మొట్టమొదటి తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ మరో కొత్త షోతో మన ముందుకు రాబోతుంది. ‘కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్’ పేరుతో తెలుగులో మొట్టమొదటి ఓటీటీ కామెడీ షోను తీసుకువస్తుంది. దీనికి కావాల్సిన సెటప్‌ను కూడా భారీగానే అరేంజ్ చేశారు.


ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తుండగా  సద్దాం, జబర్దస్త్ అవినాష్, యాదమ్మ రాజు, ఎక్స్‌ప్రెస్ హరి, భాస్కర్ వంటి ప్రముఖ కమెడియన్లు ఇందులో కంటెస్టెంట్లుగా కనిపించన్నారు. సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి హోస్ట్‌లుగా ఉండనున్నారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమ్ కానుంది.


దీనికి సంబంధించిన ప్రోమోను శనివారం విడుదల చేశారు. ఈ ప్రోమోలో షో కాన్సెప్ట్‌ను రివీల్ చేశారు. మొత్తం మూడు రౌండ్లలో జరిగే ఈ కామెడీ షోలో విజేతలను ఏ ఎపిసోడ్‌కి ఆ ఎపిసోడ్‌లో పాల్గొన్న ప్రేక్షకులే ఓటింగ్ ద్వారా ఎంపిక చేయనున్నారు.


స్టాండప్ కామెడీ, స్కిట్‌లు ఇలా అన్నీ రకాల ఫార్మాట్లు ఇందులో ట్రై చేశారు. ప్రోమో ఆకట్టుకునేలాగానే ఉంది. కాబట్టి జబర్దస్త్‌కు మంచి ప్రత్యామ్నాయం అయ్యే అవకాశం ఉంది. అన్‌స్టాపబుల్, శామ్ జామ్, ఇండియన్ ఐడల్, డాన్స్ ఐకాన్ తరహాలో కొన్ని ఎపిసోడ్లు చేసి ఆపేస్తారా? లేకపోతే నిరంతరాయంగా కొనసాగిస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది.