నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ‘కిర్రాక్ పార్టీ’ మూవీతో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.  అమ్మడు అందానికి, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అల్లు అర్జున్, సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. 


Also Read: మరోస్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి, వరుస ఆఫర్లతో ఫుల్ జోష్


వరుస సినిమాలతో రష్మిక ఫుల్ బిజీ


రష్మిక మందన్న తాజాగా అర డజనుకు పైగా చిత్రాల్లో నటిస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తోంది. ప్రస్తుతం ఈ కూర్గ్ బ్యూటీ లైనప్ లో 7 సినిమాలు ఉన్నాయి. ‘పుష్ప’ సినిమా తర్వాత తెలుగులో కాస్త వెనుకబడినా, ఇతర సినిమా పరిశ్రమల్లో వరుస అవకాశాలను పొందుతోంది. ప్రస్తుతం రష్మిక ‘పుష్ప: ది రూల్’ మూవీ షూటింగ్ లో బిజీగా ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో విడుదలకు రెడీ అవుతోంది. ‘పుష్ప: ది రైజ్’ సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం రూపొందుతోంది.  ఈ సినిమాతో పాటు ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రాబోతున్న మూవీలో ర‌ష్మిక హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఇప్పటికీ రెండు సినిమాల్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన రష్మిక, మరో సినిమాలో రొమాన్స్ చేసేందుకు రెడీ అయినట్లు సమాచారం. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ తెరకెక్కనుంది. ఈ సినిమాలో తొలుత శ్రీలీల‌ను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తన ప్లేస్ లో రష్మికను ఫిక్స్ చేశారట.   


Also Read: అండర్ వాటర్ లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్, 'దేవర' నుంచి పూనకాలొచ్చే అప్ డేట్ !


రెండేళ్ల వరకు నో డేట్స్!


మరోవైపు ధ‌నుష్, శేఖ‌ర్ క‌మ్ముల కాంబోలో రూపొందుతోన్న ద్విభాషా చిత్రంలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌ గా చేస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనితో పాటు మరో రెండు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ కనిపించబోతోంది. ఇప్పటికే ‘రెయిన్‌ బో’ అనే సినిమాను మొదలు పెట్టింది. అటు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో మరో చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఆరు సౌత్ మూవీస్ తో పాటు బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సందీప్ వంగాల కాంబోలో వస్తున్న ‘యానిమల్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని అవకాశాలు వచ్చినా, డేట్స్ కుదరక పోవడంతో వాటిని వదులుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు సంవత్సరాల వరకు ఆమె డేట్స్ దొరకడం కష్టమనే టాక్ నడుస్తోంది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial