బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ చిక్కుల్లో పడ్డారు. ఆమెకు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాసిక్ లోని తన భూములకు సంబంధించి పన్ను సరిగ్గా చెల్లించకపోవడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఏడాది కాలంగా ఆమె ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించడం లేదని అధికారులు తెలిపారు. అందుకే ఆమెకు నోటీసులు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఐశ్వర్య రాయ్ తో పాటు మొత్తం 1200 మందికి నోటీసులు జారీ చేసినట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు.


ప్రాపర్టీ ట్యాక్స్ విషయంలో ఐశ్వర్య రాయ్ కి నోటీసులు


ఐశ్యర్యా రాయ్‌ కి నాసిక్‌ సిన్నార్‌లోని అవడీ ప్రాంతంలో భూమి ఉంది. సుమారు హెక్టీరు విస్తీరణంలో ఉన్న ఈ భూమికి ఆమె ఏడాదికి  రూ.21,960 చెల్లించాలి. కానీ, ఆమె గత ఏడాదిగా ట్యాక్స్ చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు చర్యలకు దిగారు. నోటీసులు అందిన 10 రోజుల్లో ట్యాక్స్ చెల్లించాలని ఆదేశించారు. లేదంటే మహారాష్ట్ర భూ రెవెన్యూ చట్టం, 1966లోని సెక్షన్ 174 ప్రకారం ఐశ్వర్యపై తగిన చర్యలు తీసుకుంటామని నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆమెకు ట్యాక్స్ విషయంలో పలుమార్లు గుర్తు చేసినట్లు సిన్నార్ తహసీల్దార్ కార్యాలయ అధికారులు తెలిపారు. ఆమె స్పందించకపోవడం వల్లే తదుపరి చర్యల కోసం నోటీసులు ఇచ్చినట్లు వెల్లడించారు.   


పలువురు ప్రముఖులకు నోటీసులు


ఇక ఐశ్వర్య రాయ్ తో పాటు పలువురు ప్రముఖులు సైతం ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి నోటీసులు జారీ చేశారు.  ఎల్బీ కుంజీర్ ఇంజినీర్, గుమ్ ప్రైవేట్ లిమిటెడ్, ఐటీసీ మరాఠా లిమిటెడ్, హోటలే లీలా వెంచర్ లిమిటెడ్, ఎస్ కే శివరాజ్, కుక్రేజా డెవలపర్ కార్పొరేషన్‌ తో పాటు పలు కంపెనీలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కంపెనీలు పన్ను చెల్లించకపోవడం వల్ల ప్రభుత్వానికి రూ.1.11 కోట్లు నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు. చివరి అవకాశంగా మార్చి వరకు ట్యాక్స్ చెల్లించాలని వెల్లడించారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.   


ఐశ్వర్యను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు


ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించకపోవడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్న ఐశ్వర్య వేల రూపాయలు ట్యాక్స్ కట్టలేదా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.  ఐశ్వర్య ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చారిత్రక ఇతిహాసం ‘పొన్నియిన్ సెల్వన్’లో కనిపించింది. కార్తీ, విక్రమ్, జయం రవి, త్రిష కృష్ణన్, ఐశ్వర్య లక్ష్మి నటించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది.  పొన్నియిన్ సెల్వన్: II, ఏప్రిల్ 2023లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య అదే కీలక పాత్ర పోషించనుంది.






Read Also: నటి అమలా పాల్‌కు అవమానం, ఆలయంలోకి రానివ్వని అధికారులు