Varun Tej: టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు ఈ కుర్ర హీరో. 2014 లో ‘ముకుంద’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చిన వరుణ్ మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘తొలిప్రేమ’, ‘ఎఫ్ 2’, ‘గద్దలకొండ గణేష్’, ‘ఎఫ్ 3’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఓ వైపు ‘గాండీవధారి అర్జున’ సినిమాలో నటిస్తూనే మరో క్రేజీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. ‘వీటీ 13’మూవీ చిత్రీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఆయన ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. తాజాగా ఆ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వచ్చింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 


వరుణ్ తేజ్ తాజాగా నటిస్తోన్నVT13కు శక్తి ప్రతాప్ హదా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రారంభించి చాలా రోజులు అవుతోంది. మూవీ నుంచి కూడా ఇటీవలే కొత్తగా ఏమీ అప్డేట్ లు రాలేదు. అయితే తాజాగా వరుణ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ ను తీసుకొచ్చారు. గ్వాలియర్ లో షూటింగ్ షెడ్యూల్ పూర్తయినట్లు తెలిపారు. అంతేకాదు లొకేషన్ నుంచి ఓ ఫోటోను రిలీజ్ చేశారు. ఇందులో వరుణ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఎదురుగా జెట్ విమానం కూడా కనిపిస్తోంది. దీంతో ఈ మూవీ షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ పోస్ట్ చూసి మెగా అభిమానులు మురిసిపోతూ కామెంట్లు చేస్తున్నారు. 


ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో పలు వివరాలను వరుణ్ వెల్లడించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పారు. పాన్ ఇండియా లెవల్ లో సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. దీంతో ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మూవీలో మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్, రినైజాన్స్ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమాతో వరుణ్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు. 


ఈ సినిమాతో పాటు వరుణ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ మూవీను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ సరసన సాక్షి హీరోయిన్ గా నటిస్తుంది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ‘గరుడ వేగ’ వంటి బ్లాక్ బస్టర్ మూవీతో పరిశ్రమను ఆకర్షించిన ప్రవీణ్ సత్తారు ఈ మూవీతో ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి.