Pallavi Prashanth: బిగ్ బాస్ సీజన్ 7లో రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో ఎంటర్ అయ్యి.. టైటిల్ విన్నర్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. మామూలుగా బిగ్ బాస్ రియాలిటీ షో నుండి ఎవరు ఎలిమినేట్ అయ్యి వచ్చినా.. వారు ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొంటారు, ప్రెస్ మీట్‌లు పెడతారు. కానీ పల్లవి ప్రశాంత్‌కు ఆ అవకాశం పెద్దగా దక్కలేదు. తను విన్నర్ అయ్యి బయటికి వచ్చిన మరుసటి రోజే ఫైనల్స్ రోజు జరిగిన గొడవ కారణంగా తనను పోలీసులు అదుపులో తీసుకున్నారు. కొన్నిరోజుల జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాల్లోకి, రాజకీయాల్లోకి రావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


ఏదైనా ప్రజల కోసమే..


పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ నుండి బయటికి వచ్చినప్పటి నుండి ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్‌లోనే కనిపిస్తున్నాడు. దీంతో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రశ్నించగా.. ‘‘జనాల ఆశీస్సులు, ప్రేమ ఉంటే వారికోసం, రైతుల కోసం ఎంత దూరం అయినా వెళ్తా. అది రాజకీయాలా కాదా అని ఇప్పుడే ఏం చెప్పలేను. ఇక చాలామంది బిగ్ బాస్‌లోకి కంటెస్టెంట్స్‌గా వెళ్తే సినిమా అవకాశాలు కూడా వస్తాయనే ఆశతోనే ఉంటారు. అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం సినిమాల్లోకి వెళ్లడం గురించి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసే వీడియోల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక ఫోటో తప్పా అంతకు ముందులా వ్లాగ్స్ కూడా చేయడం లేదు ప్రశాంత్. దానిపై ఈ ఇంటర్వ్యూలో స్పందించాడు.


సినిమా ఆఫర్లు వస్తే..


‘‘2 నెలలు కేసు కోసం తిరగడంతోనే సరిపోయింది. మొన్నే నాటు వేశాం. బిగ్ బాస్ నుండి వచ్చిన తర్వాత పొలం పని ఏం చేయట్లేదు అంటున్నారు. కానీ వచ్చి పొలం దున్ని, నాటు వేసేటప్పుడు అన్నీ అందించే వెళ్లాను. కావాలంటే వీడియోలు కూడా చూపిస్తా. ఇక్కడ పని చూసుకొని వెళ్లిన తర్వాత ఏమైనా ఈవెంట్స్ ఉంటే చేస్తున్నా. ఈ పని వదిలిపెట్టను, ఆ పని వదిలిపెట్టను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. కడుపుకు అన్నం పెట్టే తల్లిని విడిచిపెట్టలేం కదా. ఈ పని చేస్తే నలుగురి కడుపు నింపుతాను కదా’’ అంటూ తనకు బిగ్ బాస్ తర్వాత అసలు గ్యాప్ ఎందుకు వచ్చిందో వివరించాడు పల్లవి ప్రశాంత్. సినిమా ఆఫర్లు వస్తే చేస్తానని, అప్పటికీ పొలం పనులు చూసుకుంటూనే సినిమాలు చేస్తానని క్లారిటీ ఇచ్చాడు.


పెయిడ్ ప్రమోషన్ ఏమీ లేదు..


బిగ్ బాస్ గెలిస్తే తన ప్రైజ్ మనీని రైతులకు ఇస్తానని మాటిచ్చిన విషయాన్ని పల్లవి ప్రశాంత్ గుర్తుచేసుకున్నాడు. అదే విధంగా జవాన్‌లకు కూడా సాయం చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తానని, కానీ ప్రైజ్ మనీ మాత్రం రైతులకే అని తెలిపాడు. దీని గురించి తన తండ్రికి ముందే చెప్పానని అన్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్స్ రోజు అయిన గొడవపై ప్రశాంత్ మాట్లాడాడు. దాని గురించి ఇప్పటివరకు మాట్లాడడానికి కారణమేంటో బయటపెట్టాడు. తనేంటో ప్రజలకు తెలుసని, వీడియోలు పెట్టి చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. తనను సీఎం చేస్తే నిజంగానే అందరినీ ఆదుకుంటానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. బిగ్ బాస్ విన్నర్ అవ్వడానికి తను ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్.


Also Read: రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన మెగా కోడలు ఉపాసన..