టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ నటించిన ‘కార్తికేయ 2’  దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో పెద్దగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత ఆయన నుంచి వస్తోన్న మరో సినిమా ‘18 పేజెస్’. ‘కుమారి 21ఎఫ్’ సినిమాకు దర్శకత్వం వహించిన సూర్యప్రతాప్ పల్నాటి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'ఏడురంగుల వాన' అనే పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ‘ఏడు రంగులు వాన..  రెండు కళ్ళల్లోన.. కారణం ఎవరంటే..’ అంటూ సాగే ఈ సాంగ్ ను ఆదివారం నిర్మాత అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. అనంతరం చిత్ర బృందం సినిమా విశేషాలను మీడియా మిత్రులతో పంచుకున్నారు. 


ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. వరుసగా నెలకొక సినిమా విడుదల చేస్తున్నా తమని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ‘18 పేజెస్’ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదని, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు అని తెలిపారు. సుకుమార్ తనతో ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దామని చెప్పారని, బన్నీ వాసు కూడా తెగ సంబరపడిపోయాడని అన్నారు.  సూర్యప్రతాప్ సినిమాను చాలా బాగా తీశారని, గోపీ సుందర్ మ్యూజిక్ కూడా చాలా బాగుందన్నారు. ‘కార్తికేయ 2’ సినిమా తరువాత అదే జోడీతో ఈ ‘18 పేజెస్’ సినిమా రావడం సంతోషంగా ఉందన్నారు అరవింద్. హీరో నిఖిల్ చాలా కష్టపడి వర్క్ చేస్తాడని అన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పై నిర్మాత అల్లు అరవింద్ ప్రశంసలు కురిపించారు. అనుపమ న్యాచురల్ యాక్టింగ్ అంటే తనకు ఇష్టమని, తనను చూసినప్పుడల్లా ఆమెలాంటి కూతురు ఉంటే బాగుండేదని అనిపిస్తుందని అన్నారు. సినిమాలో ప్రతీ ఒక్కరూ చాలా బాగా నటించారని అన్నారు. ఒక విభిన్నమైన లవ్ స్టోరీతో వస్తున్నామని అన్నారు. ఈ నెల 23 న సినిమా రిలీజ్ అవుతుందని ప్రతీ ఒక్కరూ తమ సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను  అని అన్నారు అల్లు అరవింద్.


కార్యక్రమంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. గీతా ఆర్ట్స్ లాంటి ప్రొడక్షన్ హౌస్ లో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతీ యాక్టర్ కు గీతా ఆర్ట్స్ లో పనిచేయాలని ఉంటుందని అన్నారు. అలాగే సుకుమార్ రైటింగ్ లో చేయడం కూడా చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమాను దర్శకుడు సూర్యప్రతాప్ చాలా అద్భుతంగా తీశారని, గోపి సుందర్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చిందన్నారు. తాను చేసిన ‘కార్తికేయ 2’ సినిమా కంటే లోతైన సబ్జెక్టు ఉన్న సినిమా ఈ ‘18 పేజెస్’ అని చెప్పారు. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని, ఓపెన్ మైండ్ సినిమాకు రండి.. వెళ్లేటప్పుడు ఫ్రెష్ ఫీల్ తో బయటకు వస్తారని అన్నారు నిఖిల్. ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదని సినిమా చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి లోనవుతారని చెప్పారు. ‘కార్తికేయ 2’ తర్వాత తన భవిష్యత్ సినిమాలపై భయం, బాధ్యత పెరిగాయని, ప్రతీ సినిమా బాధ్యతతో చేస్తానని చెప్పుకొచ్చారు. ఈ సినిమా తర్వాత చేసే సినిమాలు అన్నీ పాన్ ఇండియా సబ్జెక్టులేనని, ‘స్పై’ సినిమా కూడా చేయనున్నట్లు తెలిపారు నిఖిల్. 


Also Read: ‘కాంతార’, ‘పుష్ప’ సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్