బిగ్ బాస్‌లో సీజన్ 7లో పవర్ అస్త్రా సాధించినవారు మాత్రమే హౌజ్‌మేట్స్ అని, మిగతావారు కేవలం కంటెస్టెంట్స్ అని లాంచ్ ఎపిసోడ్‌లోనే నాగార్జున స్పష్టం చేశారు. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో నాలుగు వారాలు పూర్తవ్వగా.. అందులో నలుగురు కంటెస్టెంట్స్‌కు పవర్ అస్త్రా లభించింది. ముందుగా సందీప్, ఆ తర్వాత శివాజీ, తర్వాత శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌లకు ఈ పవర్ అస్త్రాలు దక్కాయి. కానీ రెండో పవర్ అస్త్రా సాధించిన శివాజీ నుండి అస్త్రాన్ని వెనక్కి తీసేసుకున్నాడు నాగార్జున. కంటెస్టెంట్స్ అంతా శివాజీ అనర్హుడు అని ప్రకటించడంతో నాగార్జున.. ఇలాంటి నిర్ణయానికి వచ్చారు. దీంతో నేడు (అక్టోబర్ 1న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో అసలు తను ఎందుకు అనర్హుడు అని నాగార్జునను ప్రశ్నించాడు శివాజీ.


ఎందుకు అనర్హుడిని..
ముందుగా సండే ప్రోమో ప్రారంభం అవ్వగానే శివాజీ.. అసలు తను ఎందుకు అనర్హుడు అంటూ నాగార్జునను ప్రశ్నించాడు. దానికి సమాధానంగా నాగార్జున.. ‘‘మీరు కొందరినే సపోర్ట్ చేస్తున్నారు అని వారు భావించారు’’ అన్నారు. ‘‘నేను అలా ఉండడానికి ఒక సాక్ష్యం కూడా లేదు’’ అని గట్టిగా చెప్పాడు శివాజీ. దీంతో కంటెస్టెంట్స్‌నే ఆ విషయం అడుగుదామని నిర్ణయించుకున్నారు నాగ్. అందుకే ముందుగా శోభా శెట్టిని ఎంపిక చేసుకున్నారు. ‘‘శివాజీ పక్షపాతంగా ఉన్నాడని చేయి ఎత్తావు. ఒక కారణం చెప్పు’’ అని ప్రశ్నించారు. ‘‘అమర్ పేరు వస్తే చాలు, ప్రియాంక పేరు వస్తే చాలు.. ఏదైతే చెప్పాలి అనుకుంటున్నానో. అది చెప్పడానికి నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్’’ అని తన కారణాన్ని బయటపెట్టింది శోభా. 


అమర్, ప్రియాంక విషయంలోనే..
శోభా చెప్పిన కారణం నాగార్జునకు సరైనది అని అనిపించలేదు. దీంతో ‘‘అమర్‌ను సపోర్ట్ చేయడానికి నీకు ఉన్న కారణం చెప్పు’’ అని ప్రశ్నించగా.. ‘‘అమర్‌ను నేనెప్పుడూ సపోర్ట్ చేయలేదు సార్’’ అని చెప్పింది శోభా. ‘‘ఇప్పుడే చెప్పావ్ కదా అమర్, ప్రియాంక అని’’ ఎదురుప్రశ్న వేశారు నాగ్. శివాజీ గురించి అడుగుతూ ‘‘ఎవరి విషయంలో పక్షపాతిగా ఉన్నాడు’’ అని ప్రశ్నించగా.. యావర్, ప్రశాంత్ పేర్లు చెప్పింది శోభా. అయితే యావర్ నామినేట్ అయిన విషయాన్ని గుర్తుచేస్తూ ఇంక అందులో పక్షపాతం ఏముంది అని అడిగారు నాగ్. అభిప్రాయాన్ని బయటపెట్టడంతో తప్పేముంది అన్నారు.


శోభా, సందీప్‌‌లకు ఎదురుప్రశ్నలు..
ఆ తర్వాత సందీప్‌ను కూడా క్లారిటీ అడిగి తెలుసుకున్నారు నాగార్జున. ‘‘మీరు నామినేషన్‌కు శివాజీ సహకరించకపోయినా.. యావర్‌ను నామినేట్ చేశామని చెప్పారా’’ అని అడిగారు. ఆ తర్వాత గౌతమ్.. యావర్‌ను నామినేట్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకొని తనను కూడా ఈ విషయంపై ప్రశ్నించారు. చివరిగా ‘‘నువ్వు, సందీప్ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి శివాజీ ఒప్పుకుంటున్నాడు. అలా కాకపోతే ఒక్క ప్రత్యేకమైన ఉదాహరణ చెప్పు నీకు అలా ఎక్కడ అనిపించిందో’’ అని శోభాను ప్రశ్నించారు నాగార్జున. దానికి శోభా దగ్గర సమాధానం లేదు. మొత్తంగా సండే ఎపిసోడ్‌లో శివాజీ అడిగిన ఒక్క ప్రశ్న.. పెద్ద దుమారానికే దారితీసినట్టు అనిపిస్తోంది.


Also Read: పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial