Upasana Konidela Meet Droupadi murmu: మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన కొణిదెల తన కూతురు క్లింకారతో కలిసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిశారు. ఈ సంద్భంగా ఉపాసన ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ షేర్‌ చేశారు. కాగా ఇటీవలే ఉపాసన తన తాత, అపోలో ఫౌండర్‌ ప్రతాప్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముడిని దర్శించుకున్న అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసింది. ఇలా ఉపాసన ప్రముఖులు కలుస్తూ పలు కార్యక్రమాలకు హాజరవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్‌కు హాజరైంది. ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి కూడా హాజరయ్యారు.


అక్కడ ఆమెను కలిసిన ఉపాసన ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. రాష్ట్రపతిని కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉపాసన తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "ఈ రోజు అంతర్గత, ప్రపంచ శాంతి కోసం జరిగిన హార్ట్‌పుల్‌నెస్‌ గ్లోబల్ మహోత్సవ్‌ @heartfulness - Global Spirituality మహోత్సవ్‌లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీని నా కుమార్తె క్లింకార కొణిదెలతో కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అలాగే కమలేశ్‌ దాజీ జీ మీరు నిజంగా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చారు. ముఖ్యంగా ఈ ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చుతున్న కమలేశ్‌ దాజీ జీకి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా బిడ్డ కూడా అన్ని సానకూలతలను స్వీకరించేందుకు ఇక్కడికి తీసుకువచ్చాను" అంటూ ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ వైరల్‌గా మారింది. 


యోగి ఆదిత్యనాథ్ ఇటీవల భేటీ






కాగా ఇటీవల ఉపాసన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. అపోలో ఆస్పత్రి సేవలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్మాత్మిక కేంద్రం అయోధ్యలో అందించాలని నిర్ణయం జరిగింది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట ఉపాసన సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎంకు అయోధ్యలో ఏర్పాటు చేసే అపోలో ఆస్పత్రి సేవల గురించి వివరించినట్లు తెలిసింది. ఇక ఈ భేటీ అనంతరం ఉపాసన తన తాత ప్రతాప్ సీ రెడ్డి లెగసీని వివరించే 'ది అపోలో స్టోరీ' అనే బుక్‌ను సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు అందజేశారు. ఈనేపథ్యంలోనే ఉపాసన రీసెంట్‌గా తన తాత, అమ్మమ్మ, తన తల్లిదండ్రులతో ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఉపాసన అయోధ్య రామమందిరాన్ని సందర్శించినట్టు తెలుస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కోరిక మేరకు త్వరలోనే అక్కడ అపోలో సేవలను ఉపాసన ప్రారంభించనున్నారట. అందుకే అయోధ్యలో ప్రత్యేక పూజ నిర్వహించినట్టు సమాచారం.