Andhra Pradesh News: ఏపీ(Andhra Pradesh)లో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు(Parliament), అసెంబ్లీ(Assembly) ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP)- తెలుగు దేశం పార్టీ(TDP)-జ‌న‌సేన(Janasena) చేతులు క‌లిపి పొత్తు పెట్టుకున్న విష‌యం తెలిసిందే. అంటే, టీడీపీ, జ‌న‌సేన‌లు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA) కూట‌మిలో చేరాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ పార్టీలు సంయుక్తంగా ముఖ్య‌మంత్రి(CM) వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పార్టీ వైఎస్సార్ సీపీ(YSRCP)పై పోటీ చేయ‌నున్నాయి. అయితే.. అస‌లు ఆరు సంవ‌త్స‌రాల‌కుపైగానే ఎన్డీయే కూట‌మికి దూరంగా ఉండ‌డం.. ఇప్పుడు ఎన్నిక‌ల‌కు ముందు బీజేపీతో టీడీపీ చేతులు క‌లిపి ఎన్డీయేలో చేరిక‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఈ సందేహాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్ర‌బాబు(Chandrababu) మాత్ర‌మే స‌మాధానం చెబుతూ వ‌చ్చారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న‌ను పార‌దోలేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపించేందుకు బీజేపీతో చేతులు క‌లిపామ‌ని ఆయ‌న వ్యాఖ్యానిస్తూ వ‌స్తున్నారు. 30 ఏళ్ల వెన‌క్కి వెళ్లిపోయిన‌ రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాట‌లో న‌డ‌వాలంటే కేంద్రం స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని.. అందుకే బీజేపీతో చేతులు క‌లిపామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. కేంద్రంతో త‌మ‌కు ఎలాంటి విభేదాలు లేవ‌న్నారు. అయితే..ఈ విష‌యంపై ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీ నుంచి ఎవ‌రూ స్పందించ‌లేదు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర హోం మంత్రి(Home minister) అమిత్‌షా(Amithsha) తాజాగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. 


మేం వెళ్లాల‌ని చెప్ప‌లేదు!


``చంద్ర‌బాబును మేం ఎన్డీయే కూట‌మి నుంచి వెళ్లిపోవాల‌ని చెప్ప‌లేదు. ఆయ‌నంత‌ట ఆయ‌నే వెళ్లిపోయారు. తిరిగి మ‌ళ్లీ ర‌మ్మ‌ని కూడా అన‌లేదు. ఆయ‌నంత‌ట ఆయ‌నే తిరిగి వ‌చ్చి చేతులు క‌లిపారు. ఎన్డీయే కూట‌మిలో ఉన్న ఎవ‌రినైనా మేం కాద‌న‌లేదు. వ‌చ్చి క‌లుస్తామంటే వ‌ద్ద‌న‌లేదు`` అని అమిత్ షా(Amithsha)  వ్యాఖ్యానించారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి ఓ ప్ర‌ధాన వార్తా సంస్థ ఢిల్లీలో నిర్వ‌హించిన కాంక్లేవ్‌(స‌ద‌స్సు)లో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానం చెప్పారు. టీడీపీ-జ‌న‌సేన‌ల‌తో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే జ‌త క‌ట్ట‌డంపై అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానమిస్తూ.. 2018లో చంద్ర‌బాబు త‌నంత‌ట తానే ఎన్డీయే కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని.. అప్పుడు తాము అడ్డు చెప్ప‌లేద‌ని అన్నారు. అయితే.. త‌మ‌ను కాద‌నుకున్న త‌ర్వాత‌.. చంద్ర‌బాబు(Chandrababu) 2019లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో ఓడిపోయార‌ని షా చెప్పారు. దీంతో ఆయ‌న రియ‌లైజ్ అయ్యార‌ని చెప్పారు. 


