నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో విలన్ క్యారెక్టర్‌కు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (Arjun Rampal) ను ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ సమాచారం. ఆల్రెడీ ఆయనకు బాలయ్య ఓకే చేయడం... అర్జున్ రాంపాల్ కథ విని ఓకే చేయడం జరిగాయట.


మరింత మంది బాలీవుడ్ ఆర్టిస్టులు!?
ఒక్క విలన్ పాత్రకు మాత్రమే... కొన్ని కీలక పాత్రలకు హిందీ చిత్ర పరిశ్రమలో పేరున్న నటీనటులను తీసుకోవాలని అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నారట. ఆ ప్రయత్నాల్లో ఆయన ఉన్నారట. 


బాలయ్యకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్!?
బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో కథానాయికగా ఈ మధ్య త్రిష (Trisha) పేరు బలంగా వినిపించింది. అయితే... ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేశారని, ఆ తర్వాత ఆమె కంటే బాలీవుడ్ హీరోయిన్ అయితే బెటర్ అనే నిర్ణయానికి వచ్చారట. 'పొన్నియిన్ సెల్వన్' సక్సెస్ తర్వాత త్రిష రెమ్యూనరేషన్ పెరిగిందని టాక్. ఇప్పుడు కథానాయిక అన్వేషణ శరవేగంగా జరుగుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఏం జరుగుతుందో చూడాలి. బాలీవుడ్ హీరోయిన్, ఆర్టిస్టులు ఉంటే... ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయవచ్చు. ఆల్రెడీ 'అఖండ'కు ఉత్తరాదిలో మంచి స్పందన లభించింది. అందువల్ల, బాలయ్య అంటే అక్కడ ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ ఉంటాయి. 


Also Read : నయనతార హారర్ 'కనెక్ట్' - ఇది పాండమిక్ ఫియర్?



నవంబర్ నుంచి సెట్స్ మీదకు... 
స్పీడుగా సినిమాలు చేయడం బాలకృష్ణ స్టైల్. చకచకా షూటింగులు పూర్తి చేస్తారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా చేస్తున్న ఆయన... నవంబర్ నుంచి అనిల్ రావిపూడికి డేట్స్ ఇచ్చారు. ఆలోపు హీరోయిన్ సెలక్షన్ కంప్లీట్ కావాలి. బాలకృష్ణ కు 108వ చిత్రమిది. అందుకని NBK 108 గా పిలుస్తున్నారు. ప్రస్తుతానికి అదే వర్కింగ్ టైటిల్. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది, సాహూ గారపాటి NBK108 ను నిర్మిస్తున్నారు.


తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్. ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల (Sree Leela) ఎంపిక అయ్యారు. మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.


'అన్‌స్టాప‌బుల్‌' డిస్కషన్!
ఇటీవల సినిమా వార్తలతో కంటే టాక్ షో 'అన్‌స్టాప‌బుల్‌ 2' కారణంగా బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో చర్చకు కారణం అయ్యింది. ఎక్కడ చూసినా ఆ ఎపిసోడ్‌లో మాట్లాడిన అంశాల గురించే డిస్కషన్. కొత్త ఎపిసోడ్ కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి అతిథులుగా వస్తున్నాయని టాక్. చంద్రబాబు, లోకేష్ తర్వాత మరోసారి రాజకీయ ప్రముఖులను బాలకృష్ణ షోకి తీసుకు వస్తున్నారన్నమాట.