ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల మరో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఇందులో యూపీ మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, అభిషేక్ మిశ్రాను పేర్లు ఉన్నాయి.





కుషీనగర్‌లోని ఫాజిల్‌నగర్ సీటును మౌర్యకు కేటాయించారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు అభిషేక్ మిశ్రాను లఖ్‌నవూలోని సరోజినీ నగర్ నుంచి బరిలోకి దింపారు. మరో అభ్యర్థి పల్లవి పటేల్‌ను కౌశాంబి స్థానం నుంచి పోటీకి దింపారు. గత నెలలో స్వామి ప్రసాద్ మౌర్య.. భాజపా నుంచి బయటకు వచ్చారు.







స్వామి ప్రసాద్ మౌర్య భాజపాకు రాజీనామా చేసిన తర్వాత 3 రోజుల్లో మరో 8 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. అంటే మొత్తం 9 మంది రాజీనామా చేసినట్లైంది. ఇందులో ముగ్గురు మంత్రులు ఉన్నారు.


దళితులను విస్మరించారు..


స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.


తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.



దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగ యువత, చిన్న వ్యాపారులను భాజపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ కారణంగానే నేను యోగి ఆదిత్యనాథ్ మంత్రి మండలికి రాజీనామా చేశాను. నా రాజీనామా.. భాజపాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో 2022 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తేలుతుంది.                                            "
- స్వామి ప్రసాద్ మౌర్య   






 

ఆయనే కారణమా?

 

యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై యూపీ భాజపాలో అసంతృప్తి ఉందని ఇప్పటికే పలువురు నాయకులు బహిరంగంగానే చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా రాజీనామాలతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండు నెలల ముందే యోగి ఆదిత్యనాథ్ గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మౌర్య ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కానీ దాన్ని అధిష్ఠానం పెద్దగా పట్టించుకోలేదు.