టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ సినిమాలు కంటే వెబ్ సిరీస్ లలోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన కొత్త వెబ్ సిరీస్ ‘న్యూసెన్స్’. ఈ సిరీస్ ఆహా ఓటీటీ వేదికపై స్ట్రీమింగ్ కానుంది. గతంలో ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది ఆహా టీమ్. ఆ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. తాజాగా నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ నుంచి మరో లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. నవదీప్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది యూనిట్. ఈ వెబ్ సిరీస్ లో నవదీప్ జర్నలిస్ట్ శివ పాత్రలో కనిపించనున్నాడు. 


ఈ వెబ్ సిరీస్ ను శ్రీప్రవీణ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తోంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ ఆహా తో కలసి ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది. తాజాగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కోసం ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ కలసి పనిచేస్తున్నాయి. అటు నవదీప్ కూడా ‘ఆహా’తో కలసి గతంలో పనిచేశారు. ఆయన గతంలో ‘మస్తీ’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. అది ఆహా లో స్ట్రీమింగ్ అయింది. ఈ ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ లో బిందు మాధవి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సురేష్ బొబ్బిలి ఈ వెబ్ సిరీస్ కు సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి రిలీజ్ డేట్ ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. 






ఇక యంగ్ హీరో నవదీప్ 2004 లో వచ్చిన ‘జై’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమాను దర్శకుడు తేజ తెరకెక్కించారు. ఈ సినిమాతో నటుడుగా మంచి గుర్తింపు తుచ్చుకున్నారు నవదీప్. తర్వాత వరుసగా సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నారు. తెలుగుతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలు కూడా చేశారు నవదీప్. అయితే ఎక్కువగా హీరో పాత్రలు కంటే సహాయ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు. ‘ఆర్య 2’ తర్వాత నవదీప్ కు చెప్పుకోదగ్గ సినిమా ఏమీ లేదనే చెప్పాలి. అయినా అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఇటు టీవీ ప్రోగ్రాంలలోనూ కనిపించారు. అలాగే ఇప్పుడు వెబ్ సిరీస్ లలో ఎక్కువగా కనిపిస్తున్నారు నవదీప్. ఆయన నటించిన పలు వెబ్ సిరీస్ లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి కూడా. తాజాగా ఆయన ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ తో ఎంత మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటారో వేచి చూడాలి.


Also Read : రాజమౌళి ఫ్యామిలీపై కేంద్రం ప్రత్యేక ప్రేమ చూపిస్తుందా? ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?