Telangana Political Situation Due to Election Schedule: కేంద్ర ఎన్నికల సంఘం లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీ సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను శనివారం ప్రకటించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ట్వీట్ చేసింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పొలిటికల్ హీట్ నెలకొనగా.. ఈసీ ప్రకటనతో ఇక అసలైన ఎన్నికల హడావుడి మొదలు కానుంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ చేస్తున్నాయి. ఓటరన్నను ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలతో మమేకమవుతూ.. ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. కాగా, తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల బీఆర్ఎస్ అధికారానికి ఫుల్ స్టాప్ పెడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం 'హస్త'గతం చేసుకుంది. ఈ క్రమంలో లోక్ సభ ఎన్నికల్లో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి ప్రస్తుతం పార్టీల బలాబలాలు, పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే..


వంద రోజుల 'ప్రజాపాలన'


తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సీఎంగా డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి శుక్రవారంతో వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. తొలి రోజే 'ప్రగతి భవన్' గేట్లను తొలగించి.. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్ఫష్టం చేసిన సీఎం.. ఆ దిశగా అడుగులు వేశారు. 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు వంటి వాటిని తొలి రెండు రోజుల్లోనే అమలు చేశారు. ఆ తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500 గ్యాస్ సిలిండర్ వంటి పథకాలతో పాటు ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభించారు. ఓవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూనే.. మరోవైపు ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ తనదైన రీతిలో పాలనను గాడిన పెడుతున్నారు.


ఓ వైపు పాలనపై దృష్టి సారిస్తూనే.. ఇటు లోక్ సభ సమరానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న క్రమంలో ఇప్పుడు మరింత ఫోకస్ తో 17 ఎంపీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చేలా వ్యూహాలు రచిస్తున్నారు. వంద రోజుల్లో తాము చేసిన మంచిని ప్రజలకు వివరిస్తూ ఎక్కువ ఎంపీ స్థానాలు కైవసం చేసుకునేలా సభల్లోని ప్రచారాల్లో కొత్త పంథాతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ కచ్చితంగా రిపీట్ అయ్యేలా ఫోకస్ చేస్తున్నారు. 


ప్రతిపక్ష బీఆర్ఎస్..


పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితమైంది. అయితే, లోక్ సభ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ సత్తా చాటాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారించారు. గెలిచే అవకాశాలున్న వారికే ఈసారి ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు. ఈసారి బీఎస్పీతో పొత్తు పెట్టుకుని కేసీఆర్ లోక్ సభ ఎన్నికలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆ పార్టీకి 2 సీట్లు కేటాయించారు. వంద రోజుల కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీల అమల్లో లోపాలను ప్రజల్లోకి  బలంగా తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. రైతు రుణమాఫీ, ఇతర హామీలను అమలు చేయాలనే డిమాండ్ ను బలంగా వినిపిస్తున్నారు. కాంగ్రెస్ అధికారాన్ని ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకోవాలనే ఉపయోగిస్తుందని ఆరోపిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి మళ్లీ పుంజుకోవాలని భావిస్తోన్న గులాబీ పార్టీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.


బీజేపీ ఫోకస్


అటు, బీజేపీ సైతం తెలంగాణ లోక్ సభ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. 17 స్థానాల్లో 10 స్థానాలకు పైగా విజయం సాధించేలా ఆ పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేసింది. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించి కమలం శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపారు. ప్రధాని మోదీ సైతం శుక్రవారం రోడ్ షో నిర్వహించారు. ఎక్కువ ఎంపీ స్థానాల్లో విజయం సాధించేలా బీజేపీ అభిమానులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 3 రోజులు ప్రధాని తెలంగాణలోనే పర్యటించనున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలన, బీఆర్ఎస్ హయాంలో వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు. ఓ దశలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందనే రాజకీయ విశ్లేషకుల భావన. మరి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.