యువ హీరో శర్వానంద్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్ళు మీకు జోహార్లు'. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ', 'చిత్రలహరి' సినిమాలు తీసిన కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై  సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు.


నిజం చెప్పాలంటే... 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' అనూహ్యంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైన సినిమా. ఫిబ్రవరి 25న వస్తుందా? లేదా? మిగతా పాన్ ఇండియా సినిమా విడుదల తేదీలు ఏంటి? అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో ధైర్యంగా సినిమా యూనిట్ విడుదల తేదీ ప్రకటించింది.





'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా విషయానికి వస్తే... చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఒక్క పాట మినహా సినిమా పూర్తయింది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమల సినిమాను తెరకెక్కించారట. ఆల్రెడీ శర్వానంద్, రష్మిక జోడి అనేసరికి ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. టైటిల్ వల్ల ఈ సినిమాలో మహిళలకు మంచి ప్రాధాన్యత ఉన్నట్టు తెలుస్తోంది.


ఖుష్బూ, రాధికా శరత్ కుమార్, ఊర్వశీ ప్రధాన  పాత్రల్లో, 'వెన్నెల' కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోపరాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్.