‘బిగ్ బాస్’ షోలో ప్రస్తుతం కెప్టెన్ ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వారం గౌతమ్‌ కెప్టెన్‌గా ఛాన్స్ కొట్టేశాడు. అయితే, కెప్టెన్ ఎంపిక చేసే ప్రక్రియలో మాత్రం వాడీవేడీ చర్చ సాగింది. ముఖ్యంగా శోభాశెట్టి, యావర్ మధ్య వాదనలు గట్టిగానే సాగాయి. సహనం నశించడంతో యావర్‌ను పిచ్చొడంటూ తిట్టింది. మరోవైపు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. మరోసారి ప్రియాంక, భోలే కూడా వాగ్వాదం చేసుకున్నారు. చివరిలో శోభాశెట్టి, రతికాకు మధ్య కూడా వార్ జరిగింది. చిత్రం ఏమిటంటే.. మొన్నటి వరకు ఎడముఖం, పెడముఖంగా ఉన్న అశ్వినీ, శోభాలు ఫ్రెండ్స్ అయ్యారు. రతిక తీరుపై విమర్శలు గుప్పించారు. 


నీ ఫ్రెండ్‌ను తిట్టాననే ఇలా చేస్తున్నావ్ - రతికతో శోభా వాదన


కెప్టెన్సీ అనర్హతపై నిర్వహించిన ఓటింగ్‌లో రతిక.. శోభాశెట్టిని ఎంపిక చేసుకుంది. ‘‘కెప్టెన్‌కు వాయిస్ ఉండాలి. కమాండింగ్ ఉండాలి. నీకు వాయిస్ ఉంది గానీ.. కమాండిగ్ లేదు. అందుకే నువ్వు కెప్టెన్సీకి అనర్హురాలివి’’ అని తెలిపింది. దీంతో శోభాకు కోపం వచ్చింది. ‘‘హౌస్‌లో అడిగితే.. లేడీకి లేడీగా ఉండి సపోర్ట్ చేయనా అన్నావు. నీ ఫ్రెండ్ (యావర్)తో గొడపడ్డాను అని నీకు కాలింది. అందుకే నన్ను అన్‌డిజర్వ్ చేస్తున్నావు’’ అని శోభా వాదించింది. ‘‘నువ్వు మాటతీరు మార్చుకో బోలేతో కూడా అలాగే మాట్లాడుతున్నావు. నిన్ను డిఫెండ్ చేసుకో. అనవసర మాటలు వద్దు’’ అని రతిక అనడంతో.. శోభ మరింత రెట్టిస్తూ.. ‘‘నిన్న ఒక మాట ఈ రోజు ఒక మాట అంటున్నావు. నిన్న అమ్మాయిలు కెప్టెన్ అవ్వాలని అన్నావు. ఈ రోజు నీ ఫ్రెండ్‌ను తిట్టానని అన్‌డిజర్వ్ చేస్తున్నావు’’ అని తెలిపింది. 


రతికాకు తినడం తిరగడం తప్ప మీ రావు: శోభా


అనంతరం శోభాశెట్టి.. అశ్వినీతో కబుర్లు పెట్టింది. రతిక గురించి మాట్లాడుతూ.. ‘‘నిన్న అడిగితే అమ్మాయిలకే నా మద్దతు అని తెలిపింది. ఇప్పుడు యావర్‌ను అన్నానని నన్ను అన్‌డిజర్వ్ చేసింది. అయినా ఇకపై నేను కెప్టెన్సీ కంటెస్టెంట్‌గా ఉండను. కెప్టెన్సీ లేకుండానే హౌస్‌లో ఉంటాను. నేను బయట జనాలను నమ్ముకున్నా. వారిని నమ్ముకొనే ముందుకెళ్తా’’ అని తెలిపింది. ఆ తర్వాత రతిక గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమెకు తినడం, తిరగడం తప్ప మరేమీ రాదు’’ అని అంది. అశ్విని స్పందిస్తూ.. ‘‘అవును, ఆమెది దెయ్యం తిండి. అమ్మాయిలు అంతలా తినడం ఎప్పుడూ చూడలేదు’’ అని పేర్కొంది. 


కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్


బిగ్ బాస్‌ హౌస్‌లో 8వ వారం కెప్టెన్‌గా గౌతమ్ బాధ్యతలు స్వీకరించాడు. చివర్లో శివాజీ, అర్జున్, రతికాల నిర్ణయం కీలకంగా మారింది. అప్పటివరకు హౌస్‌మేట్స్ కేవలం శోభాశెట్టి, ప్రియాంక, పల్లవి ప్రశాంత్‌కు మాత్రమే మిరపకాయ దండలు వేసి.. అన్‌డిజర్వ్‌‌ చేశారు. గౌతమ్, సందీప్‌లకు మాత్రం ఒక్క మిరపకాయ దండ కూడా పడలేదు. రతిక చివర్లో శోభశెట్టికి, శివాజీ, అర్జున్‌లు సందీప్ మెడలో మిరపకాయ దండలు వేయడంతో గౌతమ్.. కెప్టెన్సీకి అర్హత సాధించాడు. అర్జున్ నుంచి కెప్టెన్సీ బ్యాడ్జ్ స్వీకరించిన గౌతమ్.. శోభాశెట్టి, రతికలను డిప్యుటీలుగా ఎంపిక చేసుకున్నాడు. అయితే, రతికతో కలిసి తనకు డిప్యుటీగా పనిచేయడం ఇష్టం లేదని, కెప్టెన్ లగ్జరీ రూమ్‌లో ఉండటం తనకు ఇష్టం లేదని తెలిపింది. దీంతో గౌతమ్.. ‘‘నిన్ను నీవు నిరూపించుకోవాలంటే డిప్యుటీగా బాధ్యతలు స్వీకరించి.. హౌస్‌మేట్స్ మెప్పు పొందు. వారికి నీ మీద ఉన్న అభిప్రాయం మారుతుందేమో’’ అని అన్నాడంతో శోభాశెట్టి అందుకు అంగీకరించింది.


గమనిక: ‘బిగ్ బాస్’లో జరిగిన సంఘటనలను, కంటెస్టెంట్ల వ్యాఖ్యలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలపై ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’కు ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.


Also Read: కెప్టెన్సీ గోవింద, పూర్తిగా చంద్రముఖిలా మారిన శోభాశెట్టి - అశ్వినీపై టేస్టీ తేజ ఆగ్రహం