Bigg Boss Telugu Season 7: టికెట్ టు ఫినాలే అనేది బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు చాలా కీలకంగా ఉంటుంది. ఒకసారి ఈ టికెట్‌ను సంపాదిస్తే.. ఎలిమినేషన్, నామినేషన్‌తో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్లిపోవచ్చు. ఇక బిగ్ బాస్ సీజన్ 7లో టికెట్ టు ఫినాలేకు ఫినాలే అస్త్రా అని పేరు పెట్టారు. దానికోసమే ఇప్పుడు కంటెస్టెంట్స్ అంతా కష్టపడుతున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఛాలెంజ్‌లతో ఫినాలే అస్త్రా కోసం కంటెస్టెంట్స్ పోటాపోటీగా ముందుకు వెళ్తున్నారు. అయితే సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి శోభా, ప్రియాంక, అమర్‌దీప్ ఎక్కువగా మనస్పర్థలు లేకుండా ఫ్రెండ్స్‌గా కలిసే ఉన్నారు. అందుకే బిగ్ బాస్ ప్రేక్షకులు వీరికి స్పా బ్యాచ్ అని పేరు కూడా పెట్టారు. ఇక ఫినాలే అస్త్రా కోసం జరుగుతున్న పోటీల వల్ల స్పా బ్యాచ్‌లో మనస్పర్థలు మొదలయ్యాయి. వీరి మధ్య జరుగుతున్న గొడవలపై ఫోకస్ చేస్తూ తాజాగా ఒక ప్రోమో విడుదలయ్యింది.


కృతజ్ఞత చూపించాను..
ముందుగా ‘‘కొన్ని కొన్ని సమయాల్లో మనకు కొంతమంది గురించి తెలుస్తుంది అంటారు చూశావా’’ అంటూ ప్రియాంకను ఉద్దేశిస్తూ శోభాతో చెప్పుకుంటూ బాధపడ్డాడు అమర్‌దీప్. తన దగ్గర ఉన్న పాయింట్స్‌ను అమర్‌దీప్‌కు కాకుండా గౌతమ్‌కు ఇచ్చింది ప్రియాంక. దీంతో శోభా, అమర్ ఒకవైపు అయిపోయి ప్రియాంక తన ఫ్రెండ్ కాదు అన్నట్టు ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారి ప్రవర్తన ప్రియాంకను కూడా బాధపెట్టింది. ‘‘నువ్వు నాకు హెల్ప్ చేశావు కాబట్టి అవ్వడానికి. ఈరోజు నేను ఆ కృతజ్ఞత చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఛాన్స్ దొరికింది నేను చూపించాను’’ అంటూ తన తీసుకున్న నిర్ణయానికి కారణం ఏంటో గౌతమ్‌తో చెప్పుకుంది. ‘‘ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. ఎక్కడ ఆడాలో అక్కడ ఆడాలి’’ అంటూ ప్రియాంకపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నాడు అమర్. 


ఫ్రెండ్‌కు అన్యాయం జరిగింది..
ప్రియాంక వచ్చి శోభా, అమర్‌కు సర్ధిచెప్పే ప్రయత్నం చేసింది. ‘‘నిన్ను కెప్టెన్ చేశాడు కాబట్టి నువ్వు సపోర్ట్ చేశావు. నీ ఫ్రెండ్‌కు అన్యాయం జరిగింది మాత్రం నీకు కనిపించట్లేదు’’ అంటూ ప్రియాంకతో వ్యంగ్యంగా మాట్లాడడం మొదలుపెట్టాడు అమర్. ఆ తర్వాత డిన్నర్ కోసం టమాటా రైస్ తిందామని శోభా డిసైడ్ అయ్యింది. పదా వెళ్లి చేద్దామని ప్రియాంకను అడిగింది. ‘‘గౌతమ్‌కు చెప్పు టమాటాలు బాయిల్ చేయమని’’ అని ప్రియాంక చెప్పింది. ఆ మాట శోభాకు నచ్చలేదు. ‘‘సరే నేను చేస్తా వదిలేయ్’’ అంటూ ప్రియాంక చెప్పేది వినకుండా కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ప్రియంక నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నా కూడా ‘‘ప్రతీసారి నేను చెప్పలేను వదిలేసేయ్’’ అంటూ వెనక్కి తిరిగి చూడకుండా సీరియస్‌గా వెళ్లిపోయింది శోభా.


శోభా, ప్రియాంక కిచెన్ గొడవ..
కిచెన్‌లో చపాతీలు చేస్తున్న శోభా దగ్గరకు వెళ్లి టమాటాల గురించి అడిగింది ప్రియాంక. చట్నీ చేసేస్తాను అని సమాధానమిచ్చింది శోభా. వారిద్దరి మధ్య  దీని గురించి వాగ్వాదం జరుగుతుండగానే.. ప్రియాంక చేయి తగిలి గిన్నె కిందపడింది. ‘‘ఎవరి మీదో కోపం ఇక్కడ చూపిస్తే ఏమీ రాదు’’ అంటూ శోభా కౌంటర్ ఇచ్చింది. ‘‘నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కోప్పడేది ఏముంది దీంట్లో’’ అని ప్రియాంక గురించి గట్టిగా అడిగింది. అమర్ ప్రవర్తన చూసిన ప్రేక్షకులు.. బాల్ టాస్క్‌లో ప్రియాంకతో ఎలా ప్రవర్తించాడో గుర్తుచేసుకొని విమర్శిస్తున్నారు.



Also Read: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply