హీరో రాజ్ తరుణ్ ఇటీవల పోస్ట్ చేసిన ఓ వీడియో  బాగా వైరల్ అయింది. తన జీవితంలో అమ్మాయిల గురించి మాట్లాడే పరిస్థితి వస్తుందని అనుకోలేదని,  అసలు అమ్మాయిలకు తన జీవితం లో చోటు లేదని  ఓ వీడియో విడుదల చేశాడు. తీరా పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయితే ఆ టైం లోనే ఆ అమ్మాయి మిస్ అయిందని, ఆ అమ్మాయిని ఎక్కడున్నా వెతికి పట్టుకొని ఫోటో ఇంటర్నెట్ లో పెడతాను అని రిలీజ్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో గత మూడు రోజులుగా రాజ్ తరుణ్ కు ఏమైంది అని తెగ కామెంట్స్ పెడుతున్నారు. తీరా చూస్తే అది రాజ్ తరుణ్  చేయబోతున్న 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్స్ విడియో అని తేలిపోయింది. 


ప్రస్తుతం సినిమాలతో పాటు పోటీగా వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి. వెబ్ సిరీస్ ల కు బాగా క్రేజ్ రావడంతో ఎంతో మంది సినిమా యాక్టర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ వెబ్ సిరీస్ లు డిజిటల్ తెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే చాలా మంది సెలబ్రిటీలు వెబ్ సిరీస్ లలో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇక అదే బాటలో హీరో రాజ్ తరుణ్ కూడా వచ్చేశాడు. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న రాజ్ తరుణ్ 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ లో ఓటీటీ లో సందడి చేయనున్నారు.


రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న 'అహ నా పెళ్ళంట' టీజర్ ను ఇటీవల జి5 సంస్థ విడుదల చేసింది. ఈ టీజర్ వెబ్ సిరీస్ పై ఆసక్తిని పెంచేలా ఉందనే చెప్పాలి. హీరో చిన్నప్పుడే ఏ అమ్మాయిని చూడకూడదు అని తల్లి ఒట్టు వేయించుకుంటుంది. అయితే విచిత్రంగా హీరో అమ్మాయిలను చూసిన ప్రతీ సారీ ఏదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో అతను అమ్మాయిల వైపు చూడటమే మానేస్తాడు. చివరకు పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని హీరో ఇంట్లో చెప్తే.. తీరా పెళ్లి ఫిక్స్ అయ్యాక తన లైఫ్ లోకి ఇంకో రావడంతో కథ మళ్ళీ మలుపు తిరుగుతుంది. అప్పుడు హీరో పరిస్థితి ఏంటి అనే అంశం పై ఈ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు కనిపిస్తోంది టీజర్ చూస్తుంటే..


మొత్తంగా టీజర్ చూస్తుంటే సిరీస్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ఇందులో ఫన్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్, రొమాన్స్.. ఇలాంటి అన్ని అంశాలు  పుష్కలంగా ఉండటంతో ఈ వెబ్ సిరీస్ పై ఆసక్తి నెలకొంది. దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న ఈ వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్లంట’ జీ5, తమాడా మీడియా సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. యూత్, ఫ్యామిలీ, లవ్, కామెడి ఎంటర్‌టైనర్‌గా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటి ఆమని, హర్షవర్థన్, పోసాని, మధుసూధన్ తదితరులు ప్రధాన పాత్రలు గా చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ గా రూపొందనుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 17 నుంచి జి5 ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది.


Also Read: 'ఫ్యాన్స్ నన్ను కొడతారు' - ప్రభాస్‌తో సినిమాపై మారుతి కామెంట్స్!