మాతర్మే మధు కైటభఘ్ని మహిష ప్రాణాప హారోద్యమే
హేలా నిర్మిత ధూమ్రలోచన వధే, హేచండ ముండార్దిని!
నిశ్శేషీకృత రక్తబీజ దనుజే! నిత్యే! నిశుంభావహే
శుంభధ్వంసిని సంహారాశు దురితం దుర్గే - నమస్తేంబికే!!


స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి రూపం ఎలా వచ్చిందంటే..
దుర్గముడు అనే రాక్షసుడి ఘోర తపస్సుకి మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అని అడగ్గా.."నాకు వేదములన్నీ వశము కావాలి ", దేవతలను జయించాలి " అని అన్నాడు. అప్పుడు చతుర్ముఖుడు తధాస్తు అనక తప్పలేదు. వేదాలన్నీ దుర్గముడిలోకి ప్రవేశించాయి..బ్రాహ్మణులంతా వేదాలు మర్చిపోయారు, సంధ్యావందనాలు లేవు, యజ్ఞయాగాలు లేవు, దేవతలకు హవిస్సు లేక విలవిల్లాడిపోయారు. దేవతలు సంతృప్తి చెందకపోవడంతో వర్షాలు లేవు, పంటలు లేవు భూమండలం అంతా క్షీణించిపోయింది. జనులంతా నాశనమైపోతుంటే దుర్గముడు సంతోషిస్తాడు. అప్పుడు దేవతలంతా కలసి అమ్మని ప్రార్థిస్తారు. అలా ప్రత్యక్షమైన మొట్టమొదటి అమ్మ స్వరూపానికి " శతాక్షి " అని పేరు పెట్టారు.


Also Read: దసరాల్లో పిల్లలకు పూజ చేస్తుంటారు కదా - ఏ వయసు పిల్లల్ని పూజిస్తే ఎలాంటి ఫలితం!


ఒంటి నిండా కళ్లతో దర్శనమిచ్చిన శతాక్షి అమ్మ..దేవతల ఆవేదనంతా విని..మిమ్మల్ని చూసేందుకు ఇన్ని కళ్లు పెట్టుకుని ఉన్నాను ఎందుకు భయం అని అభయం ఇచ్చింది. అప్పుడు అమ్మవారు..తన ఒంటినిండా ఉన్న కళ్లనుంచి నీరు కారుస్తూ బ్రహ్మాండం అంతా కరుణరసాన్ని నింపేసింది. అప్పటికప్పుడే మళ్లీ పరిస్థితులన్నీ మారిపోయాయి. యజ్ఞయాగాదులు లేక హవిస్సు సమర్పించకపోవడం వల్ల ఆకలిగా ఉందమ్మా..నిన్ను స్తుతి చేయడానికి కూడా ఓపిక లేదని అనడంతో శాకాంబరిదేవిగా అవతరించింది అమ్మవారు. అందరికి పళ్ళు,కాయగూరలు ఇచ్చింది. మళ్లీ హోమాలు మొదలయ్యాయి, యజ్ఞాలు జరిగాయి..దేవతలకు హవిస్సు వచ్చింది. 


Also Read: శరన్నవరాత్రుల్లో పాడ్యమి నుంచి దశమి వరకూ అమ్మవారికి రోజుకో రంగు ప్రత్యేకం


ఎండి నీరసపడిపోయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ చిగిరించడం చూసి దుర్గముడు ఆలోచనలో పడతాడు. అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది. దుర్గముడితో యుద్ధానికి సిద్ధమైన అమ్మ..ముందు దేవతలందరకీ రక్షణ కవచం వేసి పదకొండు రోజుల పాటూ యుద్ధం చేసి దుర్గముడి బాధనుంచి విముక్తి కల్పించింది, వేదాలను రక్షించింది. దేవతలకు రక్షణ కవచం వేసి అందర్నీ కాపాడినందునే నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మని " స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి" రూపంలో పూజిస్తారు. 


అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... 


దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురాలైన మహాతల్లి, రక్కసి మూకలను అడ్డగించిన అమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనం, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.


విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం విశిష్ఠత తెలిసినా, తెలియకపోయినా పోతనరాసిన ఈ పద్యం చదివినట్టైతే అన్నీ సత్ఫలితాలుంటాయని పండితులు చెబుతారు.