బిగ్ బాస్ సీజన్ 5 ఈరోజు ఎపిసోడ్ తో పూర్తి కానుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ని ఎంతో వైభవంగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ ఈవెంట్ కి రాజమౌళి, అలియాభట్, నాని, దేవిశ్రీప్రసాద్, సుకుమార్, రష్మిక, సాయి పల్లవి, కృతిశెట్టి ఇలా చాలా మంది స్టార్స్ అతిథులుగా రాబోతున్నారు. అంతేకాదు.. శ్రియ లాంటి హీరోయిన్లతో డాన్స్ పెర్ఫార్మన్స్ లు ప్లాన్ చేశారు. ఇక ఈ ఎపిసోడ్ లో విన్నర్ ను అనౌన్స్ చేస్తుండడంతో ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. : 'మిర్చి' సినిమాలో 'ఆరడుగుల అందగాడు' సాంగ్ కి, 'అక్కినేని అక్కినేని', 'బంగార్రాజు' వంటి పాటలకు స్టేజ్ పై డాన్స్ చేసి అలరించారు నాగార్జున. 


ఎక్స్ కంటెస్టెంట్స్ 'నాటు' స్టెప్పులు..: బిగ్ బాస్ సీజన్ 5 ఎక్స్ కంటెస్టెంట్స్ తో డాన్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు బిగ్ బాస్. ముందుగా.. ఉమాదేవి 'దిగు దిగు నాగ' సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మన్స్ చేసింది. ఆ తరువాత జెస్సీ-ప్రియాంక-శ్వేతా కలిసి 'చిన్నదో వైపు.. పెద్దదో వైపు' సాంగ్ కి స్టెప్పులు ఇరగదీశారు. కాజల్ 'అఖండ' సినిమాలో 'జై బాలయ్య' సాంగ్ కి తనదైన స్టైల్ లో స్టెప్పులు వేసింది. ఇక విశ్వ అయితే 'పుష్ప' సినిమాలో 'తగ్గేదేలే' సాంగ్ కి మాస్ స్టెప్స్ వేశాడు. మధ్యలో హమీద కూడా జాయిన్ అయి.. బన్నీ స్టెప్స్ ని యాజిటీజ్ దించేసింది. యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ కలిసి 'నాటు నాటు' సాంగ్ కి చేసిన పెర్ఫార్మన్స్ హైలైట్ గా నిలిచింది. 


కంటెస్టెంట్స్ తో నాగ్ ముచ్చట్లు.. : ఇన్నేళ్ల ఇండస్ట్రీలో కంటే బిగ్ బాస్ హౌస్ లో ఇంకా ఎక్కువ నేర్చుకున్నానని రవి చెప్పాడు. శ్రీరామ్ తో పరిచయం తరువాత బెటర్ పెర్సన్ అయ్యాను.. అందుకే తనను సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. నా జర్నీ ఒక వారమే కానీ మెమరబుల్ జర్నీ అని చెప్పుకొచ్చింది సరయు. శ్రీరామచంద్ర విన్నర్ గా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది. అతడు వన్ మ్యాన్ ఆర్మీ అని తెగ పొగిడేసింది. విశ్వ కూడా శ్రీరామచంద్ర విన్నర్ గా గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చాక వర్క్ తో బిజీ అయిపోయానని.. కానీ కోపం కొంచెం తగ్గించుకోవాలని చెప్పింది. ఇక విన్నర్ గా శ్రీరామ్ గెలిస్తే చాలా సంతోషపడతానని చెప్పింది. టాప్ 5 లో తన ఫేవరెట్స్ సన్నీ, శ్రీరామ్ అని చెప్పింది లహరి. బిగ్ బాస్ తరువాత బిజీ అయ్యానని.. చిరు నటిస్తోన్న 'భోళా శంకర్' సినిమాలో నటిస్తున్నట్లు చెప్పాడు లోబో. షన్ను టాప్ లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. 


బిగ్ బాస్ తరువాత లైఫ్ చాలా బావుందని.. టాప్ 5లో సన్నీ, శ్రీరామ్ అంటే తనకు ఇష్టమని.. సన్నీ గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పింది శ్వేతా. షణ్ముఖ్ టాప్ లో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు జెస్సీ. బిగ్ బాస్ వల్ల మైత్రి ప్రొడక్షన్స్ అప్రోచ్ అయి.. లీడ్ గా ఒక ఛాన్స్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు జెస్సీ. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక.. బాలకృష్ణ గారి సినిమాకి వర్క్ చేశానని.. త్వరలోనే హీరోగా సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు నటరాజ్ మాస్టర్. విన్నర్ గా సన్నీని చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. 