అందుకే అడ్డు చెప్ప‌లేదు


గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలోనే తిరిగి ఎన్డీయే(NDA) కూట‌మిలో చేరేందుకు చంద్ర‌బాబు ఆస‌క్తి చూపించార‌ని అమిత్ షా(Amithsha)  చెప్పారు. వ‌స్తామ‌న్న పార్టీకి తాము అడ్డు చెప్ప‌బోమ‌ని, అందుకే చేతులు క‌లిపామ‌ని వ్యాఖ్యానించారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో వైఎస్సార్ సీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి చెందిన ఎంపీలు బీజేపీకి మ‌ద్ద‌తుగా అనేక సంద‌ర్భాల్లో ఎన్డీయేకి స‌హ‌క‌రించారు క‌దా.. ఇప్పుడు ఆయ‌న‌పైనే ఎందుకు త‌ల‌ప‌డుతున్నార‌న్న ప్ర‌శ్న‌కు కూడా అమిత్ షా ఆసక్తిక‌ర స‌మాధానం చెప్పారు.


మ‌ద్ద‌తు వేరు.. పొత్తులు వేరు!


``పార్ల‌మెంటులో ఓటింగుకు, రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పొత్తుల‌కు సంబంధం ఉండ‌దు. పార్టీల మ‌ద్ద‌తు ద్వారా పార్ల‌మెంటులో ప్ర‌జ‌లే ఓటేస్తారు. ఈ అంచనా మీదే ఎంపీలు ఓటేస్తారు. వైఎస్సార్ సీపీ మాకు అన్ని సంద‌ర్భాల్లోనూ అనుకూలంగా ఓటేయ‌లేదు. మూడు సార్లు మా విధానాల‌ను వ్య‌తిరేకించింది. ఓటింగుకు దూరంగా ఉంది. రాజ‌కీయ పార్టీల మ‌ద్ద‌తుతో పొత్తులు ఏర్ప‌డ‌వు. విధానాల ప‌రంగానే ఏర్ప‌డ‌తాయి`` అని బీజేపీ నేత అమిత్ షా వ్యాఖ్యానించారు. 


కుదిరిన పొత్తులు 


2018లో టీడీపీ.. ఎన్డీయే కూట‌మి నుంచి వైదొలిగిన విష‌యం తెలిసిందే. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాలంటూ.. ధ‌ర్మ పోరాటాల పేరుతో అప్ప‌టి ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ చంద్ర‌బాబు ఢిల్లీ వేదిక‌గా నిర‌స‌నలు వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో కేంద్రానికి, రాష్ట్రానికి మ‌ధ్య స్నేహ పూరిత వాతావ‌ర‌ణం దెబ్బ‌తింది. అప్ప‌టి వ‌ర‌కు కేంద్రంలోని ఎన్డీయే ప్ర‌భుత్వంలో మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్ గ‌జ‌ప‌తి రాజు, సుజ‌నా చౌద‌రి(ప్ర‌స్తుతం బీజేపీ)లు రాజీనామా చేశారు.ఈ క్ర‌మంలోనే 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ పోరు సాగించింది. ఆ ఎన్నిక‌ల్లో 3 పార్ల‌మెంటుస్థానాల‌కు, 23 అసెంబ్లీ స్థానాల‌కే ప‌రిమిత‌మైంది. అయితే.. ఆరేళ్ల త‌ర్వాత‌.. తిరిగి ఇరు పార్టీలకు మ‌ధ్య సంధి ఏర్ప‌డింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన‌లు క‌లిసి ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఇప్ప‌టికే టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్ల‌మెంటు సీట్లు తీసుకోగా, బీజేపీ 10 అసెంబ్లీ,  6 పార్ల‌మెంటు స్థానాలు  తీసుకుంది. ఇక‌, పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంటు స్థానాలు ద‌క్కాయి.


Also Read: నేడు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు


Also Read: వైసీపీ కోవర్టులకు చంద్రబాబు టికెట్! కొన్ని సీట్లు అమ్ముకున్నారు: తిక్కారెడ్డి సంచలనం