలయ్యను సరికొత్త పంతాలో చూపించబోతున్నారు అనిల్ రావిపూడి. అయితే ఇప్పటివరకు సినిమా కథాంశానికి సంబంధించి ఎటువంటి లీక్స్ అవ్వకుండా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.


కానీ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ అప్డేట్ తో బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే.. లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' సినిమా కథ 1992లో వచ్చిన 'ఖుదా గవా' అనే హిందీ సినిమాని పోలి ఉంటుందట. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమాలో హీరో  తన లవర్ కి ఇచ్చిన మాట కోసం శత్రువుని చంపి తన బెస్ట్ ఫ్రెండ్ కోసం జైలుకు వెళ్తాడు. హీరో జైలుకు వెళ్లడంతో తన తండ్రి గురించి తెలియకుండా కూతురు పెరుగుతుంది. హీరో జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన కూతురి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలుసుకుని తన కూతురుని ఎలాగైనా కాపాడుకోవడమే లక్ష్యంగా బ్రతుకుతాడు. అలా హీరో తన కూతుర్ని ఎలా కాపాడాడు? అనే కథాంశంతో సినిమా తెరకెక్కింది.


ఇక ఇందులో కూతురి పాత్రలో అతిలోకసుందరి శ్రీదేవి నటించింది. సరిగ్గా ఇదే కథాంశంతో 'భగవంత్ కేసరి' సినిమా తెరకెక్కుతోందని అంటున్నారు. 'ఖుదా గవా'లో అమితాబచ్చన్ పాత్రను బాలయ్య పోషిస్తుండగా.. శ్రీదేవి పాత్రలో శ్రీ లీల కూతురిగా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతుంది. కాగా అమితాబ్ నటించిన 'ఖుదా గవా' సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ అయింది. ఒకవేళ ఇదే కతాంశంతో 'భగవంత్ కేసరి' సినిమా తెరకెక్కితే ఈ సినిమా కూడా కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.


ఇక ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 20న దసరా కానుకగా విడుదల కాబోతోంది. అదే సమయంలో బాలయ్య సినిమాతో పాటు తమిళ హీరో విజయ్ 'లియో', మాస్ మహారాజ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో పోటీపడి 'భగవంత్ కేసరి' ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.


Also Read : మాస్ మహారాజాతో బుట్ట బొమ్మ - పూజా హెగ్డేతో సంప్రదింపులు!













Join Us on Telegram: https://t.me/abpdesamofficial