బయటకొచ్చిన తరువాత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని.. సన్నీ విన్నర్ అవుతాడని చెప్పింది కాజల్. టాప్ 5 లో ఉన్న మానస్, సన్నీ, శ్రీరామ్ లంటే తనకు ఇష్టమని చెప్పింది ప్రియాంక. సన్నీ గేమ్ ప్రకారం చాలా నచ్చుతున్నాడని.. కానీ శ్రీరామ్ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పింది ప్రియా. రామ్ విన్నర్ అవ్వాలని చెప్పింది హమీద. ఉమాదేవి.. నాగార్జునతో మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. హౌస్ నుంచి బయటకొచ్చిన తరువాత తన ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేసిందని చెప్పుకొచ్చింది. సన్నీ విన్నర్ గా గెలవాలని కోరుకుంది. 


హౌస్ మేట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్..: టాప్ 5 కంటెస్టెంట్స్ పేరెంట్స్ తో మాట్లాడారు నాగార్జున. ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ముందుగా మానస్ 'భీమ్లానాయక్' సాంగ్ కి డాన్స్ చేశాడు. శ్రీరామ్ 'ఐయామ్ లవర్ ఆల్సో.. ఫైటర్ ఆల్సో' సాంగ్ కి డాన్స్ చేశాడు. 'సారంగ దరియా' సాంగ్ కి సిరి డాన్స్ చేయగా.. 'చిల్ బ్రో..' సాంగ్ కి షణ్ముఖ్ మాస్ స్టెప్స్ వేశాడు. 'వాతి కమింగ్' సాంగ్ కి సన్నీ తన డాన్స్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు.  


ఫేవరెట్ ప్లేస్.. : హౌస్ మేట్స్ ని తమ ఫేవరెట్ ప్లేస్ ఏంటో చెప్పమని అడిగారు నాగార్జున. ముందుగా శ్రీరామ్ హాల్ లో ఉండే సోఫాలో కూర్చొని.. వీకెండ్ లో నాగార్జున గారితో మాట్లాడడం నచ్చుతుందని చెప్పాడు. తనకు స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టమని సన్నీ చెప్పగా.. గార్డెన్ ఏరియాలో ఉన్న బెంచ్ అంటే తనకు ఇష్టమని మానస్ చెప్పాడు. ఎప్పటిలానే షణ్ముఖ్ తనకు మోజ్ రూమ్ అంటే ఇష్టమని చెప్పాడు. సిరి తనకు సోఫా అంటే ఇష్టమని చెప్పింది. 


బిగ్ బాస్ స్టేజ్ పై రాజమౌళి..: టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఉన్న సిరి, మానస్, షణ్ముఖ్, శ్రీరామ్, సన్నీలలో ఒకరు ఎలిమినేట్ అయ్యే సమయం వచ్చేసిందని నాగార్జున చెప్పారు. అయితే ముందుగా రాజమౌళిని స్టేజ్ పైకి పిలిచి 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి మాట్లాడారు నాగార్జున. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఒకే తెరపై చూడడం గొప్ప అనుభూతి కలిగిందని.. ఇద్దరు స్టార్ హీరోలను ఒక సినిమాలో చూపించే అదృష్టం నాకు కలిగింది అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. ఆ తరువాత 'బ్రహ్మాస్త్ర' సినిమా గురించి మాట్లాడారు. మూడేళ్లక్రితం కరణ్ జోహార్ ఫోన్ చేసి.. దర్శకుడు అయాన్ ను తన దగ్గరకు పంపించారని.. అతడు చెప్పిన కథ తనకు బాగా నచ్చిందని రాజమౌళి చెప్పారు. ఆ తరువాత అలియా భట్, రణబీర్ కపూర్ లను స్టేజ్ పైకి పిలిచారు. సౌత్ ఇండస్ట్రీని పొగుడుతూ అలియా, రణబీర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. 


