నందమూరి బాలకృష్ణ ఈ పేరు గురించి ఆయనకు దగ్గరగా ఉన్నవాళ్లు ఒకలా, ఆయన్ను దూరం నుంచి చూసిన వాళ్ళు ఇంకోలా చెప్తుంటారు. ఇండస్ట్రీలో ఉన్నది ఉన్నట్టు మాట్లాడే కొద్దిమందిలో బాలకృష్ణ ఒకరు. అందుకే సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. గతేడాది 'అఖండ' సినిమాతో మాస్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు 'వీర సింహా రెడ్డి' తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సినిమాలతో పాటు డిజిటల్ తెరపై కూడా బాలయ్య తన మార్క్ చూపిస్తున్నారు. 'ఆహా' ఓటీటీలో ప్రసారమౌతోన్న 'అన్ స్టాపబుల్' ప్రోగ్రాంతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు బాలయ్య. 


ఇటీవలే అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్, బాలకృష్ణ మధ్య జరిగిన సంభాషణ అందర్నీ ఆకట్టుకుంది. అల్లు శిరీష్ బాలయ్యను కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానికి బాలయ్య సమాధానాలు చెప్తూనే కౌంటర్ లు ఇచ్చారు. దీంతో సభా ప్రాంగణం అంతా నవ్వులు విరిశాయి. తర్వాత అల్లు శిరీష్ బాలయ్య సినిమాలో తనకు ఒక క్యారెక్టర్ ఇవ్వాలని, అది కూడా తన్నులు తినే క్యారెక్టర్ కాకుండా మీతో డైలాగ్ చెప్పే క్యారెక్టర్ ఇవ్వాలని అడగడంతో దానికి వెంటనే బాలయ్య ఓకే అన్నట్టు సైగ చేశారు. మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. తర్వాత బాలయ్య పరసురామ్ ను పిలిచి ‘‘శిరీష్ కు ఓ క్యారెక్టర్ ఇవ్వవయ్యా. నేను అతన్ని మార్చేదో, అతను నన్ను మార్చేదో ఏదోటి ఇవ్వు‘‘ అని చెప్పడంతో ప్రాంగణంలో నవ్వులు పూశాయి.


ఈ సంభాషణ విన్న తరువాత అందరికీ ఓ క్లారిటీ వచ్చింది. అదేంటంటే.. పరశురామ్ చెప్పే కథ బాలకృష్ణ కు నచ్చితే వెంటనే సినిమా పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ కాంబో ఓకే అయితే అందులో అల్లు శిరీష్ కూడా ఓ క్యారెక్టర్ చేయడం పక్కా అని తెలుస్తోంది. ఫైనల్ గా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో పరశురాం దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. దీంతో అల్లు శిరీష్, నందమూరి బాలకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో అని ఊహించేసుకుంటున్నారు అల్లు, నందమూరి ఫ్యాన్స్. 


వాస్తవానికి నందమూరి, అల్లు ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎన్టీ రామారావు టైమ్ నుంచే నందమూరి అల్లు ఫ్యామిలీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారి ఇరువురి ఇళ్ళు కూడా పక్క పక్కనే ఉండేవట. వారి పిల్లలు కూడా కలిసి ఆడుకునేవారట. ఎన్టీఆర్ ఫ్యామిలితో  అల్లు రామలింగయ్యకు ఉన్న చనువు మరెవ్వరికి ఉండేది కాదట. ఈ విషయాలన్నీ బాలయ్య ఇటీవలే ఓ కార్యక్రమంలో చెప్పారు. అందుకే అల్లు అరవింద్ అడగగానే బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' కార్యక్రమానికి వెంటనే ఒప్పుకున్నారు. ఈ షో ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అందుకే వెంటనే 'అన్ స్టాపబుల్ 2'ను రెడీ చేశారు అల్లు అరవింద్. ఈ టాక్ షో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇది కాకుండా అల్లు అరవింద్ నిర్మాణ సంస్థలో త్వరలో బాలయ్య ఓ సినిమా కూడా చేయనున్నట్లు తెలియడంతో వీరి స్నేహానుబంధం మరోసారి తేటతెల్లమైంది. ప్రస్తుతం బాలయ్య 'వీర సింహ రెడ్డి' సినిమాలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గోపీ చంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా శ్రుతీ హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.


Also Read : బాలకృష్ణ సినిమా కోసమూ వెయిట్ తగ్గా - ఫ్లాష్‌బ్యాక్‌లో, ప్రజెంట్‌లో...