బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఐదో సీజన్ కోసం సిద్ధమవుతోంది. నిజానికి ఇప్పటికే షో టెలికాస్ట్ కావాల్సింది కానీ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఇప్పుడు టెలికాస్ట్ చేయడానికి తేదీలను ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. సెప్టెంబర్ 5 నుండి ఈ షో బుల్లితెరపై వీక్షకులను అలరించడానికి రాబోతుంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఇప్పటికే బాగా ఆలస్యం కావడంతో ఎట్టిపరిస్థితుల్లో సెప్టెంబర్ నెలలో మొదలుపెట్టాలని నిర్వాహకులు నిర్ణయించుకున్నారట. 


ప్రముఖ ఛానెల్ స్టార్ 'మా'లో ప్రసారం అయ్యే బిగ్ బాస్ సీజన్ 1కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా ఈ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్. అతడి హోస్టింగ్‌ను ఎవరూ బీట్ చేయలేకపోతున్నారు. రెండో సీజన్ కోసం హీరో నానిని తీసుకొచ్చారు. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 3, సీజన్ 4 లకు సీనియర్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 5 కి హోస్ట్ ఎవరు కానున్నారనే వార్తలు వస్తున్నాయి. నాగార్జునకు బదులుగా హీరో రానాను తీసుకోబోతున్నట్లు టాక్. కానీ ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో త్వరలో తెలియనుంది.


ఐదో సీజన్ పై నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇప్పటికే అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో సెట్ నిర్మాణం పూర్తయినట్లు తెలుస్తోంది. కంటెస్టెంట్లను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ప్రతి సీజన్ మాదిరే ఈసారి కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదేనంటూ కొంతమంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ జాబితాలో యాంకర్ వర్షిణి, యాంకర్ రవి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి, సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్, హీరోయిన్ ఈషా చావ్లా, యాంకర్ శివ, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, లోబో, సింగర్ మంగ్లీ, యాంకర్ ప్రత్యూష, టిక్ టాక్ స్టార్ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ-విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి. 


అయితే వీరిలో ఎంతమందిని ఫైనల్ చేశారో తెలియదు. రీసెంట్ గా యాంకర్ రవిని ఇదే విషయంపై ఓ నెటిజన్ సోషల్ మీడియాలో ప్రశ్నించగా.. ''ఏమో మరి.. అంట'' అంటూ వెటకారంగా బదులిచ్చాడు. దీన్ని బట్టి ఆయనైతే బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని తెలుస్తోంది.