ఆహా ఓటీటీలో వస్తోన్న అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ షోలో ప్రస్తుతం సెకండ్ సీజన్ నడుస్తోంది. మొదటి సీజన్ లో బాలకృష్ణ తన టైమింగ్ తో షో ను ఆసక్తికరంగా మార్చారు. దీంతో ఈ షో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అందుకే లేట్ చేయకుండా మరో సీజన్ కు ముహూర్తం పెట్టేశారు ఆహా టీమ్. ప్రస్తుతం ఈ షోకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అన్ స్టాపబుల్ షో కి వైఎస్ షర్మిల ను గెస్ట్ గా పిలవడానికి సన్నాహాలు చేస్తోందట ఆహా టీమ్. ఇందుకు భారీగానే ఏర్పాట్లు కూడా చేస్తోందని టాక్. 


ఇప్పటికే మొదటి షోకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హాజరయ్యారు. దీంతో ఈ కార్యక్రమంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ, చంద్రబాబుల మధ్య సంభాషణలు అందర్నీ ఆకట్టుకున్నాయి. వ్యక్తిగత విషయాలతో పాటు రాజకీయ అంశాలను కూడా చర్చించారు. ఈ సందర్భంలోనే 1995లో జరిగిన రాజకీయ సంఘర్షణ గురించి గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. ఎక్కువగా బాలకృష్ణ చంద్రబాబు మధ్య రాజకీయ అంశాలపైనే  సీరియస్‌గా చర్చ జరిగింది. ఈ ఎపిసోడ్ తర్వాత అందరూ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లనే తీసుకొచ్చింది ఆహా టీమ్. సెకండ్ ఎపిసోడ్ కు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు. ఇక మూడో ఎపిసోడ్ కి హీరోలు శర్వానంద్, అడవి శేష్ వచ్చారు. మొదటి సీజన్ లో కేవలం సినిమా వాళ్లనే తీసుకొచ్చిన ఆహా ఈసారి సెకండ్ సీజన్ లో పొలిటీషియన్స్ ను కూడా ఆహ్వానించడంతో ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. 


ఇప్పుడు తరువాత ఎపిషోడ్ కు వైఎస్ షర్మిల రాబోతోందని వార్తలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ రాజకీయంగానూ యాక్టీవ్ గా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే గా కూడా ఉన్నారు. ప్రత్యర్ధులపై ఆయన స్టైల్ లో విమర్శలు చేస్తూ ఉంటారు బాలయ్య. దీంతో అన్ స్టాపబుల్ లో రాజకీయ నాయకులనూ తీసుకురావడానికి ఈ పాయింట్ తోడైంది. వైఎస్ షర్మిల ఈ షోకు వస్తే ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చనీయాంశంగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైెెఎస్సార్టీపీ పార్టీ ను స్థాపించి, పార్టీ ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు. 


అక్కడ పార్టీ ను అధికారంలోకి తీసుకుని రావాలని గత కొద్ది నెలలుగా ఎంతగానో కష్టపడుతున్నారు షర్మిల. షర్మిల పాలిటిక్స్ లో మరింత ఎదిగేలా కార్యాచరణ చేస్తున్నారు. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం పై ఎప్పుడూ విమర్శలు గుప్పించే షర్మిల.. అప్పుడప్పుడు ఏపీ రాజకీయాలపై, ప్రభుత్వ తీరుపై కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. బాలకృష్ణ టీడీపీ ఎమ్మెల్యే కావడం,  షర్మిల ఏపీ ప్రభుత్వం పై వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో అలజడి పుట్టించే విధంగా ఉన్నాయనే చెప్పొచ్చు. అయితే అన్ స్టాపబుల్ షో కి షర్మిల రాక ను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈ షోకి షర్మిల ఎప్పుడు వస్తారో, వస్తే ఏం మాట్లాడతారో చూడాలి.


Also Read: ఆ అమ్మాయి పేరు మాత్రం చెప్పద్దు ప్లీజ్ - శర్వాకు బాలయ్య రిక్వెస్ట్ - అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమో