Nandamuri Balakrishna About Legend Movie: దశాబ్దం కిందట విడుదలైన సూపర్ డూపర్ హిట్ మూవీ ‘లెజెండ్’. నటసింహం బాలకృష్ణ హీరోగా, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. జగపతి బాబు విలన్‌గా, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్లుగా ఇందులో నటించారు. ‘సింహా’ లాంటి అద్భుత విజయం తర్వాత బాలయ్య, బోయపాటి కాంబోలో ఈ చిత్రం తెరకెక్కింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ సంచలన విజయాన్ని అందుకుంది.


ఆ సీన్ డూప్ లేకుండా చేశా: బాలయ్య


మార్చి 28తో ఈ సినిమా విడుదలై దశాబ్దం పూర్తయ్యింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఇందులో హీరో బాలయ్య, హీరోయిన్ సోనాల్ చౌహాన్, దర్శకుడు బోయపాటి శ్రీనుతో పాటు నిర్మాతలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాలయ్య పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ఓ ఫైట్ ను డూప్ లేకుండా చేసినట్లు చెప్పారు. దర్శకుడు కచ్చితంగా డూప్ ఉండాలని చెప్పినా, పట్టుబట్టి తానే ఆ యాక్షన్ సీన్ కంప్లీట్ చేసినట్లు తెలిపారు.


‘లెజెండ్’ సినిమాలో వైజాగ్‌లో బాలయ్య ఫైట్ సీన్ ఉంటుంది. బీచ్ రోడ్‌లో బాలయ్య గుర్రం మీద వెళ్తూ చేసే సన్నివేశం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఈ సీన్‌లో బాలయ్య గుర్రంతో పాటు ఓ అద్దాన్ని పగలగొట్టి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ సీన్ చేస్తే బాలయ్యకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని దర్శకుడు బోయపాటి డూప్ పెట్టాలి అనుకున్నారట. అదే విషయాన్ని బాలయ్యకు చెప్పారట. కానీ, ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదట. కచ్చితంగా ఆ సీన్ తానే చేస్తానని చెప్పారట. అనుకున్నట్లుగానే ఈ సీన్ అద్భుతంగా వచ్చిందని  బాలయ్య వెల్లడించారు.  


బాలయ్యతో బోయపాటి హ్యాట్రిక్ మూవీస్


నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి కాంబినేషన్‌లో మూడు సినిమాలు తెరకెక్కాయి. అన్ని సినిమాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. వీటిలో ‘సింహ’ సినిమా 2010లో రాగా, ‘లెజెండ్’ 2014లో విడుదల అయ్యింది. ‘అఖండ’ చిత్రం 2021లో విడుదల అయ్యింది. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. భారీగా వసూళ్లు సాధించడంతో పాటు పలు రికార్డులను నెలకొల్పాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్లీ సినిమాలు రావాలని బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పటికే మూడు హిట్లు అందుకున్న ఈ కాంబో, మరోసారి రికార్డుల మోత మోగించాలని ఆకాంక్షిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘NBK109’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


Read Also: సుహాస్‌తో జోడీ కడుతోన్న ‘జో’ బ్యూటీ - ‘ఓ భామ అయ్యో రామా’ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