బిగ్ బాస్ సీజన్ 7 అనేది ఉల్టా పుల్టా సీజన్ అనే పేరుతో ప్రారంభం అయ్యింది. అందుకే సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఊహించని ఎన్నో ట్విస్టులు ఎదురవుతూ ఉన్నాయి. ముందు సీజన్స్‌లాగా టాస్కులు, యాక్టివిటీలు అనేవి ఈ సీజన్‌లో లేవు. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 7లో కేవలం పవర్ అస్త్రాకు సంబంధించిన టాస్కులు మాత్రమే జరిగాయి. ఆ టాస్కుల వల్ల కంటెస్టెంట్స్‌కు ఇమ్యూనిటీ లభిస్తోంది. అలా పవర్ అస్త్రా అనేది బిగ్ బాస్ సీజన్ 7ను ముందు సీజన్స్ నుండి వేరు చేస్తోంది. ఇక నామినేషన్స్ అనేవి కూడా బిగ్ బాస్ సీజన్ 7లో చాలా డిఫరెంట్‌గా జరుగుతున్నాయి.


జ్యూరీలో ఆ ముగ్గురు..
ఇప్పటివరకు బిగ్ బాస్‌లో మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ మూడు వారాల్లో ముగ్గురు కంటెస్టెంట్స్‌కు పవర్ అస్త్రా దక్కింది. వారే సందీప్, శివాజీ, శోభా శెట్టి. అయితే ఈ వారం నామినేషన్స్‌లో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనే నిర్ణయాన్ని ఈ ముగ్గురి చేతికి వదిలేశారు బిగ్ బాస్. ముందుగా కంటెస్టెంట్స్ ఒకరు తర్వాత ఒకరు వచ్చి.. వారు ఎవరిని నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేరు చెప్పాలి. అయితే ఆ కంటెస్టెంట్ చెప్పిన నామినేషన్‌కు గల కారణానికి జ్యూరిలో ఉన్న సందీప్, శివాజీ, శోభా శెట్టి కన్విన్స్ అయితే వారే నామినేట్ అవుతారు. అలా నామినేట్ అయిన వారి ఫోటోను గిల్టీ వాల్‌పై పెట్టవలసి ఉంటుంది. కానీ ఒకసారి అలా గిల్టీ వాల్‌పై పెట్టిన కంటెస్టెంట్‌ను మరో కంటెస్టెంట్ నామినేట్ చేసే అవకాశం ఉండదు. బిగ్ బాస్ పెట్టిన ట్విస్ట్ విన్న శివాజీ.. ఇది కదా అసలైన ట్విస్ట్ అంటూ కామెంట్ చేశాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


శుభశ్రీ రోటీస్..
ముందుగా శుభశ్రీ.. రతికను నామినేట్ చేయాలనుకొని బోణులో నిలబెట్టింది. నాగార్జున దగ్గర రతిక.. తన ఎక్స్‌ బాయ్‌ఫ్రెండ్ గురించి మాట్లాడడం నచ్చలేదని శుభశ్రీ కారణంగా చెప్పింది. కావాలని చెప్పినట్టు ఉందని కామెంట్ చేసింది. ‘‘నేను ఎవరితోనో మాట్లాడుకుంటే అది విని ఇక్కడ వచ్చి చెప్తుంది, ఏమంటారు ఈమె క్యారెక్టర్‌ను’’ అని శుభశ్రీ క్యారెక్టర్ గురించి మాట్లాడింది రతిక. అది నచ్చని శుభశ్రీ.. నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. ఆ తర్వాత అమర్‌దీప్‌ను నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది శుభశ్రీ. అమర్ ఆడలేదని కారణం చెప్పింది. ‘‘పోనీ నువ్వేం ఆడావో చెప్పు’’ అంటూ అమర్ కౌంటర్ ఇచ్చాడు. ‘‘ప్రతీ స్టేజ్‌లో నేను నా బెస్ట్ ఇచ్చాను’’ అని శుభశ్రీ చెప్పింది. ఒకరినొకరు ఇంటి పనులు ఏమీ చేయలేదని విమర్శించుకున్నారు. రోటీలు తప్పా శుభశ్రీ ఏమీ చేయలేదని, శుభశ్రీ రోటీస్ అని పేరు పెట్టుకోవచ్చని అమర్‌దీప్ వ్యంగ్యంగా మాట్లాడాడు. ఆ తర్వాత అందరూ వెళ్లిపోయిన తను బయటికి వెళ్లడని స్టేట్‌మెంట్ ఇచ్చాడు.


ఐడెంటిటీ కోసం గొడవ..
ప్రిన్స్ యావర్‌ను నామినేట్ చేయడానికి గౌతమ్ కృష్ణ రంగంలోకి దిగాడు. తన మీదకు అరిచాడని, తక్కువగా మాట్లాడాడని గౌతమ్ కారణంగా చెప్పాడు. ‘‘ఇది నా యాటిట్యూడ్. నేను ఇక్కడికి ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి వచ్చాను’’ అని యావర్ గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ‘‘ఎదుటి మనిషిని హర్ట్ చేయడం నీ ఐడెంటిటీనా?’’ అని ప్రశ్నించాడు గౌతమ్. అయితే నేను నిన్ను ఏమని హర్ట్ చేశాను అంటూ యావర్.. మరింత గట్టిగా అరిచాడు. దీంతో సహనం కోల్పోయిన గౌతమ్.. యావర్‌ను వెక్కిరించడం మొదలుపెట్టాడు. అది యావర్‌కు నచ్చలేదు. దీంతో బోణులో నుండి దిగి వచ్చి గౌతమ్ మీదకు వచ్చాడు యావర్. దీంతో శివాజీ కూడా యావర్ మీద సీరియస్ అవ్వక తప్పలేదు. ‘‘నీ ప్లేస్ ఇది’’ అంటూ తనను తిరిగి బోణులోకి పంపించే ప్రయత్నం చేశాడు.



Also Read: ఆయనకు ఒక గుణపాఠం, చంద్రబాబు అరెస్ట్‌పై హీరో సుమన్ స్ట్రాంగ్ రియాక్షన్