కోలీవుడ్ లో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విష్ణు విశాల్. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా.. హీరోగా నిలదొక్కుకున్నారు. ఇప్పుడు అతడు తెలుగు మార్కెట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే 'అరణ్య' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ నటుడు ఇప్పుడు 'ఎఫ్ఐఆర్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. 

 

ఉగ్రవాద నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి మంచి హిట్ టాక్ వచ్చింది. అదే సమయంలో ఈ సినిమాలో చూపించిన కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. ముస్లింలతో పాటు హిందువుల్లో ఓ వర్గం ఈ సినిమా పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముస్లింలను ఉగ్రవాదులుగా చూపించడాన్ని ఆ వర్గం వాళ్లు తప్పుబడుతున్నారు. హిందువులు కూడా ఉగ్రవాదుల్లో భాగమే అన్నట్లుగా చూపించడాన్ని హిందువులు తప్పుబడుతున్నారు. 

 

ఈ అంశాల కారణంగానే 'ఎఫ్ఐఆర్' సినిమాకి సెన్సార్ ఇబ్బందులు కూడా వచ్చాయి. కొన్ని దేశాల్లో ఈ సినిమా రిలీజ్ కి అనుమతివ్వలేదు. ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డ్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వీటన్నింటినీ దాటుకొని సినిమాను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తెలంగాణలో ఈ సినిమా విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎంఐఎం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఈ సినిమాను నిషేధించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

 

సినిమా పోస్టర్ లో కనిపించే కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని.. ముస్లింలను తప్పుగా చూపించేలా ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని యాదవ్ ను కలిసి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి..!