బాలీవుడ్ ఖాన్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ మాత్రం ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా ఘోర పరాభవంతో కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. తరచుగా ఈ ముగ్గురు ఖాన్స్ కలుస్తూ ఉంటారు. తాజాగా సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ ఫ్యామిలీని కలిశారు. ఈ సందర్భంగా ఫోటోలు తీసుకున్నారు. అమీర్ సోదరి-నటి నిఖత్ హెగ్డే, తన భర్త సంతోష్ హెగ్డే, కుమార్తె సెహెర్ హెగ్డే, తల్లి జీనత్ హుస్సేన్‌ తో పాటు సల్మాన్ ఈ ఫోటోల్లో ఉన్నారు. బ్లాక్ టీ షర్ట్, బ్లూ డెనిమ్ వేసుకుని సల్మాన్ నవ్వుతూ ఫోటోకు ఫోజు ఇచ్చారు. అమీర్ ఖాన్ మాత్రం మిస్సయ్యారు.  






కెమెరా మెన్ గా మారిన అమీర్ ఖాన్


తొలుత ఈ ఫోటోను నిఖత్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, చాలా మంది అభిమానులు అమీర్ ఏమయ్యారు? అని ప్రశ్నించారు. "అమీర్ సోదరి, తల్లితో సహా అతడి కుటుంబ సభ్యులను  సల్మాన్ కలిశారు. ఇంతకీ, అమీర్ ఎక్కడ ఉన్నారు? దయచేసి సల్మాన్‌, అమీర్‌ల ఫోటోను అప్‌లోడ్ చేయండి” అని అభిమానులు కోరారు.  ఈ నేపథ్యంలో నిఖత్ రెండో మరో ఫోటోను షేర్ చేసింది. మొదటి ఫోటోను క్లిక్ చేసింది తన సోదరుడు అమీర్ అని ఆమె వెల్లడించింది. అమీర్ తన ఫోన్‌ లో ఫోటోలు తీస్తున్న బ్లాక్ అండ్ వైట్ ఫోటోను  పోస్ట్ చేసింది.  ఈ పోస్టుకు "అమీర్‌ను మిస్ అయిన వారి కోసం అంటూ (నవ్వుతున్న ఎమోజితో)" అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో చూసి అభిమానులు “మొత్తానికి అమీర్ ఖాన్ ను కెమెరామెన్ ను చేశారన్నమాట” అని కామెంట్స్ పెడుతున్నారు.    






కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సల్మాన్


సల్మాన్ ఖాన్ తాజాగా ‘పఠాన్‌’లో అతిధి పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం తను నటిస్తున్న ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. రాబోయే ఈద్ కు ఈ సినిమా థియేటర్లలో అలరించనుంది. ఫర్హాద్ సామ్ జీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పూజా హెగ్డే, వెంకటేష్ దగ్గుబాటి, షెహనాజ్ గిల్, పాలక్ తివారీ, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కత్రినా కైఫ్‌తో కలిసి ‘టైగర్ 3’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు.   


సినిమాలకు విరామం ప్రకటించిన అమీర్ ఖాన్


అటు అమీర్ ఖాన్ చివరగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో కనిపించాడు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించన ఈ సినిమా బాయ్ కాట్ ఉద్యమం దెబ్బకు డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా ఘోర పరాభావంతో ఆయన సినిమాలకు విరామం ప్రకటించారు. సుమారు ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. “‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తర్వాత ‘ఛాంపియన్’ సినిమా చేయాలి అనుకున్నాను. అద్భుతమైన స్క్రిప్ట్, అందమైన కథ రెడీ చేసుకున్నాను. కానీ, ‘లాల్ సింగ్ చద్దా’ పరాభవంతో కొంత కాలం పాటు విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను” అని అమీర్ ఖాన్ వెల్లడించారు.


Read Also: హ్యాపీ బర్త్ డే కామెడీ కింగ్, లెక్చరర్ టు టాప్ కమెడియన్ - బ్రహ్మానందం గురించి ఆసక్తికర విషయాలు మీకోసం!