Karate kalyani: టాలీవుడ్ లో నటి కరాటే కళ్యాణి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె తన వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఎప్పుడూ ఏదొక విషయంపై కాంట్రవర్సీ గా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటుంది కళ్యాణి. ఇటీవల స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులు శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని మే 28 న ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసుకుంటే చేసుకోండి అంతే కాని శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదు అని కామెంట్లు చేసింది. దీనిపై న్యాయ పోరాటానికి కూడా దిగింది. అయితే విగ్రహ ఏర్పాటుపై కోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి కరాటే కళ్యాణి పేరు వార్తల్లో మారుమోగుతోంది. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తనపై దాడులకు ప్రయత్నించారని, తనకు ప్రాణ గండం ఉందని, తనను చంపడానికి యత్నించారని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


నా కార్ టైర్ లు కోసేశారు: కరాటే కళ్యాణి 


ఇంటర్వ్యూలో కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. తనకు ప్రాణ హాని ఉందని చెప్పుకొచ్చింది. ఈ మధ్యనే తన కారు రెండు టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసేశారని వెల్లడించింది. తాను ఈ మధ్యన హిందుత్వ వాదులతో కలసి కార్లో ఏదో గుడి దగ్గర గొడవ జరుగుతుంది అంటే తన కార్ లో వెళ్లామని అటునుంచి తిరిగి ఓ డొంక రోడ్ లో వస్తున్నపుడు తన కార్ టైర్ పేలిపోయిందని చెప్పింది. వాస్తవానికి అదే టైరు ఏ హైవే మీద వెళ్తున్నపుడో పేలి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని వాపోయింది. ఆ కార్ టైరు చూసిన మెకానిక్ లు ముందే ఎవరో కార్ టైరును కొంచెం కోసేశారని చెప్పారని చెప్పింది. తన మీద కోపం తోనే ఎవరో కావాలని అలా చేశారని అంది. 


ఆ స్థానంలో ఎవరు ఉన్నా ఇలాగే పోరాడతాను..


ఈ గొడవకు టీడీపీ కు సంబంధం లేదని అంది కళ్యాణి. రాజకీయం అంతా ఖమ్మం లోనే జరుగుతుందని ఆరోపించింది. అయితే ఎన్టీఆర్ కు దైవత్వాన్ని ఆపాదించే క్రమంలో కొంతమంది ఎన్టీఆర్ విగ్రహాన్ని కృష్ణుని రూపంలో పెడుతున్నారని ఆరోపించింది. కృష్ణుడికి ఒక రూపం ఉందని ఆయన రూపంలో మనుషులను విగ్రహాలు పెట్టడం సరికాదని పేర్కొంది. ఈ విషయంలో తనను శ్రీకృష్ణుడే తనకు అండగా ఉంటారని, అందుకే కోర్టు రెండు సార్లు స్టే విధించిందని అంది. అయితే ఎన్టీఆర్ కు తాను పెద్ద అభిమానినని కానీ ఆ స్థానంలో ఎవరు ఉన్నా తాను పోరాడతామని పేర్కింది. తనను మా అసోసియేషన్ నుంచి తీసేయడం వలన తనకు నష్టం ఏమీ లేదని తెలిపింది. హిందుత్వ వాదిగా, యాదవ సంఘం నాయకురాలిగా తనకు గుర్తింపు ఉందని చెప్పింది. భవిష్యత్ తరాల కోసమే తాను పోరాడుతున్నానని, ఏదేమైనా శ్రీకృష్ణుని విషయంలో తన పోరాటం కొనసాగుతుందని చెప్పుకొచ్చింది.


Also Read: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?