Telugu Bigg Boss 7: బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోనే అయినా.. అప్పుడప్పుడు కోపంలో ఆ విషయాన్ని మర్చిపోతుంటారు హౌజ్‌మేట్స్. మామూలుగా అన్ని రోజులు వివిధ ఆలోచనలు, అలవాట్లు ఉన్న మనుషులు ఒకే దగ్గర కలిసుంటే గొడవలు సహజం. కానీ అలాంటి గొడవల సమయంలో వారు మాట్లాడే మాటలను కోట్లాది మంది ప్రేక్షకులు చూస్తుంటారని అప్పుడప్పుడు హౌజ్‌మేట్స్ మరిచిపోతుంటారేమో అనిపిస్తుంటుంది. గత కొన్నివారాలుగా ‘స్పా’ బ్యాచ్‌పై.. ముఖ్యంగా శోభా, ప్రియాంకలపై శివాజీ చేసే కామెంట్స్ వింటుంటే అదే అనిపిస్తోంది. తాజాగా జరిగిన టాస్కులో కూడా శోభా.. సంచాలకురాలిగా ఉన్నప్పుడు తన ప్రవర్తన నచ్చలేదని తనతో గొడవపడడం మాత్రమే కాకుండా పక్కకు వెళ్లిన తర్వాత వారిపై తీవ్రమైన కామెంట్స్ చేశాడు.


వాళ్లు వేస్ట్..
ఓటు అప్పీల్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన బాల్స్ టాస్కులో ప్రతీ రౌండులో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండగా.. చివరిగా శివాజీ, ప్రియాంక, అర్జున్ మాత్రమే టాస్కులో మిగిలారు. ఇక సంచాలకులుగా శోభా, యావర్ ఉన్నారు. అదే సమయంలో శోభా.. ప్రియాంకను ఎంకరేజ్ చేసింది. అది శివాజీకి నచ్చక స్వచ్ఛందంగా బయటికి వచ్చేశాడు. సంచాలకురాలిగా ఉంటూ అలా చేయడం కరెక్ట్ కాదని శోభాకు క్లాస్ తీసుకోబోయాడు. కానీ శోభా వినకుండా అరవడం మొదలుపెట్టింది. ఇలా ఉండడం మంచిది కాదు అని శివాజీ సలహాలు ఇస్తుండగా.. ‘‘అది మా పేరెంట్స్ చూసుకుంటారు, వాళ్లు చెప్పుకుంటారు’’ అని సమాధానమిచ్చింది శోభా. ఇంక తనతో ఏం మాట్లాడాలో తెలియక పక్కకు వెళ్లి కూర్చున్న శివాజీ.. వాళ్లు వేస్ట్ అంటూ కామెంట్స్ చేశాడు.


చిల్లరోళ్లు..
టాస్క్ అయిపోయిన తర్వాత తన ‘స్పై’ బ్యాచ్‌తో కూర్చున్న శివాజీ.. మరోసారి ‘స్పా’ బ్యాచ్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. గత రెండు, మూడు వారాల నుంచి వారు రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని స్టేట్‌మెంట్ ఇచ్చాడు శివాజీ. అంతే కాకుండా ఆ బ్యాచ్‌లో ఎవరినైనా ఒకరిని ఒక మాట అంటే.. మిగతావాళ్లు అరుస్తున్నారని, అదంతా కావాలనే చేస్తున్నారని ఆరోపించాడు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని యావర్ చెప్పగా.. తనను మాత్రమే కాదని ప్రశాంత్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారని శివాజీ అన్నాడు.


‘‘మిమ్మల్ని రెచ్చగొడితే నేను వస్తానని వాళ్లకి తెలుసు. అందుకే నేను సైలెంట్‌గా ఉంటున్నా’’ అని బయటపెట్టాడు. ఆ తర్వాత అక్కడి వచ్చిన అమర్‌తో కూడా శోభా, ప్రియాంకలపై ఫిర్యాదు చేశాడు శివాజీ. ‘‘ఆ యాక్టింగ్ ఏంటి, ఆ వెటకారం ఏంటి, అందరం ఆర్టిస్టులమే కదా.. గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ ఇలాంటి వేషాలు వేస్తే నచ్చేస్తామా? నువ్వు ఎవరు చెప్పడానికి అనడం కరెక్టా? పెళ్లి చేసుకోబోయేవాడు భయపడతాడు ఇలా ఉంటే’’ అంటూ శోభా ప్రవర్తన గురించి చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా వాళ్లని చిల్లరోళ్లు అని కూడా అన్నాడు.


పగ కాదు భయం..
తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో శోభా, ప్రియాంకలను ఏదో ఒకటి అనడమే పనిగా పెట్టుకున్నాడు శివాజీ. అది కూడా వాళ్ల ముందు కాకుండా తన బ్యాచ్ దగ్గర కూర్చొని వారిపై స్టేట్‌మెంట్స్ పాస్ చేశాడు. టాస్కుల సమయంలో ఫౌల్ గేమ్స్ ఆడతారని, కానీ నాగార్జున వచ్చినప్పుడు మాత్రం ఏమీ తెలియనట్టు ఆస్కార్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారని ‘స్పా’ బ్యాచ్‌పై కామెంట్ చేశాడు శివాజీ. అంతే కాకుండా అర్జున్‌తో సైతం వారి గురించే మాట్లాడుతూ వచ్చాడు. అమర్ వల్ల తనకు బీపీ రైజ్ అయ్యిందని, తను రివర్స్ అయ్యింటే అమ్మతోడు ఒక్క దెబ్బకు అయిపోయేవాడు అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు.


అంతే కాకుండా ‘‘నా ఇంట్లో ఆడవాళ్లయితే గొంతు మీద కాలేసి తొక్కేవాడిని, ఒక్కటి పీకేవాడిని’’ అంటూ శోభా, ప్రియాంకలను అలా చేయాలని ఉందని ఇన్‌డైరెక్ట్‌గా అన్నాడు. అయితే అమర్‌కు తన మీద ఎందుకంత పగ అని శివాజీకి చెప్తూ బాధపడ్డాడు ప్రశాంత్. అది పగ కాదని, భయం అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు శివాజీ. కష్టపడి ఇండస్ట్రీకి వచ్చినవాడికి ఇంత చిన్నబుద్ధి ఉంటుందని అనుకోలేదు అంటూ అమర్‌ను ఉద్దేశించి అన్నాడు. తను మాత్రమే కాదని.. ప్రియాంక, శోభా కూడా అంతే అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంతే కాకుండా తరువాత జరిగిన టాస్కులో కూడా శోభాను దొంగమొహంది అని తిట్టాడు శివాజీ. ఈ వ్యాఖ్యలపై శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున సీరియల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.


Also Read: మైండ్ బ్లోయింగ్ - 'యానిమల్'పై అల్లు అర్జున్ డిటేయిల్డ్ రివ్యూ