Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఫినాలే అస్త్రాను సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారు కంటెస్టెంట్స్. అందులో భాగంగానే నవంబర్ 30న ప్రసారమయిన ఎపిసోడ్‌లో కూడా నాలుగు టాస్కులు జరిగాయి. అందులో రెండు టాస్కులు ముగిసిన తర్వాత తక్కువ పాయింట్లతో ఉన్న యావర్.. రేసు నుండి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే తన పాయింట్లలోని పావువంతు పాయింట్లను ప్రశాంత్‌కు ఇచ్చేసి తను తప్పుకున్నాడు. దీంతో ఫినాలే అస్త్రా రేసులో ఇంకా నలుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు.


అమర్‌దీప్ గెలుపు..
ముందుగా ఫినాలే అస్త్రా కోసం కంటెస్టెంట్స్‌కు ‘పిచ్ టాస్క్’ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ అంతా క్రికెటర్లుగా కాస్ట్యూమ్ వేసుకొని రెడీ అయ్యారు. ‘పిచ్ టాస్క్’ కోసం గార్డెన్ ఏరియాలో ఒక పిచ్ ఏర్పాటు చేసి ఉంటుంది. ఆ పిచ్‌పై కొన్ని వికెట్లు, దాని కింద స్కోర్ కూడా ఉంటుంది. కంటెస్టెంట్స్ అందరికీ వేర్వేరు కలర్ రింగ్స్ ఇస్తారు. వారి రింగ్స్ ఏ వికెట్లపై పడతాయో.. ఆ వికెట్ల కింద ఉన్న పాయింట్స్ కంటెస్టెంట్స్ సొంతమవుతాయి. ఈ టాస్కులో మొత్తం మూడు రౌండ్లు ఉండగా.. ప్రతీ రౌండ్‌కు రూల్స్ మార్చుకుంటూ వెళ్లారు బిగ్ బాస్. ప్రియాంక, శోభా.. ఇందులో సంచాలకులుగా వ్యవహరించారు. ఇక ఈ టాస్క్‌లో అమర్‌దీప్‌కు ఎక్కువ స్కోర్ లభించగా.. అర్జున్ రెండో స్థానంలో నిలిచాడు.


అర్జున్‌కు అన్యాయం..
‘పిచ్ టాస్క్’ తర్వాత ‘ఎస్కేప్ టాస్క్’ జరిగింది. ఈ టాస్కులో పల్లవి ప్రశాంత్ గెలవగా.. అర్జున్ చివరి స్థానంలో నిలిచాడు. కానీ ఈ టాస్కులో అర్జున్‌కు అన్యాయం జరిగిందని ప్రేక్షకులు ఫీల్ అయ్యారు. ‘ఎస్కేప్ టాస్క్’లో భాగంగా ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి దానిని విడిపించుకోవాలి. ఒక బాక్స్‌లో దానికి సంబంధించిన కీ ఉంటాయి. అయితే యావర్.. ఒక కీను తీసుకొని తాళం తెరవడానికి ప్రయత్నించిన తర్వాత దానిని కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు తన కీ త్వరగా దొరకలేదు. ఆ కీ అలా పడి ఉండడాన్ని సంచాలకులు గమనించకపోవడంతో వారిపై కోప్పడ్డాడు. యావరే అలా చేశాడని తెలిసినా శివాజీ ఏం మాట్లాడలేదు. ప్రతీ ఒక్కరి కాలికి కట్టిన తాళాలకు నెంబర్లు ఉన్నాయి. దాన్ని బట్టే వారు కీలు వెతికారు. ముందుగా వచ్చిన పల్లవి ప్రశాంత్.. అలా నెంబర్‌ను గుర్తుపెట్టుకున్నాడు కాబట్టే తన మొదటి ప్రయత్నంలోనే తాళాన్ని తెరవగలిగాడు. కానీ ప్రశాంత్.. ఆ విషయాన్ని ఒప్పుకోలేదు.


డిసప్పాయింట్ అయిన అర్జున్..
‘ఎస్కేప్ టాస్క్’ తర్వాత యావర్.. ఫినాలే అస్త్రా రేసు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్, అర్జున్, గౌతమ్ కలిసి ‘సెన్సెస్’ గేమ్‌ను ఆడారు. ఇందులో వారు కళ్లకు గంతలు కట్టుకొని వారి ముందే పెట్టిన వస్తువు ఏంటో గెస్ చేయాలి. ఈ ఆటలో ప్రశాంత్, అమర్ పోటాపోటీగా ఆడగా.. అర్జున్ మాత్రం చివర్లో ఉండిపోయాడు. తనకు ఈ టాస్క్‌లో కనీసం ఒక పాయింట్ కూడా దక్కలేదు. దీంతో తనను చూసి శివాజీ జాలిపడ్డాడు. ప్రతీ గేమ్‌లో చివర్లో ఉండడంతో అర్జున్.. కాస్త డిసప్పాయింట్ అయ్యాడు. అందుకే చివరి గేమ్‌లో పట్టుదలతో ఆడాడు. అదే ‘బ్యాలెన్స్ ది బాల్’. ఈ టాస్కులో కంటెస్టెంట్స్ అంతా ఒక చేతిలో బాల్ పట్టుకొని ఉండాలి. వారి కాళ్లు నేలకు తాకకుండా ఉండేలా ఒక నీళ్లు ఉన్న బకెట్‌కు తాడును కట్టి.. దాంతో వారి కాళ్లను కట్టేస్తారు. అలా ఎవరు ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తారో వారే విన్నర్. 


అమర్‌కు గౌతమ్ ఛాలెంజ్..
‘బ్యాలెన్స్ ది బాల్’ టాస్క్ ప్రారంభం అయ్యేముందు నిన్ను ఓడిస్తా చూడు అంటూ అమర్‌కు ఛాలెంజ్ చేస్తాడు గౌతమ్. అనుకున్నట్టుగానే అమర్.. ముందుగా ఓడిపోయి పక్కకు వెళ్లిపోగా.. తన తర్వాత గౌతమ్ వెళ్లిపోయాడు. అర్జున్ చివరి వరకు ప్రయత్నించినా పొరపాటున చేయి కింద పెట్టడంతో తను కూడా ఔట్ అయ్యాడు. ఫైనల్‌గా పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. వరుసగా టాస్కుల్లో టాప్ స్కోర్ రావడంతో ప్రస్తుతం అమర్, పల్లవి ప్రశాంత్ స్కోర్స్ సమానంగా ఉన్నాయి. అయితే గౌతమ్.. తనకు ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. ఇప్పటివరకు ఒక్క టాస్క్ కూడా గెలవలేదు అంటూ గౌతమ్‌ను హేళన చేసి మాట్లాడింది శోభా.


Also Read: ఒకే తరహా డ్రెస్‌లో రష్మిక, విజయ్ దేవరకొండ - దొరికిపోయారుగా!


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply