బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ లో ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ జరగనుంది. దీంతో ఎపిసోడ్ పై ఆసక్తి క్రియేట్ అయింది. ఎపిసోడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్ మేట్స్ కి గట్టిగానే క్లాస్ పీకారు. ముందుగా అరియనాను చాలా స్టుపిడ్ గా బిహేవ్ చేశావని.. బిగ్ బాస్ హౌస్ అనేది లైఫ్ టైం ఆపర్చ్యునిటీ.. కానీ నువ్ చేసే పని వలన నీ లైఫ్ ని కూడా హర్ట్ చేయొచ్చని నాగార్జున అనగానే ఏడ్చేసింది అరియనా. ఆ తరువాత నామినేషన్స్ లో మిత్రాశర్మ తన చేతులను స్టాండ్ కి వేసి బాదుకోవడాన్ని తప్పుబడుతూ.. బయటకు వెళ్లి చేతులు విరగ్గొట్టుకో.. బిగ్ బాస్ హౌస్ లో కాదంటూ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున. 


టాస్క్ లో ఎమోషనల్ అయిన నటరాజ్ మాస్టర్.. దేవుడా ఆడియన్స్ నన్ను టాప్ కి 5కి తీసుకెళ్లకపోతే నన్ను చంపేయ్ అనే డైలాగ్ వేశారు. దీనిపై ఫైర్ అయ్యారు నాగార్జున. అలానే బిందుని తిడుతూ ఆమె తండ్రి టాపిక్ ని తీసుకొచ్చిన నటరాజ్ మాస్టర్ ని గట్టిగా నిలదీశారు నాగార్జున. బిందు తండ్రిని అనే హక్కు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు నాగ్. దీంతో నటరాజ్.. తన కూతురు టాపిక్ తీసుకురావడంతో అన్నానని కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ విషయంలో నాగార్జున అసలు తగ్గలేదు. నటరాజ్ కి గట్టిగానే క్లాస్ పీకారు. షో అయిపోగానే బిందు చెన్నై వెళ్లిపోతుందని నటరాజ్ అనడాన్ని కూడా తప్పుబడుతూ.. ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చెప్పారు నాగ్. దీంతో నటరాజ్ మోకాళ్లపై కూర్చొని క్షమాపణలు చెప్పాడు.


ఇక బిందు.. నటరాజ్ మాస్టర్ ని నామినేషన్స్ లో 'రా..', 'తూ..' అని అనడంపై నాగార్జున కోప్పడ్డారు. దీంతో బిందు.. ఆయన అలా మాట్లాడడంతో కోపంతో చేశానని చెప్పగా.. 'ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది..?' అంటూ ప్రశ్నించారు. దీంతో బిందు సైలెంట్ అయిపోయింది. ఆ తరువాత హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్ టాస్క్ లు ఆడించారు నాగార్జున. మధ్యలో ఒక్కో కంటెస్టెంట్ ని సేవ్ చేస్తూ వచ్చారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్పడంతో హౌస్ మేట్స్ లో టెన్షన్ మొదలైంది. ముందుగా యాంకర్ శివ, ఆ తరువాత అరియనా, బిందు మాధవి, అఖిల్, మిత్రాశర్మలను సేవ్ చేశారు నాగార్జున. వీరు ఐదుగురు కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. 


మిగిలిన ముగ్గురు బాబా భాస్కర్, నటరాజ్ మాస్టర్, అనిల్ రాథోడ్ లలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అనుకున్నారు. బాబా భాస్కర్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకొని సేవ్ అయిపోయారు. దీంతో నటరాజ్, అనిల్ ఇద్దరూ ఎలిమినేట్ అవుతారని హౌస్ మేట్స్ భావించారు. కానీ ఆల్రెడీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడుకొని బాబా సేవ్ అవ్వడంతో నటరాజ్, అనిల్ లలో ఒకరు మాత్రమే ఎలిమినేట్ అవుతారని చెప్పారు నాగార్జున. 


ఆ ఛాన్స్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఇచ్చారు నాగ్. అనిల్, నటరాజ్ లలో ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో చెప్పమని అడిగారు. ఎక్కువ ఓట్లు అనిల్ కి రావడంతో అతడు సేవ్ అయిపోయాడు. నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అవ్వడంతో అతడు బాగా ఎమోషనల్ అయ్యాడు. అనంతరం స్టేజ్ పైకి వెళ్లి మరింత ఎమోషనల్ గా మాట్లాడాడు. 


Also Read: హరీష్ శంకర్ లిస్ట్ లో క్రేజీ ఆఫర్ - సల్మాన్ తో సినిమా?