సౌత్ ఇండియన్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియన్ సెల్వన్-1’. పీడియాడికల్ డ్రామా తెరకెక్కిన ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.  చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష సహా పలువురు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయ్యింది.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సినిమా యూనిట్ ఇప్పటికే దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు ముఖ్య నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నది. ఆడియన్స్ కు సినిమాపై అంచనాలను భారీగా పెంచే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ముంబైలో జరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అందాల సుందరి ఐశ్వర్య రాయ్ తన ముద్దుల కూతురు ఆరాధ్యతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా ‘పొన్నియన్ సెల్వన్-1’ సెట్స్ లో జరిగిన ఓ విషయాన్ని వెల్లడించింది. తొలిసారి పీరియాడికల్ డ్రామా చూడడం పట్ల ఆరాధ్య ఎలా ఎగ్జైట్ అయ్యిందో వివరించింది.   


ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ‏తో కలిసి  ఆరాధ్య ‘పొన్నియిన్ సెల్వన్-1’ సెట్స్ లో సందడి చేసిందట. “ఈ అద్భుత చిత్రం సెట్ చూసి ఆరాధ్య ఎంతో ఆశ్చర్యానికి లోనైంది. తొలిసారి ఒక పీరియాడికల్ డ్రామా చూసి అద్భుతంగా ఫీలైంది. నేను ఉన్నప్పుడు చిత్రీకరించిన సీన్లు చూసి తను ఎంతో మగ్దురాలు అయిపోయింది. ఆమె కళ్లలో ఎంతో అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. ఆరాధ్య సెట్స్ లోకి వచ్చినప్పుడు ఓ సీన్ కు యాక్షన్ చెప్పిమని అవకాశం ఇచ్చారు దర్శకుడు. ఆ అవకాశం ఇప్పటి వరకు మాకెవరికీ రాలేదు. అది ఆరాధ్యకు మాత్రమే దక్కిన గౌరవం. మున్ముందు తను ఈ సన్నివేశాన్ని గుర్తుంచుకుని ఎంతో సంతోషపడుతుంది” అని ఐశ్వర్య వెల్లడించింది. 


మణిరత్నం దర్శకత్వంలో ఐశ్యర్య నాలుగో సినిమా చేస్తోంది. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన యువరాణి నందిని క్యారెక్టర్‌ని చేస్తోంది. ఇంతకు ముందు ఆమె నటించిన మూడు సినిమాలు చక్కటి విజయాన్ని అందుకున్నాయి. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా కూడా విజయాన్ని అందుకుంటుందని సినిమా యూనిట్ భావిస్తోంది. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఐశ్వర్య పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో మళ్లీ తను ట్రాక్ లోకి వచ్చే అవకాశం ఉంది.


‘పొన్నియిన్ సెల్వన్’ అనే పీరియాడికల్ సినిమా కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ‘పొన్నియిన్ సెల్వన్’ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‏తో ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, లాల్, శోభితా ధూళిపాళ్ల కీలకపాత్రలలో నటించారు. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.