సన్నీకి ఐ లవ్యూ చెప్పిన అలియా..: అలియాభట్, రణబీర్ కపూర్ లను జంటగా చూసిన హౌస్ మేట్స్ బాగా ఎగ్జైట్ అయ్యారు. సన్నీ అయితే అలియా అంటూ గట్టిగా అరిచాడు. వెంటనే అలియా 'సన్నీ ఐ లవ్యూ' అని చెప్పింది. అది విన్న సన్నీ కిందపడిపోతూ కనిపించాడు. తను యాంకర్ గా పనిచేసినప్పుడు అలియాని కలిశానని.. ఆమెతో బాలయ్య డైలాగ్ చెప్పించానని.. మరోసారి వినాలనుకుంటున్నానని అడగ్గా.. 'దబిడి దిబిడే' అంటూ బాలయ్య డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది అలియా. 


బ్రహ్మాస్త్రం..: హౌస్ మేట్స్ తో బ్రహ్మాస్త్రం అనే గేమ్ ఆడించారు. ఇందులో టాప్ 5 కంటెస్టెంట్స్ తమలో ఉండే పవర్ గురించి చెప్పాలని.. ఎవరిదైతే బాగా నచ్చుతుందో వాళ్లకి 'బ్రహ్మాస్త్రం' ఇస్తామని చెప్పారు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చానని.. అదే తన పవర్ అని చెప్పాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా.. కామ్ గా ఉంటూ డెసిషన్ తీసుకోవడం తన పవర్ అని చెప్పాడు మానస్. ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. ఇండిపెండెంట్ గా ఉంటూ లక్ష్యాన్ని చేరుకోవడం తన పవర్ అని చెప్పాడు శ్రీరామ్. పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పాడు షణ్ముఖ్. స్మైల్ అండ్ కాన్ఫిడెన్స్ తన పవర్ అని చెప్పింది సిరి. మానస్ చెప్పిన ఆన్సర్ తనకు నచ్చిందని రాజమౌళి చెప్పడంతో.. అతడికి 'బ్రహ్మాస్త్రం' ఇచ్చారు.


స్టేజ్ పై పరంపరం టీమ్..: స్టేజ్ పైకి 'పరంపర' వెబ్ సిరీస్ టీమ్ మెంబర్స్ జగపతిబాబు, నవీన్ చంద్రని ఇన్వైట్ చేశారు నాగార్జున. ఈ సిరీస్ లో తను మంచివాడిగా నటించానని అన్నారు. జగపతిబాబు లాంటి నటుడితో కలిసి పని చేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు నవీన్ చంద్ర. డిసెంబర్ 24న ఈ సిరీస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది. 


స్టేజ్ పైకి రష్మిక, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ లను పిలిచారు నాగార్జున. 'పుష్ప' సినిమా గురించి టీమ్ తో మాట్లాడిన నాగార్జున.. రష్మిక, దేవిశ్రీప్రసాద్ లను హౌస్ లోకి పంపించారు. వారు హౌస్ మేట్స్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు. మీలో ప్రతి దాన్ని ఈజీగా తీసుకునేది ఎవరని శ్రీరామ్ ని ప్రశ్నించగా.. తనేనని చెప్పాడు శ్రీరామ్. మీలో రోజంతా ఎవరు తింటూ ఉండగలరని అడగ్గా.. హౌస్ మేట్స్ అందరూ కలిసి శ్రీరామ్ అని బదులిచ్చారు. మీలో టాస్క్ లో ఎక్కువగా చీట్ చేసేదెవరని అడగ్గా.. సన్నీ అని హౌస్ మేట్స్ చెప్పారు. మీలో అన్ని సీక్రెట్స్ బయటపెట్టేదెవరని ప్రశ్నించగా.. సిరి అని చెప్పారు. మీలో చిన్న చిన్న రీజన్స్ కి అప్సెట్ అయ్యేదెవరని అడగ్గా.. షణ్ముఖ్ అని చెప్పారు హౌస్ మేట్స్. 


సిరి అవుట్..: ఐదు డ్రోన్స్ లో ఒక్కోదానికి హౌస్ మేట్స్ ఫొటోలు ఉంటాయని.. అందులో ఒకటి ఎగిరిపోతుందని.. వాళ్లే ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. వీరిలో సిరి డ్రోన్ ఎగిరిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. 


స్టేజ్ పైకి సింగర్స్ ని పిలిచి వాళ్లతో టాప్ సాంగ్స్ పాడించారు. 'భీమ్లానాయక్', 'నీలాంబరి..', 'బంగార్రాజు', 'లాలా భీమ్లా', 'లాహే.. లాహే', 'జై బాలయ్య', 'సామీ సామీ', 'నాటు నాటు' ఇలా ఈ ఏడాది హిట్స్ సాంగ్స్ ను పాడించారు. 


