‘బిగ్ బాస్’ సీజన్ 7లో రెండో వారం నామినేషన్స్ అనేవి ఒక ఎపిసోడ్‌లో పూర్తవ్వలేదు. రెండోరోజు కూడా ఇంకా నామినేషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ మధ్య జరిగిన మాటల యుద్ధంలో మరెన్నో సంఘటనలకు దారితీసింది. దాదాపు 15 నిమిషాల పాటు పల్లవి ప్రశాంత్‌ను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో వివరించాడు అమర్‌దీప్. తను చెప్పిన కారణాలకు, మాటలకు చాలామంది కంటెస్టెంట్స్ సపోర్ట్‌గా నిలబడ్డారు. అమర్‌దీప్ చెప్పిన మాటలు నిజం అనిపించిన మరికొందరు కంటెస్టెంట్స్ కూడా ప్రశాంత్‌ను నామినేట్ అవ్వడానికి ముందుకొచ్చారు. అలా ముందుగా శోభా శెట్టి, ఆ తర్వాత రతిక రావడంతో.. ఎపిసోడ్ మొదలయ్యింది.


నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పానా..?
నామినేట్ చేయడానికి వచ్చిన శోభా శెట్టి ముందుగా ‘నేను నిన్ను అన్నయ్య అని పిలుస్తా కదా’ అంటూ పల్లవి ప్రశాంత్‌తో మాట్లాడడం మొదలుపెట్టింది. ‘ఇప్పటివరకు నేను చూసిన అన్నయ్య వేరే. ఇప్పుడు చూస్తున్న అన్నయ్య వేరే. నీ ఒరిజినాలిటీ ఇక్కడ కనిపించడం లేదు. నీలో రెండు మోహాలు ఉన్నాయి. నువ్వు నిరూపించుకో. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో దాని మీద మాత్రమే ఫోకస్ చేయి’ అంటూ శోభా.. ప్రశాంత్‌కు సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ‘నేను అదే చేస్తున్నా’ అంటూ ప్రశాంత్ సమాధానమిచ్చాడు. ‘మరి రతిక వెనుక ఎందుకు పడ్డావు, టైటిల్ కొట్టడానికి వస్తే అదే ధ్యాసలో ఉండాలి కదా’ అంటూ సూటిగా ప్రశ్నించింది శోభా. అప్పుడు ‘రతిక నేనెప్పుడైనా నీకు చెప్పానా నిన్ను లవ్ చేస్తున్నా అని’ అంటూ రతికను ప్రశ్నించాడు ప్రశాంత్. ‘ఇక్కడ అందరూ పిచ్చివాళ్లా? అందరికీ తెలుసు’ అంటూ ముక్కుసూటిగా చెప్పేసింది రతిక. 


బయట మా వాళ్లు ఉన్నారు..
కెమెరాలకు, కంటెంట్ కోసం వచ్చానంటూ ప్రశాంత్‌ను విమర్శిస్తూ పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేసింది శోభా శెట్టి.‘ఇప్పుడు మొదలయింది అసలు ఆట’ అంటూ పొగరుగా మాట్లాడుతూ తన మ్యానరిజం చూపించడానికి ప్రయత్నించాడు ప్రశాంత్. మధ్యలో ‘మీరు ఎన్నిసార్లు నామినేట్ చేసినా బయట మా వాళ్లు ఉన్నారు’ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పుడు అమర్‌దీప్, శోభా శెట్టి.. ‘ఇదే అసలైన విషయం’ అంటూ చప్పట్లు కొట్టారు. శోభా శెట్టి తర్వాత రతిక కూడా పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేయడానికి ముందుకొచ్చింది.


సెంటిమెంట్ వాడుకుంటున్నావు అన్న రతిక..
‘అసలు రైతుబిడ్డ అనేది లేకపోతే ప్రశాంత్ ఎవరు’ అని ముందుగా పల్లవి ప్రశాంత్‌ను ప్రశ్నించింది రతిక. ‘నువ్వు రైతుబిడ్డ అనే సెంటిమెంట్ దారి ఎంచుకున్నావు. ‘బిగ్ బాస్’ అంటే అంత ఇష్టమయితే ‘బిగ్ బాస్’ ఎందుకు చూడలేదు? సీజన్స్ అన్నీ చూసి చాలా నేర్చుకొని వచ్చావు. నీలో బయట ఉన్న వినమ్రత అదంతా ఇక్కడ లేదు. ఇక్కడ నీలో ఉన్న ఇంకొక యాంగిల్ బయటికొస్తుంది. అవకాశం వచ్చేవరకు ఒక ప్రశాంత్, అవకాశం వచ్చాక ఒక ప్రశాంత్‌లాగా ఉన్నావు. ఇలా ఉంటే బయట ఆడియన్స్ ప్రోత్సహించరు. రైతు అని నువ్వు ప్లే చేస్తున్న సెంటిమెంట్‌ను నమ్మడానికి ఎవరు పిచ్చివాళ్లు కాదు. నీ ఒరిజినాలిటీ తెలిస్తే వారే బయటికి పంపిస్తారు’ అంటూ ప్రశాంత్‌ను నామినేట్ చేసి వెళ్లిపోయింది రతిక. ఆ తర్వాత శుభశ్రీ వచ్చి ఒరిజినాలిటీ లేదని, ‘బిగ్ బాస్’ ఇస్తే డబ్బు తీసుకోకుండా వెళ్లిపోతావా అని ప్రశ్నించింది. అవును తీసుకోను అని పల్లవి ప్రశాంత్ చెప్పిన సమాధానికి కంటెస్టెంట్స్ అంతా వ్యంగ్యంగా చప్పట్లు కొట్టారు. మొత్తానికి పల్లవి ప్రశాంత్ నామినేషన్స్.. ‘బిగ్ బాస్’ ప్రేక్షకులకు నచ్చే విధంగా చాలా మజాగా సాగింది. నామినేషన్స్ తర్వాత కూడా కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.


Also Read: ఈ వారం ‘‘బిగ్ బాస్’’ నామినేషన్స్‌లో ఉన్నది వీరే - ఆ ముగ్గురికీ ఈ సారి అగ్ని పరీక్షే!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial