బాలీవుడ్ తెరకెక్కుతున్న బడా ప్రాజెక్టులకు టాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. తాజాగా బీటౌన్ లో ‘ది ఇమ్మోర్ట‌ల్స్ అశ్వ‌త్థామ‌’ అనే చిత్రం రూపొందుతోంది. జాతీయ అవార్డు గ్రహీత, ‘ఉరి’ ఫేమ్  ఆదిత్య ధ‌ర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ మైఠలాజికల్ ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో హీరో కోసం ఇద్దరు టాలీవుడ్ హీరోల పేర్లను ఆయన పరిశీలిస్తున్నారట. అందులో ఒకరు అల్లు అర్జున్ కాగా, మరొకరు జూనియర్ ఎన్టీఆర్.


పరిశీలనలో అల్లు అర్జున్, ఎన్టీఆర్ పేర్లు


‘RRR’ చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు జూ. ఎన్టీఆర్. అలాగే ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సత్తా చాటారు అల్లు అర్జున్. వీరుకున్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఒకరిని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని ఆదిత్య ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా ఈ సినిమా గురించి బాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. తొలుత ఈ సినిమాలో ‘ఉరి’ హీరో విక్కీ కౌశల్ ను హీరోగా తీసుకోవాలని భావించారు. ఆ తర్వాత మరో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ, వీరిద్దరినీ పక్కన పెట్టేశారు. బన్నీ లేదంటే ఎన్టీఆర్ తో ఈ సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. వీరికున్న క్రేజ్ ను ఉపయోగించుకుని దేశ వ్యాప్తంగా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు.  


ప్రతిష్టాత్మక చిత్రంలో ఛాన్స్ కొట్టేది ఎవరు? 


సూపర్ హిట్ చిత్రం ‘ఉరి ది సర్జికల్ స్ట్రైక్’ తెరకెక్కించిన తర్వాత ఆదిత్య ధర్  ‘ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ అనే డ్రీమ్ ప్రాజెక్టు చేపట్టారు. గతంలో ఈ చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించేందుకు ఓకే చెప్పారు. ఆ సమయంలో విక్కీ కౌషల్ ను హీరోగా అనుకున్నారు. అయితే, కారణాలు బటయకు తెలియకపోయినా, ఈ ప్రాజెక్టు నుంచి రోనీ తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో జియో స్టూడియోస్ ఈ చిత్రాన్ని టేకప్ చేసింది. ఆ సమయంలో హీరోగా రణ్ వీర్ సింగ్ ను తీసుకోవాలి అనుకున్నారు.  తాజాగా వీరి స్థానంలో ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. హిందూ ఇతిహాసం మహాభారతంలోని అశ్వత్థామ కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో  సమంత హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   


‘RRR’ చిత్రం తర్వాత జూ. ఎన్టీఆర్ కు మంచి మైలేజ్ వచ్చింది. పాన్ ఇండియన్ మార్కెట్ లో బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘వార్ 2’లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా, ఎన్టీఆర్ విలన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు.  యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.


Read Also: ‘బాహుబలి‘ రేంజిలో తెరకెక్కుతున్న సూర్య లేటెస్ట్ మూవీ, టైటిల్ ఫిక్స్, విడుదల ఎప్పుడంటే?