హౌస్ మేట్స్ కి నాని ఆఫర్, మానస్ అవుట్..:'శ్యామ్ సింగరాయ్' సినిమా నటీనటులు నాని, సాయి పల్లవి, కృతిశెట్టిలు స్టేజ్ పైకి వచ్చారు. ముందుగా సాయిపల్లవి, కృతిశెట్టిలను హౌస్ లోకి పంపించారు. ఆ తరువాత నానిని ఓ సిల్వర్ బాక్స్ తో హౌస్ లోకి పంపించారు నాగార్జున. అలా వెళ్లిన నాని హౌస్ మేట్స్ కి ఒక ఆఫర్ చేశారు. తన చేతిలో ఉన్న సిల్వర్ బాక్స్ కావాలంటే ఈ నిమిషమే బయటకు వచ్చేయాలని చెప్పారు. విన్నర్ ఒక్కరే అని.. ప్రాక్టికల్ గా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలని చెప్పారు. కానీ హౌస్ మేట్స్ ఎవరూ కూడా ఆ ఆఫర్ ని తీసుకోలేదు. ఆ తరువాత హౌస్ మేట్స్ తో గేమ్ ఆడించి.. మానస్ ఎలిమినేట్ అయినట్లు అనౌన్స్ చేశారు. 


స్టేజ్ పైకి నాగచైతన్యని ఇన్వైట్ చేశారు నాగార్జున. చైతు.. ప్రోకబడ్డీ లీగ్ లో తెలుగు టైటన్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 22 నుంచి ఈ షో టెలికాస్ట్ కాబోతుందని చెప్పారు. 


శ్రీరామచంద్ర అవుట్..: నాగచైతన్య గోల్డెన్ బ్రీఫ్ కేస్ పట్టుకొని హౌస్ లోకి వెళ్లారు. సిల్వర్ సూట్ కేస్ కంటే ఇందులో మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ ఉందని హౌస్ మేట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ ముగ్గురూ కూడా ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హౌస్ మేట్స్ ని ఫ్యామిలీ సజెషన్ తీసుకోమని అడగ్గా.. వాళ్లు కూడా సూట్ కేసు తీసుకోవద్దని చెప్పారు. ఆ తరువాత చిన్న గేమ్ ఆడి శ్రీరామచంద్ర ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. 


షణ్ముఖ్ అవుట్.. విన్నర్ గా సన్నీ..: ఎప్పుడూ కూడా విన్నర్, రన్నరప్ ని స్టేజ్ పై అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఈసారి హౌస్ నుంచే నేరుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్తామని నాగార్జున అన్నారు. నటి ఫరియా అబ్దుల్లాను హౌస్ లోకి పంపించి షణ్ముఖ్, సన్నీల టెన్షన్ ని ఈజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆమెతో కలిసి సన్నీ, షణ్ముఖ్ డాన్స్ లు చేశారు. ఆ తరువాత వారిద్దరితో చిన్న గేమ్ ఆడించారు. అందులో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో చెప్పకుండా టెన్షన్ పెట్టారు. బిగ్ బాస్ మీతో గేమ్ ఆడారంటూ.. నాగార్జున మరింత టెన్షన్ పెట్టారు. ఫైనల్ గా నాగార్జున హౌస్ లోకి వెళ్లి సన్నీ, షణ్ముఖ్ లను స్టేజ్ పైకి తీసుకొచ్చారు. చాలా మంది షణ్ముఖ్ గెలవాలని కోరుకున్నారు. కానీ ఎక్కువ ఫాలోయింగ్ సన్నీ సంపాదించడంతో అతడే ట్రోఫీ కొట్టేశాడు. అతడికి రూ.50 లక్షల క్యాష్ ప్రైజ్, సువర్ణకుటీర్ లో పాతిక లక్షల విలువైన ఫ్లాట్ ను ఇచ్చారు. అలానే టీవీఎస్ అపాచీ బైక్ ను ఇచ్చారు. 


Also Read: నిర్మాతగా పవన్.... మేనల్లుడితోనా? అబ్బాయితోనా?


Also Read: లక్ష్మీ మంచుకు యాక్సిడెంట్... అసలు ఏమైందంటే?


Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!


Also Read: 'ఆర్ఆర్ఆర్'కు కరోనా అలా కలిసొచ్చింది. లేదంటేనా...


Also Read: రాజమౌళి తర్వాత రవితేజతో... బాలకృష్ణ జోరు ఎక్కడా తగ్గట్లేదుగా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి